Revanth Reddy participates corner meeting at Erragadda | హైదరాబాద్: బీఆరెస్ పార్టీ సానుభూతితో ఓట్లు దండుకోవాలని ప్రయత్నిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎర్రగడ్డ డివిజన్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో పాల్గొన్ రేవంత్ రెడ్డి బీఆరెస్ పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల (Jubilee Hills By Election) సందర్భంగా నిర్వహించిన ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, బీఆరెస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. అప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు బీఆరెస్ పనిచేసింది. ఇప్పుడు బీజేపీ వాళ్లు బీఆరెస్ ను గెలిపించేందుకు పనిచేస్తున్నారు. కేంద్రంలో ప్రతీ సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీకి కేసీఆర్ మద్దతు పలికారని విమర్శలు గుప్పించారు.
కేసీఆర్పై తీవ్ర విమర్శలు
గతంలో పాటించిన రాజకీయ సంప్రదాయాలను కేసీఆర్ తుంగలో తొక్కారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ‘సెంటిమెంట్ పేరుతో బీఆరెస్ నేతలు మీ ముందుకు వస్తున్నారు. అయితే, 2007లో పీజేఆర్ గారు ఆకస్మికంగా చనిపోతే, ఆ స్థానాన్ని ఏకగ్రీవం చేయాల్సింది పోయి, అభ్యర్థిని పెట్టి ఎన్నికలు తెచ్చిన దుర్మార్గుడు కేసీఆర్. ఆనాడు పీజేఆర్ కుటుంబాన్ని మూడు గంటలు బయట నిలబెట్టి కేసీఆర్ అవమానించాడు. పీజేఆర్ కుటుంబంపై పోటీ పెట్టి సంప్రదాయాన్ని తుంగలో తొక్కింది కేసీఆర్. కారు షెడ్డుకు పోయిందని ఇప్పుడు బిల్లా రంగాలు ఆటోలలో తిరుగుతున్నారు’ అని ఎద్దేవా చేశారు.
కేటీఆర్ను నిలదీసిన సీఎం:
పదేళ్ల అధికారంలో జూబ్లీహిల్స్ సమస్యల పరిష్కారానికి ఎందుకు కృషి చేయలేదని కేటీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ లో సమస్యలు పేరుకుపోవడానికి కారణం నువ్వు మీ అయ్య కాదా కేటీఆర్? పదేళ్లు అధికారంలో ఉన్న మీరు సమస్యలు పరిష్కరించి ఉంటే జూబ్లీహిల్స్ కు ఈ పరిస్థితి వచ్చేదా? పదేళ్లు అధికారంలో ఉన్న మీరు మైనారిటీ సమస్యలు ఎందుకు పరిష్కరించలేదు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సొంత కుటుంబ సభ్యురాలిని దూరం చేసుకున్న కేటీఆర్ తీరుపై విమర్శలు గుప్పించారు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెలిని ఇంటి నుంచి పంపిన కేటీఆర్... సునీతమ్మను మంచిగా చూసుకుంటాడా? సొంత చెల్లికి అన్నం పెట్టని వాడు పిన్నమ్మ కూతురికి బంగారు గాజులు పెడతారంటే నమ్ముతారా?" అని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పనులేమిటి?
తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 70 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం. ఈ బస్తీల్లో రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ కాదా?. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్నది కాంగ్రెస్. ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ సన్నబియ్యం ఇస్తున్నది మేమే. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది నిజం కాదా అన్నారు.
అభివృద్ధికి నవీన్ యాదవ్, అండగా అజారుద్దీన్
కంటోన్మెంట్ ఉపఎన్నికలో గణేష్ను గెలిపించగానే ఆ నియోజకవర్గాన్ని 4 వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ లో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని కోరారు. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే కిషన్ రెడ్డి జాగీర్ ఏమైనా పోతుందా? ఎందుకు అడ్డుకోవాలని చూశారని బీజేపీ నేతలనుద్దేశించి అన్నారు. పీజేఆర్ తరువాత జూబ్లీహిల్స్ కు నాయకుడు లేకుండాపోయారని, పీజేఆర్ వారసత్వాన్ని నవీన్ యాదవ్ కొనసాగిస్తారని, పేదలకు అండగా ఉంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మైనారిటీలకు మేలు జరుగుతుందని, మీ బిడ్డ నవీన్ యాదవ్ ను గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు. ఎమ్మెల్యేగా నవీన్, మంత్రిగా అజారుద్దీన్ మీకు అండగా ఉంటారు. నవీన్ను 30 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలని జూబ్లీహిల్స్ ఓటర్లను కోరారు.