Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రారంభం.. కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసిన అధికారులు
Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటర్లు తమ అభిమాన నేతను ఎన్నికునే సమయం రానే వచ్చింది.

Jubilee Hills By Election: హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మొదలైంది. దాదాపు నెల రోజులుగా పార్టీలు హోరాహోరీ ప్రచారం చేశాయి. నేడు ఓటర్ల టైం వచ్చింది. తమకు నచ్చిన నేతను ఎన్నుకోనున్నారు. మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 14న జరగనుంది. మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ, ప్రధాన పోటీ మాత్రం ముగ్గురి మధ్యే ఉంది: బీఆర్ఎస్ తరఫున మాగంటి గోపీనాథ్ భార్య సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్రెడ్డి బరిలో నిలిచారు. విజయం తమదే అని వీరు ధీమాగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత రెండేళ్లకు జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఈ ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇందులో 68 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. సీఆర్పీఎఫ్ బలగాలు విధుల్లో ఉంటాయి. వెబ్ కాస్టింగ్తో పాటు, తొలిసారిగా డ్రోన్ ద్వారా కూడా పర్యవేక్షణ చేపడుతున్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది, ప్రతి ఓటరు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని సీఈవో కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4.01 లక్షల మంది ఓటర్లు ఉండగా, 407 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 2,09,000 మంది పురుషులు, 1,92,000 మంది మహిళలు ఓటర్లుగా ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్లో రామ్ప్లు, వాటర్ పాయింట్లు, మహిళలకు ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేశారు. 80 ఏళ్లు పైబడిన 6,051 మంది, 18-19 సంవత్సరాల 6,106 మంది యువ ఓటర్లు, 1,891 మంది ప్రత్యేక ఏర్పాట్లతో ఓటు వేయవచ్చు.
జూబ్లీహిల్స్ పోలింగ్: కట్టుదిట్టమైన భద్రత
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా సుమారు 2,400 మంది పోలీసులతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర పోలీసులతో పాటు, పార మిలిటరీ కేంద్ర బలగాలు కూడా పహారా నిర్వహిస్తున్నాయి.
ముఖ్యంగా రహమత్ నగర్, బోరబండ, యూసఫ్ గూడా, శ్రీరామ్ నగర్ వంటి సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అదనంగా, ఈ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు మరియు డ్రోన్ కెమెరాల ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది.
యాప్ ద్వారా పోలింగ్ సరళి నమోదు
ఎన్నికల సంఘం పోలింగ్ సరళిని ప్రత్యేక యాప్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. ఇందుకు ప్రిసైడింగ్ అధికారి ప్రతి రెండు గంటలకు ఒకసారి వివరాలు నమోదు చేస్తారు. 58 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో, 4 బ్యాలెట్ యూనిట్లు వినియోగించనున్నారు. ఒక్కో యూనిట్లో 16 మంది పేర్లు, ఫొటోలు ఉంటాయి, చివరి యూనిట్లో 59వ నంబరుగా నోటా బటన్ ఉంటుంది. పోలింగ్ కేంద్రాల్లోకి ఓటర్ల సెల్ఫోన్లను అనుమతించరు, వాటిని డిపాజిట్ చేసేందుకు కౌంటర్లు సైతం ఏర్పాటు చేశారు.






















