Hyderabad Crime News:చిన్న పిల్లలతో వ్యాపారం చేసే ముఠాలు ఈ మధ్య కాలంలో రెచ్చిపోతున్నాయి. సంతానం లేని దంపతుల అవసరాన్ని ఆసరాగా తీసుకొని చేయకూడని నీచమైన పనులు చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ఇలాంటి వారంతా ముఠాలుగా ఏర్పడి పెద్ద పెద్ద నెట్‌వర్క్‌లను ఫామ్ చేసి అప్పుడే పుట్టిన పసికందులను కిడ్నాప్‌ చేస్తూ దందాలు సాగిస్తున్నాయి. 

హైదరాబాద్‌ పోలీసుల స్టింగ్ ఆపరేషన్

చైతన్యపురి పోలీసుల, మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులతో కలిసి ఓ స్టింగ్ ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్‌లో సంచలనం సృష్టించిన ఓ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు అయింది. అంతర్‌రాష్ట్ర గ్యాంగ్‌కు చెందిన 11 మందిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడే పుట్టిన శిశువులను తీసుకొచ్చి అవసరమైన తల్లిదండ్రులకు అమ్మకాలు చేస్తున్నారు. అప్పుడే పుట్టిన నలుగురు పిల్లల అమ్మకాలు చేయనీయకుండా అడ్డుకున్నారు. 

వీళ్లంతా కలిసి ఓ నెట్‌వర్క్‌గా ఏర్పడి వివిధ రాష్ట్రాల్లో టీంలను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా గుజరాత్‌ నుంచి పిల్లలను తీసుకొచ్చి అమ్మకాలు సాగించారు. విషయం ముందే తెలుసుకున్న పోలీసులు స్టింగ్ ఆపరేషన్ చేపట్టారు. అంతే ముఠా గుట్టు వీడింది. వీళ్లతోపాటు చట్ట విరుద్ధంగా పిల్లలను కొంటున్న తల్లిదండ్రులను కూడా అరెస్టు చేశారు. 

Also Read: ఒకే వేదికపై పెళ్లి మంత్రాలు, క్రికెట్‌ కామెంటరీ- ఆదిలాబాద్‌ వివాహ వేడుక వైరల్

ఈ ముఠాకు చెందిన వారు గుజరాత్‌లో పిల్లల్ని పోషించలేని తల్లిదండ్రులను పట్టుకుంటారు. వారికి డబ్బులను ఎర చూపించి అప్పుడే పుట్టిన పిల్లల్ని కొనుక్కొని తీసుకొస్తారు. హైదరాబాద్‌లో ఉన్న ముఠా సభ్యులు ముందుగానే ఇక్కడ కొనే వ్యక్తులను గుర్తించి వారితో మాట్లాడి పెడతారు. అలా తీసుకొచ్చిన బిడ్డల్ని వాళ్లకు ఇచ్చి డబ్బులు తీసుకుంటారు. 

గుజరాత్‌ నుంచి తీసుకొచ్చే ఆడ శిశువును రెండున్నర లక్షలకు, మగ శిశువు అయితే నాలుగున్నర లక్షల రూపాయలకు అమ్ముతున్నారు. ముందుగా కొంత డబ్బులు ఇచ్చిన తర్వాతే వీళ్లకు బిడ్డల్ని తీసుకొచ్చి ఇస్తారు. గుజరాత్‌ నుంచి హైదరాబాద్‌ వరకు ఇదో పెద్ద నెట్‌వర్క్‌ అనిపోలీసులు చెబుతున్నారు. ఇంకా ఇందులో ఉన్న వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు అంటున్నారు. ప్రస్తుతం చిక్కిన వారిని విచారించి మరిన్ని వివరాలు రాబడతామన్నారు. 

Also Read: తెలంగాణలో ఎరువుల కొరతపై కేంద్ర మంత్రి కిషణ్ రెడ్డి కీలక ప్రకటన