కట్టుకున్న భార్యను కాదని బాగా డబ్బున్న మహిళకు ఎర వేసి ఆమెతో వెళ్లిపోయే ఘటనలు సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం. డబ్బుపైన వ్యామోహం.. విలాసవంతమైన జీవితం సులభంగా అందుతుందనే అత్యాశతో అయిన వారికి అన్యాయం చేసి వెళ్లిపోతుంటారు. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్‌లో జరిగింది. డబ్బున్న ప్రియురాలి వలలో పడి భార్యాపిల్లల్ని గాలికి వదిలేశాడు. కొద్ది నెలలు ఆమెతో ఉన్న తర్వాత ప్రియురాల్ని భరించలేక అసలు విషయం తెలుసుకున్నాడు. ఇక ఆమెతో ఉండలేనని మళ్లీ భార్య దగ్గరికి వచ్చేస్తానని వేడుకుంటున్నాడు. కానీ, భర్త బుద్ధి గుర్తించిన భార్య  మాత్రం అతణ్ని దరి చేరనివ్వడం లేదు. హైదరాబాద్‌లోని కూకట్ పల్లిలో ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది.


హైదరాబాద్‌లోని కూకట్‌ పల్లికి చెందిన భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుంటారు. ఇద్దరికీ మంచి జీతాలు ఉండడంతో ఆర్థికంగా పెద్దగా ఇబ్బందులు లేవు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, గత సంవత్సరం భర్తకు ఓ పెళ్లైన మహిళతో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా మరింత ముందుకు వెళ్లింది. ఫోన్లలో గంటల కొద్దీ మాటలు, వాట్సాప్‌లో అర్ధ రాత్రి వరకూ ఛాటింగ్‌లు కూడా చేసుకొనేవారు. ఇది మరింత ముదిరి గత రెండు నెలల క్రితం ఇద్దరూ ఎక్కడికో వెళ్లిపోయారు. భార్యకు ఇదంతా తెలీక ఆమె తన భర్త కనిపించడం లేదని, పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


పోలీసులు విచారణ చేసి అతని సెల్ ఫోన్ సిగ్నల్స్‌ను కాల్ డేటాను పరిశీలించగా, అప్పుడు అతని బండారం బయటపడింది. ఈ క్రమంలోనే నాన్న ఎక్కడని తన పిల్లలు అడిగినా భార్య చెప్పలేకపోయేది. ఆ తర్వాత ఉద్యోగం కోసం ఢిల్లీ వెళ్లాల్సి వచ్చిందని చెప్తూ వచ్చింది. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం అతను, ఉన్నట్టుండి సైబరాబాద్‌ పోలీసుల ఎదుట ప్రత్యక్షం అయ్యాడు. తాను ఎక్కడికీ పోలేదని, క్షణికమైన ఆవేశంలో ఓ మహిళ మాటలు నమ్మి ఆమె వెంట వెళ్లిపోయానంటూ పోలీసులను వేడుకున్నాడు. 


ఏదో ఒకటి చెప్పి తన భార్యతో తిరిగి ఆనందంగా కలసి జీవించేలా చూడాలంటూ వేడుకున్నాడు. అయితే, మహిళను నమ్మి ఆమెతో వెళ్లిపోయిన వ్యక్తి ఇలా సచ్ఛీలుడుగా ఎలా మారాడా? అని పోలీసులు ఆరా తీశారు. అందుకు గల కారణం తెలిసి పోలీసులే అవాక్కయ్యారు. అతని ప్రియురాలు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినే దగ్గర్నుంచి రాత్రి భోజనం వరకూ అన్నీ ఖరీదైన తిండి కావాలని వాపోయాడు. లగ్జరీ లైఫ్ కోసం ఆమె హద్దూ అదుపు లేకుండా ఖర్చుపెట్టిస్తోందట! అంతా ఖరీదైన ఆహారం, బట్టలు, వస్తువులు అన్నీ ఖరీదైనవే కోరుతుందని వాపోయాడు. ఆమె విలాసవంతమైన కోరికలు తీర్చేందుకు ఒక నెలలోనే తాను ఏకంగా రూ.10 లక్షలు అప్పు చేశానని చెప్పుకొచ్చాడు. 


ఆ ఖర్చులు, అప్పులు భరించలేక తాను ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పాడు. పెద్దల ద్వారా భార్యతో రాజీ కుదుర్చుకుందామని ఇప్పటికే ప్రయత్నించానని, అయితే తనను ఆమె వద్దంటోందని వేడుకున్నాడు. అందుకే పోలీసులను ఆశ్రయించినట్లుగా చెప్పాడు. తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలని భార్యను వేడుకుంటున్నాడు. పోలీసులు కూడా అతని భార్యతో మాట్లాడి ఇద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చి కలిపేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.