ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధం ఉందనే విషయాన్ని ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్‌లో అనేక మంది పేర్లు బయటికి వచ్చాయి. ఈడి ఇప్పటికే ఒక్కొక్కరిని విచారిస్తోంది. విచారణలో సేకరించిన ఆధారాలను పరిశీలిస్తోంది.


తాజాగా ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఫోన్‌స వ్యవహారం, ట్రావెలింగ్ సంబంధించినటువంటి ఆధారాలు, సంభాషణలకు సంబంధించి ఆడియో, వీడియో క్లిప్పులు, బస చేసిన హోటల్ జాబితా ఇలా అన్నింటిని కోర్టుకు అధికారులు అందజేశారని తెలుస్తోంది. నిజానిజాలు ఎలా ఉన్నా కవితకు ఇందులో ఎంత మేరకు సంబంధం ఉన్నదనేది దర్యాప్తు సంస్థ విచారణలో వెల్లడి కానుంది. కానీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరు బయటికి రావడంతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.


ప్రధానంగా ఈ అంశాన్ని ఆసరాగా చేసుకొని పొలిటికల్ గైన్ పొందాలని అటు బిజెపి, ఇటు కాంగ్రెస్ రెండు ప్రయత్నం చేస్తున్నాయి. లిక్కర్ స్కామ్‌లో కవితను ఎంత వీలైతే అంత లోతుకు లాగాలని ప్రయత్నం చేస్తుంది బిజెపి. కేంద్రంలో అధికారంలో ఉండి దర్యాప్తు సంస్థలను తమ చెప్పు చేతల్లో పెట్టుకుందని ఇప్పటికే టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కానీ బిజెపి మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. దర్యాప్తు సంస్థలు తమ పని తాను చేసుకుంటున్నాయని పైకి చెబుతున్నాయి. కానీ గత కొంతకాలంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన వ్యవహారాలను ఒక్కసారి చూస్తే  పశ్చిమబెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్ ఇలా బిజెపేతర పాలిత రాష్ట్రాల్లో, అదేవిధంగా బిజెపి పాలిస్తున్న రాష్ట్రాలలో విపక్షాల ముఖ్యనాయకులను దర్యాప్తు సంస్థలు దాడులు చేయడాన్ని ఈ సందర్బంగా టీఆర్ఎస్ గుర్తుచేస్తుంది. తెలంగాణలో కూడా టిఆర్ఎస్ పార్టీని, టిఆర్ఎస్ నాయకుల్ని బద్నాం చేయడం కోసమే దర్యాప్తు సంస్థలను తమ జేబు సంస్థలుగా బిజెపి వాడుకుంటోందని నేతలు ఆరోపిస్తున్నారు. 


టీఆర్‌ఎస్‌ ఆరోపణలు, ప్రత్యారోపణలకు పక్కన పెడితే, ఇప్పుడు తాజాగా కల్వకుంట్ల కవిత పేరు బయటికి రావడం దీన్ని ఎన్నికల వరకు ఒక ప్రచార అస్త్రంగా వాడుకోవాలని బిజెపి ప్రయత్నిస్తోంది. అందుకు తగ్గ ఏర్పాట్లను చేసుకుంటుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై అనేక అవినీతి ఆరోపణలు చేస్తున్న బిజెపి... అంది వచ్చిన అవకాశాన్ని వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చూస్తోంది. బిజెపి అగ్ర నేతలు కూడా పదేపదే కేసిఆర్ కుటుంబాన్ని టార్గెట్గ్ చేస్తూ ఇటీవల కాలంలో ఘాటుగానే మాట్లాడుతున్నారు. బీజేపీ వచ్చే ఎన్నికల్లో 60కుపైగా సీట్లు సాధించి, అధికారాన్ని చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకు లిక్కర్ స్కామ్ ని ఒక ప్రచార అస్త్రంగా మలుచుకోనున్నారు.


ఇతర విషయాల కంటే కేసీఆర్ కుటుంబం, ఆయన పాలన, కుటుంబంలో ఉన్నవారు చేస్తున్న అవినీతి వ్యవహారాలను బట్టబయలు చేస్తే తెలంగాణ ప్రజల మన్నలు పొందచ్చని భావిస్తోంది బిజెపి. ఈ ఒక్క అంశాన్నే కాకుండా ప్రజల వద్దకు అనేక అంశాలను తీసుకువెళుతుంది. ఇందులో ప్రధానమైనది కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన అవినీతి ఆరోపణల అంశం. దీనిలో భాగంగానే లిక్కర్ స్కామ్ లో కవిత ఉన్నట్లుగా ఆరోపిస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాలు ఒక్కొక్కటి బయటికి వస్తాయని చెబుతన్నారు ఆ పార్టీ నేతలు. అయితే కవిత ఇందులో ఉన్నారా ? లేదా? అనేది పక్కన పెడితే ఆమె ఇన్వాల్వ్మెంట్ గురించి అనేక వార్తలు బయట చెక్కర్లు కొడుతున్నాయి. ఇందులో దర్యాప్తు సంస్థలు ఇచ్చిన లీకులు కొన్నైతే, బీజేపీకి సంబంధించిన నేతలు చేస్తున్న లీకులు మరికొన్ని.


ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఎలాగైతే ముఖ్యమంత్రి కేసీఆర్ వీడియో టేపులు బయటపెట్టారో, లిక్కర్ స్కాంకు సంబంధించి కూడా బిజెపి నాయకులు రోజుకు ఒక వార్తను ప్రజల్లోకి వదలాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ అంశం రాజకీయంగా మరింత దుమారాన్ని లేపే అవకాశం లేకపోలేదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని అటు బిజెపి ఇటు టిఆర్ఎస్ నాయకత్వం శ్రేణులకు సూచిస్తోంది. అయితే లిక్కర్ స్కాం వ్యవహారం ఎంత వీలైతే అంతగా ప్రచారం చేసి టిఆర్ఎస్ పార్టీని వీలైనంత ఎక్కువ బద్నాం చేయాలని బిజెపి భావిస్తోంది. అయితే ఈ పొలిటికల్ గేమ్ లో వీలైనంత ఎక్కువ మైలేజ్ పొందాలని విపక్షాలు ఎదురుచూస్తున్నాయి. ఇందులో బీజేపీ ముందంజలో ఉంది.


లిక్కర్ స్కామ్ లో కవితకు సంబంధించిన పేరును బయటికి రావడం దాన్ని కాంగ్రెస్ పార్టీ కూడాఘాటుగానే విమర్శిస్తోంది. అయితే ఈ లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి సృజన్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడు కావడం కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఇరకాటంలో పెట్టేసింది. ఈ వ్యవహారంలో ఒక్క బుల్లెట్టుకు రెండు పిట్టలు అన్నట్టుగా వ్యవహరిస్తోంది. లిక్కర్ స్కాం ద్వారా అటు టిఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ను రెండిటిని ఇరుకున పెట్టాలని బిజెపి చూస్తోంది. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, లిక్కర్ స్కాం ఈ రెండు అంశాలు తెలంగాణలో ప్రధాన అంశాలుగా మారనున్నాయి. అయితే ఎన్నికల వరకు ఇదే హీటు కొనసాగే అవకాశం లేకపోలేదు. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఆధారాలు బయటపడటం, బయటకు వస్తున్న వీడియోలు, ఆధారాలు, వార్తలను తెలంగాణ సమాజం ఏ రకంగా చూస్తుంది అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.


రాజకీయ నాయకులు మాత్రం ఇక నుంచి ఎన్నికల అయ్యే వరకు కూడా అలెర్ట్ గా ఉండాలని భావిస్తున్నారు. అదేవిధంగా ఈ లిక్కర్ స్కాం, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మూడు రాజకీయ పార్టీలు కూడా వీలైనంత ఎక్కువ లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారనున్నాయి. అయితే ప్రజలు వీటిని ఏ రకంగా నమ్ముతారు. ప్రజలు ఏరకంగా వీటిని రిసీవ్ చేసుకుంటారు. తెలంగాణ సమాజం, తెలంగాణ ఓటర్లు ఈ అంశాలపై ఏ రకంగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు అనేది ఓట్ల రూపంలోనే తేలనుంది. ఎన్నికల అయ్యేవరకు ఈ చర్చ, ఈ పొలిటికల్ హీట్ తప్పేలా లేదు. ఇక ముందు ఇంకా ఎన్నిజరగనున్నాయో దర్యాప్తు సంస్థలకే తెలియాలి. అప్పటి వరకు వెయిట్ అండ్ సీ అన్న చందగా ఉంది వ్యవహారం.