KTR Fire On Congress: లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ... తెలంగాణ(Telangana)లో రాజకీయ వేడి రాజుకుంటోంది. అధికార కాంగ్రెస్‌ (Congress) పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ (BRS) పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. గత పదేళ్ల పాలన బీఆర్‌ఎస్‌ స్కాములు తప్ప చేసింది ఏమీ లేదని... కాంగ్రెస్‌ మంత్రులు, నేతలు ప్రచారం చేస్తున్నారు. మరోసారి... కాంగ్రెస్‌ 420 హామీలు ఇచ్చి... అమలు చేయడం లేదని బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శిస్తున్నారు. మహిళలకు నెలకు 2వేల 500 రూపాయలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. అలాగే రైతులకు బోనస్‌, 2లక్షల రూపాయల రుణమాఫీ గురించి కూడా నిలదీస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం కల్పించి... అన్ని హామీలు నెరవేర్చినట్టు ఓట్లు అడుగుతున్నారని బీఆర్‌ఎస్‌ నేతలు దుయ్యబడుతున్నారు.


ఈ క్రమంలో... బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ (KTR)‌.. మరోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై భగ్గుమన్నారు. కపట నీతికి మారుపేరు కాంగ్రెస్‌ అంటూ ట్వీట్‌ (Tweet) చేశారాయన. అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందని... ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. 120 రోజుల పాలనలోనే... కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులతో సహా అందరికీ ద్రోహం చేయడం ప్రారంభించిందని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ వంటి కాంగ్రెస్ అగ్రనాయకులు కూడా... అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు 4వేల రూపాయల నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారని... కానీ.. ఇప్పుడు మాటమారుస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక.. అసలు నిరుద్యోగభృతి వంటి హామీ ఏమీ ఇవ్వలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాటమార్చారని చెప్తున్నారు. 


ఉద్యోగాల విషయంలోనూ నిరుద్యోగ యువతను కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్‌. ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ తమ జాబ్ క్యాలెండర్‌ గురించి...అన్ని వార్తాపత్రికల మొదటి  పేజీలో ప్రకటనలు ఇచ్చిందని గుర్తుచేశారు. కానీ... బీఆర్ఎస్ హయాంలో భర్తీ చేసిన 30వేల ఉద్యోగాలకు మాత్రమే నియామక పత్రాలు ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో భర్తీ చేసిన ఆ ఉద్యోగాలను కాంగ్రెస్‌ పార్టీ నిస్సిగ్గుగా  తమ ఖాతాలో వేసుకుంటోందని విమర్శించారు కేటీఆర్‌. 


అంతేకాదు.. అన్ని పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని కూడా కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. కానీ... ఇప్పుడు ఆ హామీపై యూటర్న్ తీసుకుందని ఫైరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం... టెట్  పరీక్ష ఫీజును 400 రూపయాల నుంచి 2వేలకు పెంచిందని చెప్పారు. ఇక... బీఆర్‌ఎస్‌ హయాంలో ఉద్యోగాల భర్తీని బల్మూరి వెంకట్ వంటి కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారని ఆరోపించారు కేటీఆర్‌. ఎన్నో సార్లు కోర్టు కేసులు వేసి.. అనేక పోటీ  పరీక్షలు రద్దవ్వడానికి కారణం అయ్యారని చెప్పారు. నిరుద్యోగుల ఉసురు పోసుకుని... ప్రతిఫలంగా బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ పదవిని అందుకున్నాడని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు మాత్రం దిక్కుతోచని  స్థితిలో ఉన్నారని... అందుకు కారణం కాంగ్రెసే అని ఆరోపించారు. కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతోందని... తమని నట్టేట ముంచిన కాంగ్రెస్‌ పార్టీకి నిరుద్యోగ యువత తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు కేటీఆర్‌.