Peddi Sudarshan Reddy: ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురైన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్థరాత్రి 12:51 గంటలకు తుదిశ్వాస విడిచారు.నాలుగు రోజుల క్రితం ఆయన అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ని రెండు రోజుల క్రితం మాజీ సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి సుదర్శన్ రెడ్డి కోలుకొని మళ్లీ ఆరోగ్యంగా ప్రజల్లోకి వస్తారని కూడా భరోసా ఇచ్చారు. కోలుకునే వరకు అండగా ఉంటామని కూడా చెప్పారు. కేసీఆర్‌తోపాటు బీఆర్‌ఎస్ కీలక నేతలు కూడా ఆయన్ని పరామర్శించారు.  సుదర్శన్‌ రెడ్డి కోలుకొని వస్తారని గులాబీ శ్రేణులు వస్తారని భావిస్తున్న టైంలో ఆయన అర్థరాత్రి తుది శ్వాస విడిచారు. దీనిపై బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆఖరి నిమిషం వరకు ప్రజాసేవ చేశారని కొనియాడారు. తెలంగాణ కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిజాయితీతో పని చేసిన వ్యక్తిగా అభివర్ణించారు. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం బీఆర్‌ఎస్‌కే కాకుండా తెలంగాణకు తీరని లోటుగా చెప్పుకొచ్చారు. అన్నింటికీ మించి మంచి స్నేహితుడిని కోల్పోయానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంతాప సందేశాన్ని విడుదల చేసిన కేసీఆర్ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన్ని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్య తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశామని, వైద్యులు కూడా చాలా ప్రయత్నాలు చేశారని తెలిపారు. అయినా ఆయన్ని బతికించుకోలేపోయామని ఆవేదన చెందారు. సుదర్శన్‌ కుటుంబానికి బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.