Drugs Seized in Hyderabad | మేడ్చల్: తెలంగాణ వ్యాప్తంగా గణేశ్ శోభాయాత్రలు, వినాయక నిమజ్జనాల వేడుకలు జరుపుకుంటుంటే రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడే ఘటన చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లాలో భారీ స్థాయిలో నిషేధిత మాదక ద్రవ్యాల తయారీ జరుగుతున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. కుత్బుల్లాపూర్లో ఉన్న ఒక ఫ్యాక్టరీపై మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడులు నిర్వహించి ఏకంగా 32,000 లీటర్ల మిథైలెనెడియాక్సీ మెథాంఫెటమైన్ (MDMA) ముడిసరకును స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫ్యాక్టరీలో మత్తు పదార్థాలు తయారీ చేస్తున్న 13 మంది నిందితులను అరెస్ట్ చేశారు.
కుత్బుల్లాపూర్ లోని ఫ్యాక్టరీలో తయారైన డ్రగ్స్ను దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. 'మోలీ', 'ఎక్స్టీసీ' వంటి పేర్లతో తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు మహరాష్ట్ర పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అరెస్ట్ అయిన నిందితులను ముంబయికి తరలించే చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ కేసులో మేడ్చల్ పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నారు.
రాష్ట్రంలో మత్తు పదార్థాలు అనేవి లేకుండా చేస్తామని ప్రభుత్వం చెబుతుంటే.. ఒక్కసారిగా వేల లీటర్ల మత్తు పదార్థాలను సీజ్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. అది కూడా మహారాష్ట్ర నుంచి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వచ్చి దాడులు చేస్తే ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారీ విషయం బయటకు వచ్చింది. పోలీసులు సీజ్ చేసిన మత్తు పదార్థాల విలువ ఎంత ఉంటుందనేది అధికారికంగా ఇంకా అంచనా వేయలేదు.