హైదరాబాద్ సిటీలో తాగునీటి ఎద్దడి లేకుండా, అన్ని ప్రాంతాలకు నిరంతరాయంగా నీటిని సరఫరా చేసేందుకు జలమండలి రూ. 8,000 కోట్ల భారీ వ్యయంతో ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. హైదరాబాద్ నగరానికి నీటిని అందించే కృష్ణా, గోదావరి, సింగూరు, మంజీరా మరియు జంట జలశయాల (ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌) వనరులను ఒకే గొడుగు కిందకు తెస్తూ, నగరం చుట్టూ 140 కిలోమీటర్ల మేర 'రేడియల్‌ రింగ్‌ మెయిన్‌' పైపులైన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) వెంబడి ప్రధాన పైపులైన్లు వేసి, దానికి అనుసంధానంగా మరో 96 కిలోమీటర్ల మేర అంతర్గత నెట్‌వర్క్‌ను నిర్మించడం ద్వారా నగరం నలుమూలలకూ నీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేయనున్నారు.

గతంలో కేవలం జంట జలశయాలపై ఆధారపడిన నగరం, ప్రస్తుతం కృష్ణా, గోదావరి నదుల నుండి నీటిని పొందుతోంది. అయితే, ఏదైనా ఒక ప్రధాన పైపులైన్‌కు మరమ్మతులు జరిగినా లేదా సాంకేతిక సమస్యలు తలెత్తినా ఆయా ప్రాంతాల్లో సరఫరా పూర్తిగా నిలిచిపోతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు 'రింగ్ మెయిన్' వ్యవస్థ కీలకం కానుంది. దీనివల్ల ఒక మార్గంలో అంతరాయం కలిగినా, ఇతర వనరుల నుండి నీటిని మళ్లించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయవచ్చు. రాబోయే రెండేళ్లలో గోదావరి 2, 3 దశలు కూడా అందుబాటులోకి రానుండటంతో, ఈ రింగ్ మెయిన్ ద్వారా 24 గంటల పాటు సమాన ఒత్తిడితో నీటిని అందించడం సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు.

రింగ్ మెయిన్ అంటే ఏంటీ..

హైదరాబాద్ సిటీకి అంతరాయం లేని తాగునీటి సరఫరాను అందించేందుకు ప్రతిపాదించిన అత్యంత కీలకమైన పైపులైన్ నెట్‌వర్క్‌ను 'రింగ్ మెయిన్' అని పిలుస్తారు. ప్రధానంగా హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు (ORR) వెంబడి ఈ ప్రధాన పైపులైన్‌ను ఒక వలయంలా (Ring) ఏర్పాటు చేస్తారు. ఇది నగరంలోని పలు ప్రాంతాలను కలుపుతూ ఉండే ప్రత్యేక పైపులైన్లతో అనుసంధానమై ఉంటుంది.

సాధారణంగా ఏదైనా ఒక ప్రధాన పైపులైన్ దెబ్బతింటే ఆ ప్రాంతానికి నీటి సరఫరా నిలిచిపోతుంది. కానీ, ఈ రింగ్ మెయిన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే, ఒక దిశలో మరమ్మతులు జరుగుతున్నప్పటికీ, వలయంలా ఉన్న ఇతర పైపులైన్ల ద్వారా నీటిని మళ్లించి నిరంతరాయంగా సరఫరా చేయడానికి వీలుంటుందని అధికారులు ప్లాన్ చేశారు. దీనివల్ల నగరవ్యాప్తంగా నీటి పంపిణీలో ఎలాంటి అవాంతరం లేకుండా నియంత్రించవచ్చు.

నీటి వనరుల సామర్థ్యంహైదరాబాద్ నగరానికి ప్రస్తుతం రోజుకు సుమారు 600 మిలియన్ గ్యాలన్ల (MGD) పైగా నీటి అవసరం ఉంది. కృష్ణా (మూడు దశలు), గోదావరి (మొదటి దశ) ద్వారా మెజారిటీ అవసరాలు తీరుతున్నాయి.

 రిజర్వాయర్లు నిర్మాణం: రింగ్ మెయిన్ ప్రాజెక్టులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి కీలక ప్రాంతాల్లో భారీ స్టోరేజ్ రిజర్వాయర్లను నిర్మిస్తున్నారు. ఇది భవిష్యత్తులో పెరిగే జనాభా అవసరాలకు అనుగుణంగా నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది.

డిజిటల్ మానిటరింగ్: ఈ కొత్త పైపులైన్ వ్యవస్థలో ఎక్కడైనా లీకేజీలు ఉన్నా లేదా నీటి ఒత్తిడి తగ్గినా వెంటనే గుర్తించేలా అత్యాధునిక స్కాడా (SCADA) టెక్నాలజీని ఉపయోగించే అవకాశం ఉంది. భూగర్భ జలాలపై ఆధారపడటాన్ని తగ్గించి, ఉపరితల జలాలను (నదీ జలాలు) శాస్త్రీయంగా వినియోగించుకోవడం ఈ ప్రాజెక్ట్ మరో ముఖ్య ఉద్దేశ్యం.