Madapur Drug Case: మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. సినీ ఫైనాన్షియర్ వెంకట్ డ్రగ్స్ కేసులో పోలీసులు మరికొందరిని అరెస్టు చేశారు. తాజాగా ఎనిమిది మంది నిందితులను నార్కోటిక్ విభాగం పోలీసు అధికారులు అరెస్టు చేశారు. ఇందులో ముగ్గురు నైజీరియన్లతో పాటు మాదక ద్రవ్యాలు వాడుతున్న మరో ఐదుగురిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా అరెస్టు అయిన 8 మందిలో ఓ సినీ నిర్మాత కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా అదుపులోకి తీసుకున్న వారిలో పలువురు కీలక వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఐదుగురు మాదక ద్రవ్యాలు వాడే వారు ఉన్నట్లు తెలుస్తోంది. వీరి నుంచి 50 గ్రాముల ఎండీఎంఏ, 8 గ్రాముల కొకైన్, 24 ఎక్టసీ పిల్స్ ను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాకు వెల్లడించనున్నారు.


గత నెల 31వ తేదీన నార్కోటిక్ విభాగం పోలీసులు గుడిమల్కాపూర్, మాదాపూర్ లో దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. మాదాపూర్ డ్రగ్స్ పార్టీని భగ్నం చేసి సినీ నిర్మాత వెంకట్‌తో పాటు మరో ఐదుగురు బాలాజీ, కె.వెంకటేశ్వర రెడ్డి, డి.మురళి,మధుబాల, మేహక్ అనే యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. బాలాజీ పై గతంలోనూ కేసులు ఉన్నట్లు గుర్తించారు. డమరుకం, పూల రంగుడు, లైవ్లీ, ఆటో నగర్ సూర్య సినిమాకు ఫైనాన్సియర్ గా వెంకట్ పని చేసినట్లు గుర్తించారు. సినిమా ఫైనాన్సర్ వెంకట్ ఆధ్వర్యంలో డ్రగ్స్ పార్టీ నిర్వహణ జరగుతుందని గుర్తించి రెయిడ్ చేశారు. వెంకట్ కదిలికలపై గత మూడు నెలలుగా నార్కోటిక్ బ్యూరో నిఘా పెట్టారు. వెంకట్ కు డ్రగ్స్ మాఫియా పై సంబంధాలు పై ఆరా తీస్తున్నారు.


సినీ ఫైనాన్షియర్ వెంకట్ రత్నారెడ్డిపై తెలుగు రాష్ట్రాల్లో కలిపి 25 కు పైగా కేసులు నమోదైనట్లుగా గుర్తించారు. గతంలో  ఐఆర్ఎస్ అధికారినంటూ వెంకట్ మోసాలు చేశారు.  నిర్మాతలు సి. కల్యాణ్‌, రమేష్‌ల నుంచి ఐఆర్‌ఎస్‌ అధికారినంటూ డబ్బులు వసూలు చేసినట్లుగా గుర్తించారు.  నిర్మాతల నుంచి రూ.30 లక్షలకుపైగా కొట్టేసిన వెంకటరత్నారెడ్డి.. పెళ్లి పేరుతోనూ యువతుల్ని మోసం చేసినట్లుగా గుర్తించారు. సినిమాలో అవకాశాల పేరిట అమ్మాయిలకు వల వేస్తూ.. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచారం చేస్తున్నట్లుగా గుర్తించారు.


పెళ్లి పేరుతో ఎన్‌ఆర్‌ఐ నంటూ విదేశీ యువతలను మోసం చేసిన వెంకట్ రత్నారెడ్డి.. తన అక్రమాలకు  ఏపీకి చెందిన ఓ ఎంపీ పేరును ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే సినిమా ఫైనాన్షియర్ వెంకట్, బాలాజీ కి డ్రగ్స్ మాఫియా తో లింకులు ఉన్నాయని పోలీసు విచారణలో బయటపడింది. తాజాగా ఈ కేసులో నార్కోటిక్స్ బ్యూరో విచారణ కొనసాగుతోంది. సినీ ఫైనాన్సర్ వెంకట్ రత్నా రెడ్డి వాట్సాప్ లో కీలక విషయాలు బట్టబయలయ్యాయి. బాలాజీ, వెంకట్ రత్నారెడ్డి కలిసి డ్రగ్స్ పార్టీలు చేసినట్లు గుర్తించారు. 18 మందికి డ్రగ్స్ ను అమ్మకాలు చేసినట్లు విచారణలో వెల్లడించారు బాలాజీ, వెంకట్. ఆ 18 మంది ఎవరు అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.