ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన 8 సంవత్సరాల్లో ఏకంగా 9 రాష్ట్రాల్లో అధికారాలను కూల్చారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఎన్నికలు జరగబోయే ఒక ఏడాది ముందు రాష్ట్రాల్లోకి ఈడీ రావడం ఈ 8 ఏళ్లలో సాధారణం అయిందని అన్నారు. మరో ఏడాదిలో తెలంగాణలోనూ ఎన్నికలు ఉన్నందున ఇప్పుడు ఈడీని ప్రయోగిస్తున్నారని కవిత వివరణ ఇచ్చారు. మోదీ రావాలనుకున్న రాష్ట్రానికి ఈడీని పంపుతుంటారని ఎద్దేవా చేశారు. అత్యంత ప్రజాచైతన్యం ఉన్న తెలంగాణలో మోదీ ఎత్తుగడలు పని చేయవని అన్నారు.


ఈడీలు, సీబీఐలను ప్రయోగించి తనను జైలులో పెడితే పెట్టుకోవాలని సవాలు విసిరారు. ‘‘జైలులో పెడితే పెట్టుకోండి. పెడితే ఏమైతది? ప్రజలు మనతో ఉన్నంత కాలం మనం భయపడాల్సిన పని లేదు’’ అని కవిత అన్నారు. తాను ఎలాంటి విచారణను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసం వద్ద గురువారం (డిసెంబరు 1) మీడియాతో మాట్లాడారు. ఇదంతా బీజేపీ నీచమైన రాజకీయ ఎత్తుగడ అంటూ విమర్శించారు. వచ్చే డిసెంబరులో తెలంగాణలో ఎన్నికలు ఉంటాయి కాబట్టి, ఇప్పుడు ఈడీని పంపారని అన్నారు.


అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు


టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పేరు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తొలిసారి వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు అత్యంత సన్నిహితుడైన అమిత్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్టును కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. అందులో కవిత పేరును ప్రస్తావించింది ఈడీ. సౌత్ గ్రూప్ నుంచి రూ. వంద కోట్లను అమిత్ అరోరా ద్వారా విజయ్ నాయర్‌కు చేర్చారని ఈడీ తేల్చింది. ఈ విషయాన్ని  అరోరా అంగీకరించారని తెలిపారు. ఈ డీల్‌ను సౌత్ గ్రూప్ నుంచి శరత్ రెడ్డి, కవిత చూసుకోగా..  వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సమన్వయపరిచారని ఈడీ చెబుతోంది. ఈ మొత్తం స్కాం గురించి బయటకు రాకుండా ఎప్పటికప్పుడు ఫోన్లు వాడారాని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. కవిత కూడా ఫోన్లు మార్చారని.. వాటిని దొరకకుండా ధ్వంసం చేశారని ఈడీ తెలిపింది.


అమిత్ అరోరా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అమిత్ సన్నిహితుడు.  ఇక ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో అమిత్ అరోరా కీలకంగా వ్యవహరించారని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. గురుగ్రామ్ కు చెందిన అమిత్ అరోరా.. దినేష్ అరోరా, అర్జున్ పాండేలతో కలిసి పాలసీని రూపొందించడంలో కీలకంగా పని చేసినట్లు ఈడీ చెబుతోంది. వీరిలో దినేష్ అరోరా ఇప్పటికే అప్రూవర్‌గా మారారు. అమిత్ అరోరా బడ్జీ అనే ప్రైవేట్ కంపెనీ యజమానిగా ఉన్నాడు. సీబీఐ, ఈడీ FIRలో అమిత్ అరోరా తొమ్మిదవ నిందితుడిగా ఉన్నాడు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేశారు.


ఢిల్లీలో లిక్కర్ స్కామ్‌లో సీబీఐ దర్యాప్తు ప్రారంభించినప్పుడే తెలంగాణకు చెందిన కల్వకుంట్ల పేరును బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఆమెపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే తనపై ఆరోపణలు చేయడాన్ని కవిత ఖండించారు. ఆధారాలు లేకుండా ఆరోపిస్తున్నారని.. తనపై విమర్శలు చేయకుండా కోర్టుకు వెళ్లి ఆదేశాలు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బీజేపీ నేతుల సైలెంట్ అయ్యారు. ఇటీవల సీబీఐ ఢిల్లీ లిక్కర్ స్కాంలో తొలి చార్జిషీటును దాఖలు చేసింది. అలాగే.. ఈడీ కూడా సమీర్ మహేంద్రుపై చార్జిషీటు దాఖలు చేసింది. కానీ సెల్ ఫోన్ల ధ్వంసం గురించి ప్రస్తావించారు కానీ.. కవిత పేరు మాత్రం తెరపైకి తీసుకు రాలేదు. తొలి సారిగా ఈడీ ఈ కేసు విషయంలో కవిత పేరును ప్రస్తావించింది. 


సౌత్ గ్రూప్ నుంచి ముడుపులు చెల్లించిన వారిలో ప్రధానంగా అరబిందో శరత్ రెడ్డితో పాటు కవిత పేరును ఈడీ అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. ఇప్పటికే అరబిందో డైరక్టర్ శరత్ రెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. అయితే శరత్ రెడ్డితో సమానంగా కవిత కూడా నేరానికి పాల్పడ్డారని ఈడీ చెప్పినా ఇప్పటి వరకూ కవితకు నోటీసులు కూడా జారీ చేయలేదు. ఇప్పుడు కవితకు నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయని అంచనావేస్తున్నారు.