McDonald Global Office In Hyderabad: అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ సంస్థ మెక్ డోనాల్డ్స్, తెలంగాణ ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందం జరిగింది. సంస్థ విస్తరణలో భాగంగా మెక్ డొనాల్స్డ్ ఇండియా గ్లోబల్ ఆఫీస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఇరు వర్గాల మధ్య అగ్రిమెంట్ జరిగింది. మెక్ డొనాల్స్డ్ తీసుకున్న ఈ నిర్ణయంతో 2,000 మంది ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.  


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం అసెంబ్లీలోని ఛాంబర్లో మెక్‌ డొనాల్డ్స్ ఛైర్మన్, సీఈవో క్రిస్ కెంప్కెజెన్స్కీతో పాటు సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. తమ గ్లోబల్ ఆఫీస్ ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో మెక్​ డొనాల్డ్స్​ సంస్థ పెట్టుబడుల ఒప్పందం చేసుకుంది. 


ఈ ఒప్పంద కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు.  పత్రాలపై సంతకాలు చేశారు. మెక్‌డొనాల్డ్స్ ప్రతినిధుల బృందంలో సీఈవో సహా గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ అధ్యక్షుడు స్కై ఆండర్సన్, చీఫ్ గ్లోబల్ ఇంపాక్ట్ ఆఫీసర్ జాన్ బ్యానర్, గ్లోబల్ ఇండియా హెడ్ దేశాంత కైలా ఈ చర్చల్లో ఉన్నారు. 


మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం  చేశారు. ఈ గ్లోబల్ సెంటర్ తమ రాష్ట్రంలోనే ఏర్పాటు చేయాలని పలు రాష్ట్రాలు పోటీ పడుతున్న సందర్భంలో మెక్ డొనాల్డ్ సంస్థ తెలంగాణను తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకోవటం గర్వంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వం తరఫున ఉత్తమమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. 


గత 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను ఈ మీటింగ్‌లో ముఖ్యమంత్రి వివరించారు. సంస్థకు అవసరమైన శిక్షణ నైపుణ్యమైన ఉద్యోగులను నియమించుకునేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. యూనివర్సిటీని స్కిల్ జోన్‌గా ఉపయోగించుకొని, ఇక్కడ శిక్షణ పొందిన వారికి గ్లోబల్ ఆఫీస్‌లోనే కాకుండా, దేశ విదేశాల్లో తమ ఆఫీసులు, అవుట్​ లెట్లలో ఉద్యోగాలు కల్పించాలన్నారు.  




మెక్‌డొనాల్డ్స్‌కు అవసరమైన మొత్తం వ్యవసాయ ఉత్పత్తులను స్థానిక రైతులు సమకూర్చేలా అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి కోరారు. దీంతో రైతుల ఆదాయం పెరుగుతుందని, రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు. 


బెంగళూరు లాంటి ఇతర సిటీలతో పోలిస్తే హైదరాబాద్‌లో ప్రతిభావంతులైన నిపుణులతోపాటు మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన జీవన ప్రమాణాలున్నాయని మెక్ డొనాల్డ్ సీఈవో క్రిస్ కెంప్కెజెన్స్కీ అన్నారు. అందుకే హైదరాబాద్‌ను తమ గ్లోబల్ ఇండియా ఆఫీస్ సెంటర్‌గా ఎంచుకున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మెక్ డొనాల్డ్స్ నిర్వహిస్తున్న కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. తదుపరి సంప్రదింపులు, ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలోనూ ఇటువంటి కార్యక్రమాలను చేపడుతామని అన్నారు. 


ప్రస్తుతం తెలంగాణలో 38 మెక్‌డొనాల్డ్స్ అవుట్‌ లెట్లున్నాయి. ప్రతి ఏడాది మరో 3 లేదా 4 కొత్త అవుట్ లెట్లను విస్తరించేలా సంస్థ ప్లాన్ చేస్తోంది. కొత్తగా గ్లోబల్ ఇండియా ఆఫీసు ఏర్పాటుతో రాష్ట్రంలోని యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయి.