Malla Reddy: నన్ను చంపడానికి రేవంత్ కుట్ర చేసిండు, గూండాల్ని తెచ్చి జనంలో కలిపేసిండు : మల్లారెడ్డి

ABP Desam Updated at: 30 May 2022 10:27 AM (IST)

Minister Malla Reddy తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రెడ్డిల ముసుగులో ఒక 100 మందిని సభకు పంపి వెనక కూర్చొబెట్టి తనను హత్య చేసేలా ప్రణాళిక రూపొందించారని సంచలన ఆరోపణ చేశారు.

సీహెచ్ మల్లారెడ్డి (ఫైల్ ఫోటో)

NEXT PREV

రెడ్డి గర్జన సభలో తనపై రాళ్ల దాడి చేయించి, చంపించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేశారని మంత్రి మల్లా రెడ్డి ఆరోపించారు. రెడ్ల ముసుగులో ఆయనే మనుషుల్ని పంపారని అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నా ఆ నేరం తనపైకి రాదనే ఉద్దేశంతో ఈ సమయంలో దాడి చేయించాడని అన్నారు. ఇటీవల తాను రేవంత్ రెడ్డిని ప్రెస్ మీట్‌లో బాగా తిట్టానని, ఆ ప్రభావం ఫలితంగానే తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్నో ఏళ్ల నుంచి రేవంత్ రెడ్డి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని అన్నారు.


మంత్రి సీహెచ్ మల్లారెడ్డి తన నివాసంలో సోమవారం (మే 30) మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రెడ్డిల ముసుగులో ఒక 100 మందిని సభకు పంపి వెనక కూర్చొబెట్టి తనను హత్య చేసేలా ప్రణాళిక రూపొందించారని సంచలన ఆరోపణ చేశారు. రేవంత్ రెడ్డి ఎంతో మందిని బ్లాక్ మెయిల్ చేశాడని ఆయన బాధితులు ఇంత వరకూ ఎవరూ నోరు విప్పలేదని అన్నారు. తాను నోరు విప్పినందుకే అడ్డుతొలగించుకోవాలని యత్నించాడని మల్లా రెడ్డి అన్నారు.


‘‘మల్లా రెడ్డి నా కన్నా పెద్దోడు అయిపోతున్నడని ఓర్వలేని తనం రేవంత్ రెడ్డికి ఉన్నది’’ అని మల్లా రెడ్డి అన్నారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గతంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, అందుకోసం రెడ్డి గర్జన సభ పెట్టి సీఎం కేసీఆర్‌కు మరోసారి అడుగుదామనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున రెడ్డి సోదరులు హాజరయ్యారని అన్నారు. సభకు రావాలని చాలా రెడ్డి సంఘాలు తనను 10 రోజుల క్రితమే కోరాయని అన్నారు. ఈ సభకు అన్ని అనుమతులు కూడా ఇచ్చారని అన్నారు. తప్పకుండా కార్పొరేషన్ ఇవ్వాల్సి ఉందని గతంలో మంత్రి హరీశ్ కూడా అన్నారని గుర్తు చేశారు. 


గతంలో రెడ్లు సీఎంలుగా, కేంద్ర మంత్రులుగా, మంత్రులుగా ఉన్నారని మల్లారెడ్డి గుర్తు చేశారు. అయినా ఈ కులంలో పేద వర్గాలను ఎవరూ ఆదుకోలేని అన్నారు. అందుకే రెడ్డి కార్పొరేషన్ పెట్టడం ద్వారా రెడ్లలో ఆర్థికంగా వెనుకబడ్డ వారికి సహకారం అందుతుందని అన్నారు. గతంలో నాయిని నర్సింహ రెడ్డి కూడా రెడ్డి కార్పొరేషన్ ఉండాలని మేనిఫెస్టోలో పెట్టించారని గుర్తు చేశారు.


ముమ్మాటికీ రేవంత్ రెడ్డి నన్ను చంపే కుట్ర చేస్తుండు, అందుకే రెడ్డి సింహ గర్జన వేదికను ఉపయోగించిండు. ఆ దాడికి పాల్పడింది రెడ్డిలు కాదు.. రెడ్డిల ముసుగులో ఉన్న రేవంత్ రెడ్డి పంపిన గుండాలు. నాపై దాడి చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు చట్టం తన పని తను చేస్తుంది. వారి వీడియోలు ఉన్నయ్. తప్పకుండా అందరిపై కేసులు పెడతాం. రేవంత్ రెడ్డి నన్ను రకరకాలుగా బ్లాక్ మెయిల్ చేసిండు. నాపై దాడి అనుమానం రాకుండా రేవంత్ రెడ్డి అమెరికాలో ఉండి నాపై దాడికి కుట్ర చేసిండు. రేవంత్ రెడ్డిని, ఆయన గుండాలను జైలుకు పంపుతాం- సీహెచ్. మల్లా రెడ్డి, మంత్రి

Published at: 30 May 2022 10:27 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.