ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Durgam Cheruvu Cable Bridge: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఏబీపీ కథనానికి గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ స్పందించింది. లైట్లు వెలిగించింది. కానీ ఇంకా నిర్వహణ లోపాలను చాలా వరకూ క్లియర్ చేయాల్సి ఉంది.

Durgam Cheruvu Cable Bridge Lighting: హైదరాబాద్లోని ఐకానిక్ చిహ్నంగా ఉన్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్వహణపై ఏబీపీ దేశం కథనం అధికార యంత్రాంగంలో కదలిక తెచ్చింది. ఏబీపీ దేశం ఇచ్చిన కథనాన్ని ఇక్కడ చూడవచ్చు. భాగ్యనగరానికి తలమానికంగా నిలిచిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గత కొంతకాలంగా చీకటిలో మగ్గుతున్న ఈ తీగల వంతెనపై అధికారులు తాజాగా విద్యుత్ దీపాలను వెలిగించారు. నిర్వహణ లోపం వల్ల పర్యాటకులు పడుతున్న ఇబ్బందులను ఎండగట్టడంతో యంత్రాంగం నిద్ర మేల్కొన్నప్పటికీ, సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు.
అసంపూర్తిగా లైటింగ్
లైట్లు ఆన్ చేసినప్పటికీ, అవి ఇంకా పూర్తి స్థాయిలో పని చేయడం లేదు. వంతెనపై ఉన్న వేలాది ఎల్ఈడీ దీపాల్లో చాలా వరకు ఇంకా మరమ్మతులకు గురై మూలన పడి ఉన్నాయి. కేవలం నామమాత్రంగా కొన్ని లైట్లను వెలిగించారే తప్ప, గతంలో లాగా ధగధగలాడే రంగుల వెలుగులు ఇంకా పర్యాటకులకు కనువిందు చేయడం లేదు. మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ గడువు ముగియడం, డ్రైవర్లు పాడైపోవడంతో ఈ సమస్య జఠిలమైనట్లు తెలుస్తోంది. పర్యాటక ప్రాంతంగా పేరొందిన ఈ బ్రిడ్జి నిర్వహణను ఇలా గాలికి వదిలేయడంపై నగరవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
గుర్రపు డెక్కతో నిండిన చెరువు - దారుణంగా దుర్వాసన
వంతెన పైన పరిస్థితి ఇలా ఉంటే, కింద దుర్గం చెరువు పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఒకప్పుడు స్వచ్ఛంగా ఉండే ఈ జలాశయం ఇప్పుడు తూటికాడ, గుర్రపు డెక్క నిండిపోయింది. చెరువు ఉపరితలం మొత్తం పచ్చని నాచుతో ఉండటంతో నీరు కనిపించని పరిస్థితి నెలకొంది. దీనివల్ల నీటిలో ఆక్సిజన్ తగ్గిపోయి, పరిసర ప్రాంతాల్లో విపరీతమైన దుర్వాసన వస్తోంది. సరైన నిర్వహణ లేక బోటింగ్ పాయింట్లు కూడా నిరాసక్తంగా మారాయి.
సమగ్ర మరమ్మతులు ఎప్పుడు?
కేవలం లైట్లు వెలిగించడం మాత్రమే కాకుండా, చెరువులోని తూటికాడను తొలగించి, వంతెన విద్యుత్ వ్యవస్థను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ, పర్యాటక శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడాలని కోరుతున్నారు.






















