తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రోజుకు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేలా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి  వైద్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతున్నందున.. మన రాష్ట్రానికి కూడా సరిపడా వ్యాక్సిన్ సరఫరా అయ్యే అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుతం కరోనా పూర్తి నియంత్రణలోనే ఉన్నప్పటికీ, భవిష్యత్‌‌లో ప్రజలకు కరోనా వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటానికి వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఆదివారం (సెప్టెంబరు 12) ప్రగతిభవన్ లో వైద్య ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సీఎస్ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు ప్రారంభమైనందున, విద్యాసంస్థల్లో కరోనా ప్రభావం పెద్దగా లేదని వైద్యాధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కరోనా ఎక్కువయ్యే అవకాశాలు కనిపించడం లేదని అధికారులు సమావేశంలో వివరించారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసుకునేందుకు 18 సంవత్సరాలు పైబడిన అర్హులు.. 2.8 కోట్ల మంది ఉండగా, ఇప్పటికే 1.42 కోట్ల మందికి మొదటి డోస్ వ్యాక్సినేషన్, 53 లక్షల మందికి సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తయిందని, మరో 1.38 కోట్ల మందికి సింగిల్ డోస్ వ్యాక్సిన్ వేయాల్సి ఉందని సమీక్షలో వైద్యశాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.


ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రోజుకు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించడానికి చేపట్టే స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఇతర ప్రజా ప్రతినిధులు చురుగ్గా పాల్గొనాలని, ఎంపీవోలు, ఎంపీడీవోలు, డీఎల్పీవోలు, డీపీవోలు, జెడ్పీ సీఈఓలు, ఇతర సిబ్బంది వీటిని సమన్వయం చేసి, వైద్య సిబ్బందికి పూర్తి సహకారాన్ని అందించి వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.


కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో గ్రామాల్లో లాక్ డౌన్లు పెట్టుకోవడంతోపాటు కరోనా పేషంట్ల కోసం స్కూళ్లలో ఐసొలేషన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి సర్పంచులు ప్రజలకు అండగా నిలిచారని సీఎం కేసీఆర్ అభినందించారు. అలాగే, ఇపుడు చేపట్టే వ్యాక్సినేషన్ ప్రక్రియలో కూడా భాగస్వాములు కావాలని సీఎం కోరారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం కావడానికి కలెక్టర్లు ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని సీఎం కేసీఆర్.. సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. వ్యాక్సినేషన్ సిబ్బందికి భోజన వసతి సహా ఇతర సౌకర్యాలు కల్పించడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. వ్యాక్సినేషన్ సెంటర్లుగా స్కూళ్లు, కాలేజీలు, రైతు వేదికలు తదితర ప్రభుత్వ/ప్రైవేటు భవనాలను ఉపయోగించుకోవాలని, అవసరమైన చోట్ల టెంట్లు వేసి శిబిరాలు నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. 


ఒకవేళ భవిష్యత్‌లో కరోనా, ఇతరత్రా సీజనల్ వ్యాధులు సహా ఎలాంటి ఆపద వచ్చినా ప్రజలను ఆదుకోవడానికి వైద్య ఆరోగ్యశాఖ సంసిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆక్సిజన్ ప్లాంట్స్, బెడ్స్ ఏర్పాటు విషయంలో తగు ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. మెడికల్ కాలేజీలు, మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి, త్వరగా పూర్తి చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. వైద్యరంగంలో విశిష్ట సేవలందిస్తున్న నిమ్స్ దవాఖానా పరిధిలో మరో రెండు టవర్స్ నిర్మించి వైద్య సేవలను విస్తృత పరచాలని సీఎం ఆదేశించారు.