ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య దారుణం, భారత్ జోక్యం చేసుకోవాలి: అసదుద్దీన్ ఒవైసీ
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హత్య చేయడం దారుణం అని, ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడులను ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు.

హైదరాబాద్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతికి నిరసనగా భారత్లోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా హైదరాబాద్, కాశ్మీర్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్ వివాదంపై ఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ‘ఇరాన్పై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. అయతుల్లా ఖమేనీ హత్య చట్టవిరుద్ధం, అనైతికం. ఆయన షియా సమాజానికి ఇష్టమైన నాయకుడు. వెంటనే ఈ దేశాల మధ్య యుద్ధం ముగియాలి. ఇందులో భారతదేశం తన పాత్రను పోషించాలని కోరుకుంటున్నాను. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యను ఖండిస్తుందని ఆశిస్తున్నాం. గల్ఫ్ దేశాలలో 1 కోటి మంది భారతీయులు పనిచేస్తున్నారు. ఒకవేళ యుద్ధం ఆగకపోతే, ఆ ప్రాంతంలో అశాంతి నెలకొంటుంది. భారతీయులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయి, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని’ అని అన్నారు.
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో నిరసనలు..
అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా చేపట్టిన డ్రోన్ దాడులు, వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమెనీ శనివారం (ఫిబ్రవరి 28న) రాత్రి మృతి చెందారు. ఈ వార్త భారత్ సహా పలు దేశాల్లో ప్రభావం చూపింది. తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర సహా పలు ముస్లిం ప్రభావిత రాష్ట్రాల్లో ఖమేనీ హత్యను వ్యతిరేకిస్తూ నిరసన కొనసాగుతోంది. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలోనూ నిరసన జ్వాలలు మిన్నంటాయి.
#WATCH | Hyderabad: On Iran-Israel conflict, AIMIM Chief Asaduddin Owaisi says, "We condemn the attacks on Iran... The killing of Ayatollah Khamenei is unlawful and immoral... He was the beloved leader of the Shia community. The war should end and India should play its role in… pic.twitter.com/RlDtB5FzkF
— ANI (@ANI) March 1, 2026
ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు..
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమెనీ మృతికి నిరసనగా, పురాణి హవెలి ప్రాంతంలో తంజీమ్ ఈ జాఫెరీ సంస్థ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం మత పెద్దలు, స్థానికులు పాల్గొని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిరసనకారులు ఇజ్రాయిల్, అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇజ్రాయెల్ మూర్దాబాద్, నెతన్యాహు మూర్దాబాద్ అంటూ ఓల్డ్ సిటీ వీధుల్లో నినాదాలు ప్రతిధ్వనించాయి.
జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా షియా ముస్లింలు అధికంగా ఉండే చోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. శ్రీనగర్లోని లాల్ చౌక్, సైదా కడల్ ప్రాంతాల్లో వందలాది మంది ప్రజలు శాంతియుతంగా ప్రదర్శనలు చేస్తూ "ఇజ్రాయిల్ మూర్దాబాద్", అమెరికా మూర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు.
కార్గిల్: లడఖ్లోని కార్గిల్ ప్రాంతంలో కూడా ఖమేనీకి మద్దతుగా భారీ ర్యాలీలు జరిగాయి. నిరసనకారులు ఇరాన్, భారత జాతీయ జెండాలను పట్టుకుని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ నిరసనల కారణంగా పలు చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
























