ED Notices to Abhishek Avala: ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ కేసులో కొత్త విషయం తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఈడీ అధికారులు ఆయనను విచారించిన 24 గంటల్లోనే మరో వ్యక్తికి నోటీసులు అందజేశారు. 7 హిల్స్ మాణిక్ చంద్ పాన్ మాసాలా యజమాని అభిషేక్ ఆవాలకు నోటీసులు జారీ చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ సుమిత్ గోయల్ స్పష్టం చేశారు. 2015 నుంచి అన్ని బ్యాంకు ఖాతాల స్టేట్ మెంట్లు, ఏయే సంస్థల్లో డైరెక్టర్ గా ఉన్నారు, కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న స్థిర, చరాస్తుల వివరాలను తీసుకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 


ఇటీవలే ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడు నంద కుమార్ తనను 1.75 కోట్ల మేరకు మోసం చేశారంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో అభిషేక్ రెండో వారంలో ఫిర్యాదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అభిషేక్, రోహిత్ రెడ్డి సోదరుడి మధ్య రూ.7.75 కోట్ల మేరకు లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ లావాదేవీలు ఎందుకు జరిగాయి, డబ్బులు ఎందుకు పంపించుకున్నారు, రోహిత్ రెడ్డితో ఉన్న సంబంధాలపై పూర్తి స్థాయిలో కూపీ లాగేందుకు అభిషేక్ కు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అయితే రోహిత్ రెడ్డిని కూడా ఎక్కుువగా 7 హిల్స్ మాణిక్ చంద్ పాన్ మసాలాకు సంబంధించిన లావాదేవీలపైనే ప్రశ్నించినట్లు తెలుస్తోంది.


7 హిల్స్ మాణిక్ చంద్ పాన్ మసాలాలో నందకుమార్ హస్తం


మాణిక్ చంద్ పాన్ మసాలాకు హైదరాబాద్ కేంద్రంగా ప్రధాన పంపిణీ దారుగా ఉన్న అభిషేక్ ఆవాలా 2015లో సొం బ్రాండ్ పాన్ మసాలా తయారీని ప్రారంభించాడు. బీబీ నగర్ సమీపంలోని నేమర గోముల గ్రామంలో ఓ యూనిట్ స్థాపించి 7 హిల్స్ మాణిక్ చంద్ పేరుతో పాన్ మసాలా, జర్దా తదితరాలను ఉత్పత్తి చేసి విక్రయించడం మొదలు పెట్టాడు. ఆపై గుజరాత్ నుంచి గుట్కా తెచ్చి అక్రమంగా అమ్మకాలు సాగించినట్లు సమాచారం. ఆ దందాలో ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడిగా ఉన్న నంద కుమార్ కూడా కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. అభిషేక్, నందకుమార్ సంయుక్తంగా వే ఇండియా టబాకో ప్రైవేట్ లిమిటెడ్, 7 హిల్స్ మాణిక్ చంద్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, 7 హిల్స్ మార్కెటర్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్, డబ్ల్యూ 3 హాస్పిటాలిటీస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు డైరెక్టర్లుగా ఉన్నారు. 


అభిషేక్ చాలా మందిని మోసం చేసినట్లు అభియోగాలు..


డబ్ల్యూ 3 సంస్థలో రాజేశ్వర్ రావు కల్వకుంట్ల కూడా ఓ డైరెక్టర్ గా ఉన్నారు. ఈ సంస్థను ముగ్గురూ కలిసి 2015 నవంబర్ 6వ తేదీన ఏర్పాటు చేశారు. 7 హిల్స్ మాణిక్ చంద్ పాన్ మసాలా ఉత్పత్తులకు సంబందించిన ఫ్రాంచైజీలు, డిస్ట్రిబ్యూషన్స్, సీ అండ్ ఎఫ్ ఏజెన్సీలు ఇస్తానంటూ అభిషేక్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బిహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లోని అనేక మందిని మోసం చేశారన్న అభియోగాలు ఉన్నాయి. ఈ వ్యవహారాల్లోనూ నంద కుమార్ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.