మంత్రి నిరంజన్ రెడ్డి భూమిని ఎస్టీల పేరు మీద కొని, తర్వాత తన పేర మార్చుకున్నారని బీజేపీ MLA రఘునందన్ రావు చేసిన ఆరోపణలపై స్పందించారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రాజకీయ దుగ్దతో రఘునందన్ రావు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ ఆరోపణలపై మంత్రి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తన స్వగ్రామం పాన్ గల్ లో ఉన్న భూములు 2014, 2018 ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నవే  అన్నారు. ఆ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నది తన సతీమణి సొంత డబ్బులు, బ్యాంకులోనుతో కట్టుకున్న ఇల్లు అని ఆయన స్పష్టం చేశారు.


నిరంజన్‌ రెడ్డి ఏమన్నారో ఆయన మాటల్లోనే:


విదేశాల్లో చదువుకుని, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న మేజర్లు అయిన మా ఇద్దరు అమ్మాయిలు స్వార్జితంతో చండూరులో సురవరం ప్రతాపరెడ్డి వారసుల నుంచి, ఇతరుల నుంచి చట్టబద్దంగా భూములు ఖరీదు చేశారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు , ఏదో రంధ్రాన్వేషణ చేసినట్లు తొలుత భూములు కొని ఎస్టీల పేరు మీదకు.. తర్వాత మంత్రి కుటుంబ సభ్యుల పేరు మీదకు వెళ్లాయని రఘునందన్ రావు అన్నారు. తల్లితండ్రులను కోల్పోయిన పసిబాలుడు గౌడ నాయక్ ను చేరదీసి ఇంట్లో పెట్టుకుని పెంచి పెద్దచేసి ఉన్నత చదువులు చదివించింది వనపర్తి నియోజకవర్గం అంతా తెలుసు. తను మా కుటుంబసభ్యుడే. ప్రస్తుతం ఇంటి వ్యవహారాలు చూసుకునేది అతడే. భూములు కొన్న వారితో అగ్రిమెంట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి విదేశాల్లో ఉన్న పిల్లలు కరోనా నేపథ్యంలో సకాలంలో రాలేని పరిస్థితులలో గౌడనాయక్ పేరు మీద కొంత భూమి రిజిస్టర్ చేసి తర్వాత పిల్లల పేరు మీదకు మార్చుకున్నాం. కనీస సమాచారం లేకుండా రఘునందన్ రావు గుడ్డి ఆరోపణలు చేయడం అవివేకం. దురుద్దేశపూర్వక ఆరోపణలపై చట్టపరంగా ముందుకెళ్తాం.


మూడు ఫాంహౌజులు ఉన్నాయని ప్రచారం చేయడం అవివేకం. పశువుల కొట్టాలు, కూలీల రేకుల షెడ్లు కూడా ఫాంహౌజులుగా కనిపిస్తే, అది రఘునందన్ రావు అజ్ఞానానికి నిదర్శనం. పెద్దమందడి మండలం మోజెర్లలో 50 ఎకరాల భూమి ఉందని రఘునందన్‌ రావు ఆరోపించారు. కానీ అది వెల్టూరు గ్రామపరిధి. అక్కడ లండన్‌లో డాక్టరుగా పనిచేస్తున్న నా సొంత మరదలు కవిత , వారి స్నేహితులకు ఉన్న భూమి 11.20 ఎకరాలు మాత్రమే. అక్కడ ఎలాంటి ఫాంహౌజ్ లేదు. కూరగాయల తోటలు ఉన్నాయి. దానికి ప్రభుత్వం నుండి ఆ భూమికి ఏ రహదారి మంజూరు కాలేదు. వారు ఇక్కడ ఉండరు కాబట్టి, అప్పుడప్పుడు పర్యవేక్షణకు నేను వెళ్తుంటాను.


ఒక్క గుంట ఎక్కువ ఉన్నా నా పదవికి రాజీనామా చేస్తా


ఈ మూడు వ్యవసాయ క్షేత్రాలకు రఘునందన్ రావుకు  నచ్చినవాళ్లతో, నచ్చిన సర్వేయర్‌ను తీసుకుని ఎప్పుడైనా వెళ్లొచ్చు. ఇష్టం వచ్చినప్పుడు వెళ్లి సర్వే చేయించుకోవడానికి అంగీకరిస్తున్నాను. న్యాయంగా చట్టప్రకారం కొనుగోలు చేసిన దానికన్నా ఒక్క గుంట ఎక్కువ ఉన్నా ఆ భూములను మా పిల్లలు వదిలేస్తారు. నేను నా పదవికి రాజీనామా చేస్తాను. లేకుంటే నువ్వు అక్కడే నీ పదవికి రాజీనామా చేసిపోవాలి. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం సంఘటనను ఈ భూములకు ముడిపెట్టడం నీచపు ఆరోపణ. జుగుప్సాకరం. రికార్డులు మండలస్థాయిలోనే కాదు జిల్లా స్థాయిలో, CCLAలో కూడా ఉంటాయి. ఒకచోట రికార్డులు లేకుంటే మరో కార్యాలయంలో ఉంటాయన్న కనీస పరిజ్ఞానం లేకపోతే ఎలా ?


రఘునందన్ రావు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి - నిరంజన్ రెడ్డి


రఘునందన్ రావును ఎవరు ఆడిస్తున్నారో మాకు తెలుసు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీలు వేర్వేరు కాదు. రెండు ఒక తాను ముక్కలే. వారి ఎజెండా, కార్యాచరణ ఒక్కటే అని ప్రజలకు తెలుసు. చాలా ప్రయత్నాలు చేసి, నా నియోజకవర్గంలో కొందరిని లోబర్చుకుని వ్యతిరేక కార్యకలాపాలు మొదలుపెట్టారు. రాజకీయంగా ఎదుర్కునే శక్తిలేక బురదజల్లే కార్యక్రమం మొదలుపెట్టారు. గత ఎన్నికలలోనూ ఇటువంటి ప్రచారమే చేశారు. ఇప్పుడు అదే మొదలుపెట్టారు. 40 ఏళ్ల న్యాయవాద, రాజకీయ చరిత్రలో అక్రమాలకు, తప్పుడు చర్యలకు నేను పాల్పడలేదు.


రఘునందన్ రావు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చట్టబద్ధమైన చర్యలకు సిద్దంగా ఉండాలి. ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడను. లేనిది ఉన్నట్లుగా చిత్రీకరించి ప్రజల్లో అభాసుపాలు చేయాలనుకోవడం అవివేకం. రఘునందన్ రావు తనను తాను ఎక్కువ ఊహించుకుని ఆరోపణలు చేస్తే ఇక్కడ భరించడానికి ఎవరూ సిద్దంగా లేరు. 1985 నుంచే ఆదాయపు పన్ను చెల్లించిన న్యాయవాదిని నేను. స్థాయిని మించి మాట్లాడేటప్పుడు రఘునందన్ రావు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి. నిజానిజాలు తెలుసుకోకుండా రాజకీయ దుగ్దతో చేసిన ఆరోపణలకు రఘునందన్ రావు క్షమాపణ చెప్పాలి.