KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
Congress MP Mallu Ravi | కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

BRS vs Congress | హైదరాబాద్: బీఆర్ఎస్ నాయకుడు, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి దుర్భాషలాడుతూ చేయి చేసుకోవడంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడిగా ఆయన అభివర్ణించారు. ప్రతిపక్ష నేతలను భయపెట్టేందుకు, వారి గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ నాయకులు ఇంతలా దిగజారి రాజకీయాలు చేయడం అత్యంత విచారకరమని విమర్శించారు.
ప్రజల చేత ఎన్నికైన ఒక ఎమ్మెల్యేను అవమానిస్తూ, భైతిక దాడికి దిగడం కాంగ్రెస్ పార్టీ దిగజారిన సంస్కృతికి నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపై కాంగ్రెస్కు ఏమాత్రం గౌరవం లేదని ఈ ఘటన మరోసారి నిరూపించిందని అన్నారు. ఇలాంటి భౌతిక దాడుల ద్వారా ప్రతిపక్షాన్ని అణిచివేయలేరని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఎంపీ మల్లురవి తక్షణమే క్షమాపణ చెప్పాలి..
ఈ దాడిని బీఆర్ఎస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండించిన కేటీఆర్, ఎంపీ మల్లు రవి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించి, సంబంధిత నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతిపక్షాన్ని బెదిరింపులతో కాకుండా ప్రజా తీర్పుతో ఎదుర్కోవాలని హితవు పలికారు. తమ పార్టీ నేతలపై ఇలాంటి దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని, ప్రజాస్వామ్య పద్ధతిలోనే గట్టిగా ఎదుర్కొంటామని కేటీఆర్ హెచ్చరించారు.
కాంగ్రెస్ నాయకుల అరాచకం - దళిత ఎమ్మెల్యేపై దాడి హేయమైన చర్య!
— BRS Party (@BRSparty) January 21, 2026
అధికార గర్వంతో కాంగ్రెస్ నాయకులు బరితెగిస్తున్నారు. ప్రశ్నించే గొంతుకలపై భౌతిక దాడులకు దిగుతూ తెలంగాణలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపుతున్నారు!
అక్రమాలను ప్రశ్నిస్తే దాడి చేస్తారా?
అధికార అండతో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే… pic.twitter.com/veX2mvqBuh
అసలేం జరిగింది..
భూమిపూజ కార్యక్రమంలో మల్లు రవి, ఎమ్మెల్యే విజయుడు మధ్య తోపులాట చోటుచేసుకుంది. వడ్డేపల్లి మునిసిపాలిటీలోని పైపాడులో మంగళవారం సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం భూమి పూజకు నేతలు హాజరయ్యారు. ఎమ్మెల్యే విజయుడు కొబ్బరికాయ కొట్టిన అనంతరం ఎంపీ మల్లురవి కొబ్బరికాయ కొట్టాల్సిన సమయంలో సంచిని బీఆర్ఎస్ కార్యకర్తలు పక్కకు లాగడంతో వివాదం మొదలై తోపులాట చోటుచేసుకుంది. ఎమ్మెల్యే, ఎంపీ బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఎంపీ మల్లు రవి దాడి!
గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఎంపీ మల్లు రవి సహనం కోల్పోయి ఎమ్మెల్యేపై దుర్భాషలాడుతూ, భౌతిక దాడికి దిగారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. బహిరంగంగానే ఒక ప్రజా ప్రతినిధిపై మరో ప్రజా ప్రతినిధి చేయి చేసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ తీరుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కేందుకే కాంగ్రెస్ ఇలాంటి భౌతిక దాడులకు ప్రోత్సహిస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎంపీ మల్లు రవి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
మరోవైపు, కాంగ్రెస్ వర్గాలు ఈ ఆరోపణలను తోసిపుచ్చుతున్నాయి. కేవలం వాగ్వాదం మాత్రమే జరిగిందని, దాడి జరగలేదని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కూడా ప్రాథమిక విచారణ చేపట్టినట్లు సమాచారం.























