Telangana Coucil Members గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్‌, జ‌ర్న‌లిస్ట్ అమీర్ అలీఖాన్‌ ప్ర‌మాణ స్వీకారం చేశారు. మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి వారితో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. వీరి ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్, విప్ బీర్ల అయిల‌య్య‌, ఎమ్మెల్సీ మ‌హేశ్ గౌడ్, ప్ర‌భుత్వం స‌ల‌హాదారుడు వేం న‌రేంద‌ర్ రెడ్డి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. 



ప్ర‌మాణ స్వీకారం అనంత‌రం ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞ‌తలు తెలియ‌జేశారు. అనంత‌రం మీడియాతో కాసేపు ఇష్టాగోష్టిగా ముచ్చ‌టించారు. తాను ఎమ్మెల్సీగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం ప‌ట్ల ఉద్య‌మ‌కారులు సంతోషంగా ఉన్నార‌ని ఆయ‌న తెలిపారు. 
ఉద్య‌మ‌కారుల ఆత్మ‌బలిదానాల‌తో తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డింద‌ని తెలిపారు. వారి ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా తాను ప‌నిచేస్తాన‌ని కోదండ‌రామ్ తెలిపారు. తెలంగాణ రావ‌డం వ‌ల‌నే త‌న‌లాంటి ఉద్య‌మ‌కారుల‌కు గుర్తింపు ల‌భించింద‌ని ఆయ‌న అన్నారు. దీన్ని ప‌ద‌విలా కాకుండా బాధ్య‌త‌గా భావించి ప‌నిచేస్తాన‌ని చెప్పారు. 


సుప్రీంకోర్టు తీర్పుతో మార్గం సుగ‌మం... 


గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం 2023 జులైలో దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్రా సత్యనారాయణలను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలంటూ చేసిన సిఫార్సులను అప్పటి గవర్నర్‌ తమిళిసై రద్దు చేయడం జరిగింది. దీంతో ఆ స్థానాల్లో ఆ త‌ర్వాత ఏర్పాటైన కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్రొఫెసర్‌ కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌లను నియమించడాన్ని హైకోర్టు కొట్టివేసింది. దీనిపై సుప్రీంకోర్టు బుధ‌వారం స్టే ఇచ్చింది. కొత్త‌వారి నియామ‌కాన్ని నిలిపివేయాల‌న్న పిటిషన‌ర్ విజ్ఞ‌ప్తిని తోసిపుచ్చింది. నియామ‌కాల‌లో క‌ల‌గ‌జేసుకోలేమ‌ని తేల్చిచెప్పింది. దీంతో వీరి ప్ర‌మాణ‌స్వీకారానికి మార్గం సుగ‌మం అయింది. 


 


కోదండరాం సార్‌గా సుపరిచితుడైన ముద్దసాని కోదండరాం 1955 సెప్టెంబర్‌ 5న ముద్దసాని వెంకటమ్మ, ఎం.జనార్దన్‌ రెడ్డి దంపతులకు జన్మించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని నెన్నెల మండలం జోగాపూర్ ఆయ‌న స్వగ్రామం. హన్మ‌కొండ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో డిగ్రీ, ఓయూలో పొలిటికల్‌ సైన్స్ విభాగంలో పీజీ, జేఎన్‌యూలో ఎంఫిల్‌ పూర్తి చేశారు. 1981లో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఉద్యోగం రావడంతో  హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో పీహెచ్డీ మధ్యలో ఆపేశారు. ఓయూలో సుదీర్ఘ కాలం ప్రొఫెస‌ర్‌గా పనిచేసిన కోదండరాం.. దివంగత ప్రొఫెసర్‌ జయశంకర్, ప్రొఫెసర్‌ కేశవరావు జాదవ్‌ సహా అనేక మంది ప్రముఖ తెలంగాణవాదులతోనూ కలిసి పనిచేశారు. ఆదివాసీల హ‌క్కుల‌పై దివంగత నేత బాలగోపాల్, ప్రొఫెసర్‌ బియ్యాల జనార్దన్‌రావుల‌తో కలిసి ఆయ‌న పని చేశారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో రాజకీయ జేఏసీ చైర్మన్‌గా అన్ని పార్టీలను ఏకం చేయడంలో కీల‌క‌పాత్ర పోషించారు. క్రియాశీలంగా పని చేశారు. 



జర్నలిజంలో విశేష కృషి చేసిన ఆమీర్ అలీఖాన్ 


జర్నలిజంలో విశేష సేవలందించిన ఆమీర్‌ అలీఖాన్‌ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీసీఏ, తరువాత సుల్తాన్‌–ఉల్‌–ఉలూమ్‌ కాలేజీ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి ఎంబీఏ చేశారు. ఆయ‌న సియాసత్‌ ఉర్దూ దినపత్రిక రెసిడెంట్‌ ఎడిటర్‌ జాహెద్‌ అలీఖాన్‌ కుమారుడు. 
ప్రస్తుతం సియాసత్‌లో న్యూస్‌ ఎడిటర్‌గా కొన‌సాగుతున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా ప‌నిచేస్తున్న సియాసత్ ప‌త్రిక ఖతర్‌ దేశానికి కూడా విస్తరించింది. పలు అంతర్జాతీయ ఈవెంట్లను కవర్‌ చేయడానికి ప్రధానమంత్రి, రాష్ట్రపతిల వెంట విదేశీ పర్యటనలకు వెళ్లారు. 1973 అక్టోబర్‌ 18న హైదరాబాద్‌లో జన్మించిన ఆమీర్ అలీ ఖాన్ హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆయ‌నకు ఉర్దూతో పాటు ఇంగ్లీష్‌, హిందీ, అరబిక్, తెలుగు భాషలు తెలుసు.