నాలుగు డబ్బులు వస్తాయనే ఎంతటి పనికైనా రెడీ అంటున్నారు కొందరు వ్యక్తులు. ఇప్పటి వరకు శ్మశానవాటికలు కబ్జాలు చేసిన వారిని, ప్రశాంతంగా ఆ ప్రాంతంలో మందు కొట్టే వారినే చూశారు. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. అందుకే మరుభూమినే వ్యభిచారానికి అడ్డంగా మార్చేసిందో మహిళ. ఖాళీగా ఉందని శ్మశానవాటికలోని రూమ్‌ను ఎంచక్కా వ్యాపార కేంద్రంగా మార్చుకుంది. నాలుగు చేతులా సంపాదిస్తోంది.  హైదరాబాద్‌లోని నడిబొడ్డున ఉన్న బిజీ సెంటర్‌ బేగంపేటలోని శ్మశానవాటిక కేంద్రంగా చేసుకుంది మారీ మాధవి. ధనియాలగుట్ట శ్మశానవాటికలోని రూమ్‌లో బిజినెస్ పెట్టేసింది. ఎప్పుడూ లేని విధంగా ఆ ప్రాంతంలో వ్యక్తుల సంచారం ఎక్కువ అవ్వడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వారిలో ఒకరు పోలీసులకు సమాచారం అందించారు. అంతే పోలీసులు కొన్ని రోజులు నిఘా పెట్టారు. చివరకు సడెన్‌గా రైడ్ చేశారు.   పక్కా సమచారంతో ధనియాగుట్ట శ్మశానవాటికలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు శుక్రవారం దాడి చేశారు. అంతే మాధవి వ్యాపారం గుట్టు వీడింది. ఆమెతోపాటు అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు వారిని విచారించిన తర్వాత షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వేర్వేరు ప్రాంతాల నుంచి మహిళలను, యువతులను రప్పించి బిజినెస్ చేసేదని గుర్తించారు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఇక్కడ పని కానిచ్చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే ఇప్పుడు పోలీసులకు చిక్కిన వ్యక్తుల్లో ఓ సివిల్ కాంట్రాక్టర్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు అరెస్టు చేసిన వారి నుంచి కొంత నగదు, సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.