Cantonment By-Elections: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ ఆదివారం మధ్యాహ్నం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎమ్మెల్యే చనిపోవడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు కాళీ అయింది. అయితే ఈ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరిగే అవకాశాలు లేవు. రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు ఏడాది సమయం కూడా లేకపోవడమే ఇందుకు కారణం. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 151ఏ నిబంధన ప్రకారం... ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయితే ఆరు నెలల్లోగా ఉపఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే చనిపోయిన లేదా రాజీనామా చేసినా, అనర్హత వేడు పడిన సభ్యుడి పదవీ కాలం ఉంటే ఈ నిబంధన వర్తించదు. శాసన సభ గడువు వచ్చే డిసెంబర్ 11వ తేదీతో ముగియనుంది. అంటే మరో 10 నెలలో మిగిలి ఉన్నాయి. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉపఎన్నికలు జరిగే అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయ వర్గాలు తెలిపాయి.  


ఆదివారం మృతి చెందిన ఎమ్మెల్యే సాయన్న..!


సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ ఆదివారం ఉదయం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేరారు. ఆయన వైద్యులు చికిత్స అందించారు. అయితే మధ్నాహ్నం ఒంటిగంట 15 నిమిషాలకు ఆయన గుండె పోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సాయన్నకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. సాయన్న మొదటిసారి 1994లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత వరుసగా మూడు సార్లు గెలిచిన సాయన్న 2009లో మాజీ మంత్రి శంకర్ రావు చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి 2014లో టీడీపీ నుంచి 2018లో టీఆరెఎస్ నుంచి గెలుపొందారు.  2014 టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన సాయన్న 2015లో టీటీడీ బోర్డు మెంబర్ గా సేవలందించారు. అనంతరం అనివార్య రాజకీయ పరిస్థితుల్లో గులాబీ గూటికి చేరారు. హర్యానా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్ గా ఆరు ఏళ్లు సేవలందించారు. టీడీపీ నగర అధ్యక్షుడుగా కూడా పనిచేశారు.  సాయన్న మృదుస్వభావి, వివాదరహితుడుగా పేరు పొందారు. పార్టీలకతీతంగా కంటోన్మెంట్ నేతలంతా సాయన్నను అభిమానిస్తారు. 1951 మార్చి 20న సాయన్న చిక్కడ పల్లిలో జన్మించారు. తన ఉన్నత విద్యాభ్యాసం ఉస్మానియాలో చేశారు. 


ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్న


కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994 నుండి 2009 వరకు వరుసగా మూడుసార్లు తెలుగుదేశం పార్టీ తరఫున సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నగరంలో టీడీపీకి పట్టున్న నియోజకవర్గంగా మారిందంటే ఎమ్మెల్యే సాయన్న పరిపాలన, మంచితనమే కారణమని చెబుతుంటారు. కానీ అనూహ్యంగా 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమిచెందారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి సమీప అభ్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (ప్రస్తుత బీఆర్ఎస్)  గజ్జెల నగేష్ పై 3275 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా అది ఆయనకు నాలుగో విజయం. మరుసటి ఏడాది 2015లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుడిగా నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో కేసీఆర్ పాలన వైపు మొగ్గు చూపుతూ అధికార టిఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి సమీప అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నేత సర్వే సత్యనారాయణపై 37,568 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నాలుగు పర్యాయాలు టీడీపీ నుంచి, ఒకసారి టీఆర్ఎస్ నుంచి విజయాలు అందుకున్న ఎమ్మెల్యే సాయన్న కేవలం ఒక ఎన్నికల్లో ఓటమి చెందారు.