Harish Rao Counters Chidambaram: హంతకుడే సంతాపం తెలిపినట్లుగా చిదంబరం తీరు - హరీశ్ రావు గట్టి కౌంటర్

ABP Desam Updated at: 16 Nov 2023 04:13 PM (IST)

Harish Rao News: చిదంబరం వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా మంత్రి హరీశ్ రావు స్పందించారు. చిదంబరం వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

చిదంబరం, హరీశ్ రావు (ఫైల్ ఫోటోలు)

NEXT PREV

Harish Rao counters to Chidambaram: కాంగ్రెస్ నేత చిదంబరం (Chidambaram) తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపిన‌ట్టుగా ఉందని మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రకటన చేసిన చిదంబరం.. దాన్ని వెనక్కి తీసుకున్న ఫలితంగా కదా ఉద్యమంలో యువకులు బలిదానం చేసిందని గుర్తు చేశారు. చిదంబరం (Chidambaram) తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు (Harish Rao) ఎక్స్‌లో కౌంటర్ ఇచ్చారు. అప్పట్లో మద్రాసు రాష్ట్రం ఉండేద‌ని, తెలంగాణ రాష్ట్రం లేకుండే అని చిదంబరం (Chidambaram Comments) మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్ అనేది ఓ రాష్ట్రంగా ఉండేద‌నే  విషయాన్ని ఆయ‌న మరిచిపోతున్నారని విమర్శించారు. తెలంగాణ అప్పులు, ఆదాయంపై చిదంబరం దుష్ప్రచారం చేస్తున్నారని.. తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కన్నా ఎంతో  బాగుందని గ్రహిస్తే మంచిదని హరీశ్ రావు (Harish Rao Comments) హితవు పలికారు.



పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం గురించి  చిదంబరం  మాట్లాడటం దొంగే దొంగ అన్నట్టుగా ఉంది. పొట్టి శ్రీరాములు ఆంధ్రా రాష్ట్రం గురించి ఉద్యమించినపుడు కేంద్రంలో అధికారం లో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అప్పటి నెహ్రు గారి ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే కదా పొట్టి శ్రీరాములు చనిపోయింది? చరిత్ర తెలియనిది  కేసీఆర్ గారికి కాదు.. చిదంబరమే చరిత్ర తెలియకుండా వ‌క్ర భాష్యాలు చెబుతున్నారు-


తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆర్బీఐ నివేదికలు ఏం చెబుతున్నాయో చిదంబరం (Chidambaram) తెలుసుకుంటే మంచిది. చిదంబరం  ఒక్క ఛాన్స్ ఇవ్వండి  అంటే  నమ్మేందుకు తెలంగాణ ప్రజలు అమాయకులు కారు.  కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ కాదు పదకొండు సార్లు అవకాశమిచ్చారు. చిదంబరానికి దమ్ముంటే తన సొంత రాష్ట్రం తమిళనాడులో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేయాలి. తెలంగాణ సాధించింది కేసీఆర్ గారు, సాధించిన తెలంగాణను అభివృద్ది చేసి దేశానికే రోల్ మెడల్ గా నిలిపింది కేసీఆర్. ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసినా, ఎంతమంది వచ్చి దుష్ప్రచారం చేసినా.. యావత్ తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి వైపే ఉన్నరు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని దీవించబోతున్నరు’’ అని హరీశ్ రావు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.






తెలంగాణపై చిదంబరం కామెంట్స్


గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉందని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన   గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అర్బన్ నిరుద్యోగం దేశంలో కన్నా ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 80 వేల ఉద్యోగాలను భర్తీ చేయలేదన్నారు. దీంతో నిరుద్యోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఉందని స్పష్టం చేశారు. ఇది దేశ సగటు కన్నా ఎక్కువగా ఉందని చిదంబరం తెలిపారు.

Published at: 16 Nov 2023 04:10 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.