Hyderabad Teachers Biryani: బడిలో పాఠాలు చెప్పి వందలాది మంది విద్యార్థులను ప్రయోజకుల్ని చేశారు ఆ ఆ ఉపాధ్యాయుడు. కానీ కోవిడ్ మహమ్మారి వ్యాప్తి సమయంలో ఉద్యోగం కోల్పోవడంతో జీవితం తలకిందులైంది. ఆర్థిక అంధకారం చుట్టూ అలముకుంటే కనీసం కుటుంబాన్ని పోషించడం, రోజు గడవడం కష్టంగా మారితే పరిస్దితులు ఎలా ఉంటాయో ఈ మాస్టారుకు బాగా తెలుగు. కొందరైతే మనోధైర్యం కోల్పోయి తనువు చాలించిన ఘటనలు చూశాం. అయితే ఆ మాస్టారు మాత్రం అలా కాదు. సంకల్ప బలంతో ముందుకు సాగాడు. బడిలో పాఠాలు చెప్పి దేశానికి ఉత్తమ విద్యార్దులను అందించడమే కాదు. మాంచి రుచికరమైన, నోరూరించే బిర్యాని స్వయంగా వండి వడ్డించి ఆకలి తీర్చడంతో తాను కుటుంబాన్ని ధైర్యంగా పోషించుకోవాలనే సంకల్పంతో ముందుకు సాగాడు.


టీచర్స్ బిర్యాని 
లకిడీకపూల్ లో టీచర్స్ బిర్యాని పేరుతో బిర్యాని సెంటర్ నిర్వహిస్తున్న బి.వి.రామ ప్రసాదరావు ఒకప్పడు ప్రవేటు స్కూల్ టీచర్. దాదాపు 25 ఏళ్లపాటు విద్యార్దులకు పాఠాలు నేర్పి ఉన్నతంగా తీర్చిదిద్దిన అనుభవం ఆయన సొంతం. అయితే కోవిడ్ మహమ్మారి వీరి జీవితాలను రోడ్డునపడేలా చేసింది. లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు వందలాది మంది టీచర్ లను ఉద్యోగాల నుండి తొలగించింది. అలా ఉద్యోగం కోల్పోయిన ప్రసాదరావు, అప్పటి వరకూ సాఫీగా సాగిన జీవితం ఓ రెండు నెలలు జీతం లేపోతే ఎంత కష్టమవుతుందో అర్దమైంది. కటిక పేదరికమంటే ఎలా ఉంటుందో అనుభవంతో చూడాల్సిన దుస్థితి ఎర్పడింది. కొన్నాళ్లు తెలిసినవాళ్లు,  చర్చి తరఫున కొందరు సహాయం చేసి ఆదుకున్నారు. అయితే కొన్నిరోజుల వరకు ఓకే. మరి నెలలు తరబడి సాధ్యం కాదు. దీంతో ఏం చేయాలో తోచలేదు. పాఠాలు చెప్పడం తప్ప మరో పని తెలియని ప్రసాదరావు కొన్నాళ్లు తీవ్ర మానసిక సంఘర్షణకు లోనయ్యాడు. ఉద్యోగం చేసే సమయంలో ఇంట్లోవాళ్ల కోసం అప్పుడప్పుడూ స్వయంగా బిర్యానీ చేసేవాడు. అలా ఓసారి ట్రై చేసిన బిర్యాని అద్బుతంగా వచ్చింది. 


టీచర్స్ బిర్యానికి మంచి ఆదరణ 
టీచర్‌ గా పోయిన ఉద్యోగం ఎప్పుడొస్తుందో తెలియదు. అసలు వస్తుందో రాదో నమ్మకం లేదు. తిరిగి కోవిడ్ పరిస్దితులు మళ్లీ వస్తే అప్పుడు ఉద్యోగం ఊడదని గ్యారెంటీ లేదు. అందుకే తనకు తెలిసిన బిర్యాని తయారీ విధానాన్ని జీవనోపాధిగా మలచుకోవాలని అనుకున్నాడు. ప్రసాద్ మాస్టార్ నిర్ణయానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తోడైంది. రుచికరమైన బిర్యానీ తక్కువ ధరలో ఇవ్వగలిగితే తప్పకుండా వ్యాపారం అభివృద్ది చెందుతుందనే సంకల్పంతో టీచర్స్ బిర్యాని సెంటర్ పేరుతో బిర్యాని హోటల్ ప్రారంభించాడు. హంగూ ఆర్పాటాలకు దూరంగా సింపుల్ గా మెయిన్ రోడ్డుకు దగ్గరలో లాలాపేట బ్రిడ్జి సమీపంలో మొదట ప్రారంభించి, అక్కడ నష్టాలు రావడంతో తార్నాక వద్దకు మార్చారు. తార్నాకలో టీచర్స్ బిర్యానికి మంచి ఆదరణ లభించింది.

సిట్టింగ్ ఏర్పాటు చేస్తూ లక్డీకపూల్ మెట్రోకు సమీపంలో మెయిన్ రోడ్ పక్కకు బిర్యాని సెంటర్ మార్చడంతో మరింత ఆధారణ పెరిగింది. టీచర్స్ బిర్యాని అంటే రుచికరమైన తక్కువ ధరలో దొరికే సామాన్యుడి క్వాలిటీ బిర్యానిగా ఫేమస్ అయింది.


విద్యార్దులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఎంత చిత్తశుద్దితో విద్యాబోధన చేస్తారో అంతే చిత్తశుద్దితో బిర్యాని తయారీలో సైతం నాన్ వెజ్ ప్రియులను మనసుదోచుకుంటున్నారు ప్రసాద్ మాస్టారు. టీచర్స్ బిర్యానీ సెంటర్ నడుపుతూ ఆర్దికంగా ఇబ్బందులను ఎదుర్కొని నిలబడగలిగారు. కంటి సమస్యతో బాధపడుతున్న కూతురికి కనీసం కంటి చూపు కోల్పోయే పరిస్దితిలో వైద్యం అందించేందుకు డబ్బులు లేని దుస్దితి నుండి ఇప్పుడు టీచర్స్ బిర్యానీ సెంటర్ నడుపుతూ పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోగల్గుతున్నారు. 


లకిడీకపూల్ లో టీచర్స్ బిర్యాని సెంటర్ లో లభించే చికెన్ దమ్ బిర్యాని ఫైవ్ స్టార్ రెస్టారెంట్ లను తలదన్నె అమోఘమైన రుచితో ఉండటమేకాదు ధర విషయంలోనూ సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది. సింగిల్ చికెన్ ధమ్ బిర్యానీ 110- రూపాయలకు, ఫుల్ బిర్యాని 230 రూపాయలకు లభిస్తుంది. తయారీ విధానం హైజనిగ్ గా ఉండడంతోపాటు బిర్యానిలో వాడే ఐటమ్స్ విషయంలో రాజీలేకుండా బిర్యాని ప్రియుల మనస్సు దోచుకుంటున్నారు ప్రసాద్ మాస్టర్. జీవితంలో ఆటుపోట్లు సర్వసాధారణం అయితే సమస్యలు చుట్టుముట్టినప్పుడు మనో ధైర్యం కోల్పోకుండా.. ఉద్యోగం పోయిందని, ఆర్దికంగా కుదైలైయ్యామని నిరుత్సాహ పడకుండా చిత్తశుద్దితో సంకల్పబలంతో మనం చేయగలగిన పని ఏదైనా శ్రమను నమ్ముకుంటే విజయం వచ్చి వరించాల్సిందే తన అనుభవాన్ని ఏబీపీ దేశంతో పంచుకున్నారు టీచర్స్ బిర్యాని నిర్వాహకులు ప్రసాద్ మాస్టార్.