Telangana govt land monetization: భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
Raidurg land auction price impact: హైదరాబాద్లోని ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియ కొత్త సమస్యలను సృష్టిస్తోంది. ప్రభుత్వం ఆదాయ వనరుగా భూములను వేలం వేయడం, అది సామాన్యుడి సొంతింటి కలను దూరం చేస్తోంది.

Hyderabad land auction impact on common man : హైదరాబాద్ నగరంలో భూమి ధరలు ఆకాశమే హద్దు అన్న చందంగా దూసుకుపోతున్నాయి. రాయదుర్గంలో ఎకరం రూ.237 కోట్లు పలికిందంటే అది కేవలం ప్రభుత్వ ఖజానాకు వచ్చిన ఆదాయం మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే సగటు మనిషి ఆర్థిక స్థితిపై పడ్డ పెద్ద దెబ్బ. ప్రభుత్వం లాభాపేక్షతో భూములను కార్పొరేట్ సంస్థలకు వేలం వేయడం వల్ల, రియల్ ఎస్టేట్ మార్కెట్లో కృత్రిమమైన హైప్ సృష్టికి కారణం అవుతోంది. ఇది అంతిమంగా నిర్మాణ వ్యయం పెరగడానికి, తద్వారా సామాన్యుడికి సొంతింటిని అందని ద్రాక్షగా మార్చడానికి దారితీస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారితే?
సాధారణంగా ప్రభుత్వం భూములను ప్రజా అవసరాల కోసం స్కూళ్లు, ఆస్పత్రులు, పార్కులు , పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించాల్సి ఉంటుంది. కానీ, గత కొన్నేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం ఆదాయం కోసం భూములను మానిటైజేషన్ చేయడంపైనే దృష్టి పెట్టింది. రాయదుర్గం, కోకాపేట వంటి ప్రాంతాల్లో రికార్డు ధరలు పలకడం వల్ల పక్కనే ఉన్న గచ్చిబౌలి, నార్సింగి, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాల్లో కూడా భూమి రేట్లు అమాంతం పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన అప్సెట్ ప్రైస్ మార్కెట్లో ఒక కొత్త బెంచ్మార్క్గా మారుతోంది, దీనివల్ల ప్రైవేట్ భూముల ధరలు కూడా నియంత్రణ లేకుండా పెరిగిపోతున్నాయి.
మధ్యతరగతికి మిగలని సొంత గూడు
ఒకప్పుడు సామాన్యుడు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చిన్న ప్లాటో లేదా ఫ్లాటో కొనుక్కునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అటువైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక ఫ్లాట్ ధర కనీసం రూ.70 లక్షల నుండి రూ.1.5 కోట్ల వరకు పలుకుతోంది. ప్రభుత్వం భూములను వందల కోట్లకు విక్రయించడంతో, బిల్డర్లు ఆ ధరను భర్తీ చేయడానికి విలాసవంతమైన హై-రైజ్ అపార్ట్మెంట్లనే నిర్మిస్తున్నారు. దీనివల్ల అఫోర్డబుల్ హౌసింగ్ అనే కాన్సెప్ట్ హైదరాబాద్లో కనుమరుగైపోతోంది. మధ్యతరగతి ప్రజలు తమ జీవితకాల సంపాదనను ఇఎంఐ ల రూపంలో చెల్లించినా, ఒక చిన్న గూడు దక్కడం కష్టతరంగా మారుతోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ భూముల వేలం విధానంపై రాజకీయ విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ఏజెంట్లా వ్యవహరిస్తోందన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నాయి. అభివృద్ధి పేరుతో భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ, సామాన్యుడిని నగరం వెలుపలికి తరిమేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. భూముల విలువలను పెంచి స్టాంప్ డ్యూటీ ద్వారా అదనపు ఆదాయం పిండుకోవడం వల్ల రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. ఇది కేవలం ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికే తప్ప, సామాన్యుడి సంక్షేమం కోసం కాదనే వాదన బలంగా వినిపిస్తోంది.
రియల్ ఎస్టేట్ బబుల్ ప్రమాదం ఉందా?
ధరలు ఇలాగే అసహజంగా పెరిగితే భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ బబుల్’ ఏర్పడి మార్కెట్ కుప్పకూలే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కొనుగోలు శక్తికి మించి ధరలు పెరిగితే, ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వం కేవలం ఆదాయంపైనే కాకుండా, సామాన్యుల నివాస అవసరాల కోసం ఒక సమగ్ర గృహ నిర్మాణ విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. కేవలం ధనవంతులకు, ఐటీ కంపెనీలకే కాకుండా.. నగరంలో పనిచేసే సామాన్య కార్మికులు, ఉద్యోగులకు కూడా గూడు దక్కేలా చూడటం ప్రభుత్వ బాధ్యత. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదగడం ఆహ్వానించదగ్గ పరిణామమే అయినా, అది సామాన్యుల కన్నీళ్ల మీద పునాదులు వేసుకోకూడదు. ప్రభుత్వం భూములను వేలం వేసి ఆదాయం సమకూర్చుకోవడం తప్పు కాకపోయినా, ఆ ఆదాయంలో కొంత భాగాన్ని తిరిగి పేద, మధ్యతరగతి గృహ నిర్మాణ పథకాలకు మళ్లించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు






















