KCR Petition: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ ఉదంతం ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన లోపాలు, డిజైన్ వైఫల్యాలపై విచారణ జరిపిన జస్టిస్‌ పీసీ ఘోష్ కమిషన్ తీరును మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ కమిషన్ నివేదికను, దాని ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. 

Continues below advertisement

ఏ ప్రాతిపదికన బాధ్యుడిని చేస్తారు?

ప్రాజెక్టు ప్రణాళిక, డిజైనింగ్, నిర్మాణానికి సంబంధించిన ప్రతి నిర్ణయానికి ముఖ్యమంత్రిగా తానే బాధ్యుడినని జస్టిస్ ఘోష్ కమిషన్ ఏ ప్రాతిపదికన నిర్దారించిందో చెప్పాలని కేసీర్ హైకోర్టును కోరారు. కేవలం ప్రభుత్వం అందించిన రికార్డుల ఆధారంగా ఒక తుది నిర్ణయానికి రావడం సరికాదని, దానికి సంబంధించిన ఆధారాలను తన ముందు ఉంచి, తన వివరణ తీసుకున్న తర్వాతే కమిషన్ ఒక అభిప్రాయానికి రావాల్సి ఉంటుందని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ ప్రక్రియలో కనీస విధివిధానాలు పాటించలేదని ధర్మాసనానికి నివేదించారు. 

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమారు సింగ్, జస్టిస్‌ జీఎం మొహియుద్ధీన్‌తో కూడిన ధర్మానసనం ఈ విచారణను చేపట్టింది. కేసీఆర్‌తోపాటు మాజీ మంత్రి హరీష్‌రావు, ఐఏఎస్‌ అధికారి స్మితా సభర్వాల్, మాజీ ఐఏఎస్‌ ఎస్‌కే జోషి కూడా కమిషన్ ఏర్పాటు సవాల్ చేస్తూ పిటిషన్లు వేశారు. 

Continues below advertisement

సాక్షిగా పిలిచి దోషిగా నిర్ధారించడమేంటీ?

కేసీఆర్ తరఫున సీనియర్ న్యాయమూర్తి దామా శేషాద్రినాయుడు వాదనలు వినిపిస్తూ కమిషన్ విచారణ ప్రక్రియలో ఉన్న లోపాలను ఎత్తి చూపారు. కమిషన్ చట్టంలోని సెక్షన్ 5 కింద కేసీఆర్‌కు నోటీసు ఇచ్చి, ఒక సాక్షిగా విచారణకు రావాలని పిలిచారని, కానీ నివేదికలో మాత్రం ఆయనను నేరుగా దోషిగా చెప్పారని పేర్కొన్నారు. ప్రాజెక్టు స్థల మార్పు  సలహాలను పట్టించుకోలేదని, డిజైన్ నుంచి టెండర్ల వరకు అన్నింటికీ కేసీఆరే బాధ్యుడని కమిషన్ నిర్దారించిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి 7,500 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని కమిషన్‌ నివేదికలో పేర్కొందని వివరించారు. ఒక వ్యక్తి ప్రతిష్టను, వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే అంశాలు ఉన్నప్పుడు సెక్షన్ 8బి, సీ ప్రకారం ముందస్తు నోటీసు ఇవ్వాలని, కానీ ఇక్కడ అది జరగలేదని వాదించారు. తనపై ఎవరూ ఆరోపణలు చేశారో చెప్పలేదని, ఆరోపణలు చేసిన వారిని క్రాస్ ఎగ్జామినేషన్ అవకాశం కూడా ఇవ్వలేదని వివరించారు. 

రాజకీయ లక్ష్యంతోనే సంక్షిప్త నివేదిక 

జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలోని అంశాలను సరి చూసుకోకుండానే కొందరు అధికారులు ఒక బృందంగా ఏర్పడి 60పేజీల నివేదికను తయారు చేశారని పిటిషనర్ తరఫున న్యాయవాది ఆరోపించారు. ఈ నివేదికను కేవలం రాజకీయంగా దెబ్బతీయాలన్న లక్ష్యంతోనే ప్రస్తుత ముఖ్యమంత్రి, మంత్రులు పవర్ పాయింట్ ప్రజంటేషన్లు ద్వారా మీడియాకు వెల్లడించారని పేర్కొన్నారు. విచారణ కమిషన్ నివేదికను నేరుగా అసెంబ్లీలో చర్చించకుండా పిటిషనర్లు కనీసం కాపీ ఇవ్వకుండా బహిర్గతం చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని అందుకే కమిషన్‌ను, నివేదికను రద్దు చేయాలని కోరారు. 

పిటిషనర్ల తరఫున వాదనలు పూర్తి కావడంతో, ప్రభుత్వం తన వాదనలు వినిపించాల్సి ఉంది. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసును ఇప్పటికే సీబీఐకి అప్పగించినందున ఈ పిటిషన్లపై విచారణ అవసరం లేదన్న వాదన కేసిఆర్ తరఫున న్యాయవాదులు తోసిపుచ్చారు.