హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ పెద్ద కార్పొరేట్ స్కూల్లో విషాదం చోటు చేసుకుంది. స్కూలు గ్రౌండ్ లో ఆడుకుంటున్న ప్లస్ టూ విద్యార్థి ఒకరు కరెంట్ షాక్ కి గురయ్యాడు. మధ్యాహ్నం లంచ్ తర్వాత ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. కరెంట్ షాకి గురైన విద్యార్థికి ఒళ్లు అంతా కాలిపోయిందని స్కూలు సిబ్బంది తెలిపారు. స్టూడెంట్ ని ఆస్పత్రిలో చేర్పించగా ప్రస్తుతం చికిత్స కొనసాగుతుందని వెల్లడించారు. 


బంజారాహిల్స్ లో ఉన్న మెరీడియన్ స్కూల్‌లో హస్సన్‌ అనే విద్యార్థి పదకొండో క్లాసు చదువుతున్నాడు. మధ్యాహ్నం ఆడుకుంటుండగా, పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు ఆనుకుని ఉన్న ఓ ఇనుప కడ్డీకి తగిలాడు. ఆ ఇనుప రాడ్ కు కరెంటు ప్రవాహం ఉండడంతో ఈ ప్రమాదంలో విద్యార్థికి బాగా కాలిన గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. వెంటనే స్పందించిన స్కూలు యాజమాన్యం విద్యార్ధిని ఆస్పత్రిలో చేర్పించారు. బాలుడికి 45 నుంచి 50 శాతం వరకు గాయాలు అయ్యాయని డాక్టర్లు తెలిపారు. ఇప్పటికే రెండు సర్జరీలు చేశామని చెప్పారు. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.