Hyderabad News: తెలంగాణలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఎవర్నీ బెదిరించలేదని.. ఏ హీరోయిన్‌తో తనకు సంబందం లేదన్నారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రెస్‌మీట్ పెట్టిన ఆయన... ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. తెలంగాణలో తాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వాటిని పట్టించుకోని సీఎం... ఫోన్ ట్యాపింగ్‌పై దృష్టి పెట్టారన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఫోకస్ చేయాల్సింది ఫోన్ ట్యాపింగ్‌పైకాదని... వాటర్‌ ట్యాప్‌పై అన్నారు. ఎత్తాల్సింది పార్టీ గేట్లు కాదని... ప్రాజెక్టు గేట్లు అంటూ ఎద్దేవా చేశారు. 


పట్టణాల్లో వాటర్ ట్యాంక్‌లు- పల్లెల్లో ఖాళీ బిందెలు


తెలంగాణలో ఎప్పుడూ లేని విధంగా పట్టణాల్లో పల్లెల్లో వాటర్ ట్యాంకర్లు కనిపిస్తున్నాయన్నారు కేటీఆర్. పల్లెల్లో రోడ్ల మీద బిందెలు ప్రత్యక్షమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రకృతి వల్ల వచ్చిన కరవు కాదని... ప్రభుత్వం తీసుకొచ్చి కరవు అని విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక విధానంతో ఎక్కడా సాగు, తాగు నీటి కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదన్నారు కేటీఆర్. 


తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్... "కాంగ్రెస్ హయాంలో మళ్లీ తాగునీటి తండ్లాట మొదలైంది. ప్రజలు గొంతు ఎండి ఇబ్బంది పడుతుంటే రేవంత్ రెడ్డి గొంతు చించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలు రోడ్ల పైన ఖాళీ బిందెలతో తల్లడిల్లుతుంటే రేవంత్ రెడ్డి లంకె బిందెల కోసం మాట్లాడుతున్నాడు. ఢిల్లీకి ధనరాశులను తరలిస్తున్న రేవంత్ రెడ్డికి జలరాశులు తరలించే ఓపిక లేదు. గతంలో మేము ప్రజల అవసరాలు ఎట్ల తీర్చాలని ఆలోచిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం చేరికల పైన దృష్టి పెట్టింది. ఢిల్లీకి డబ్బు సంచులు పంపడం పైన దృష్టి పెట్టారు. గత పది సంవత్సరాలలో మా ప్రభుత్వం తండాల నుంచి మొదలుకొని హైదరాబాద్ దాకా ఏరోజు కూడా తాగునీటి ఇబ్బందులు రానియ్యలేదు. "


ఇది ప్రకృతి వల్ల వచ్చిన కరవు కాదు


"మంచినీళ్లను మానవ హక్కుగా గుర్తించి 38వేల కోట్లతో మిషన్ భగీరథను చేపట్టి పూర్తి చేశాం. 50 ఏళ్ల పాటు హైదరాబాదు నగరానికి తాగునీటి కొరత రాకుండా చేశాం. కనీసం వాటి నిర్వహణ కూడా చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కెసీఆర్ ప్రభుత్వం దిగిపోగానే హైదరాబాదులో ట్యాంకర్ల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఇన్వర్టర్లు, జనరేటర్లతోపాటు ట్యాంకర్ల దందా స్టార్ట్ అయింది. మూడు నాలుగు రెట్లు పెట్టి ట్యాంకర్లు కొనుగోలు చేస్తున్నారు. ఇది ప్రకృతి కొరత వల్ల వచ్చిన తాగునీటి కొరత కాదు.  కేవలం కాంగ్రెస్ పార్టీ చేతగానితనం వల్ల వచ్చిన కొరత. " 


ఫోన్ ట్యాపింగ్ కాదు.. వాటర్ ట్యాపింగ్ పైన దృష్టి పెట్టండి


"గతంలో కురిసిన వర్షం కంటే 14% అధికంగా వర్షం ఉన్న తాగునీటి కొరత ఎందుకు వచ్చింది. ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నాయి.. వాటిని నిర్వహించే తెలివి ప్రభుత్వానికి లేదు.  పార్టీ గేట్లు ఎత్తడం కాదు ముఖ్యమంత్రి.. ప్రజల కోసం చేతనైతే ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి. ఫోన్ ట్యాపింగ్ కాదు. వాటర్ ట్యాపింగ్ పైన దృష్టి పెట్టండి. సాగర్‌లో, ఎల్లంపల్లిలో, హిమాయత్ సాగర్‌లో, ఉస్మాన్ సాగర్‌లో నీళ్లు ఉన్నా... ప్రజలు ఎందుకు ట్యాంకర్లు బుక్ చేసుకోవాలి. తాగునీటి ఇబ్బందులు ఎందుకు పడాలి ముఖ్యమంత్రి చెప్పాలి. "


"సంవత్సరంపాటు నగర జనాభా అవసరాలకు అవసరమైన నీళ్లు నాగార్జునసాగర్ లో ఉన్నా... హైదరాబాద్ లో ఇంత తీవ్ర నీటి కొరత ఎందుకు ఉన్నది? రాష్ట్ర ప్రజల తాగునీరు తీసుకోవాలి అంటే ఢిల్లీ ముందు బిక్షం అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. మా ప్రభుత్వం డిజైన్ చేసిన సుంకేశాల ప్రాజెక్టు 75% పూర్తయింది… కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని పూర్తిగా పక్కన పెట్టడంతో అది పూర్తి కాలేదు." 


"కేసీఆర్ మీద రాజకీయ కక్షతోని కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చూపెట్టాలనే ప్రయత్నం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైతే మళ్లీ పంప్ హౌస్‌లు ఎట్లా ప్రారంభమైనయ్? నీళ్లు ఎట్ల ఎత్తిపోస్తున్నారు. ఇన్ని రోజులు ఆ నీళ్లు ఎక్కడ పోయ్ నయ్ … ల్యాండ్ క్రూజర్లు దాచిపెట్టినమని చిల్లర మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి నీటిని ఎందుకు దాచిపెట్టిందో చెప్పాలి."


నీళ్లు ఇస్తే బోనస్ ఇవ్వాల్సి ఉంటుందని ఇలా చేస్తున్నారా?


"కాళేశ్వరంలో నీళ్లు ఉండి కూడా దాచి పెట్టడం వల్లనే లక్షల ఎకరాల పంట ఎండింది. ఈ మూడు నెలల్లో మేడిగడ్డను రిపేర్ చేసి పంపులు ఆన్ చేసి ఉంటే ఒక్క ఎకరం పంట కూడా ఎండకపోయేది. నీళ్లు ఉండి కూడా పంటలు ఎండాలన్న దుర్మార్గపూరిత ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది.  పంట పండితే బోనస్ ఇవ్వాలా అన్న భయంతోనే పంటలను ఎండబెట్టింది కాంగ్రెస్ పార్టీ. "


"హైదరాబాద్ నగరం కాంగ్రెస్ కి ఓటు వేయలేదు...కాబట్టి రేవంత్ రెడ్డి నగరం పైన కక్ష కట్టారు. అందుకే  ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్న తాగునీరు అందియడం లేదు. 12 గంటల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్న ముఖ్యమంత్రి అసలు ట్యాంకర్లతోని నీరు ఎందుకు సరఫరా చేయాల్సి వస్తుందో అది ప్రభుత్వ వైఫల్యం కాదా అనే విషయాన్ని చెప్పాలి. గతంలో కన్నా రెట్టింపు ట్యాంకర్లు నగరంలో నడుస్తున్నాయి. ఈరోజు దాదాపు రెండు లక్షల 30 వేల ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నారు. వీటి ద్వారా ప్రజలపై పడుతున్న భారం కాంగ్రెస్ పార్టీ వేసిందే కదా. రేవంత్ రెడ్డి ఈ భారం భరిస్తారా లేదా కాంగ్రెస్ పార్టీ భరిస్తుందా చెప్పాలి. బెంగళూరు మాదిరి నీటిని వాడితే జరిమానాలు విధించే పరిస్థితి హైదరాబాద్ నగరంలో కూడా వస్తుంది." 


రేవంత్‌పై ఎంత జరిమానా వేయాలి 


"నీటిని వృథా చేసినందుకు జరిమానా వేస్తే నీటిని ఎత్తిపోయకుండా గొంతులు ఎండబెట్టిన రేవంత్ రెడ్డి పైన ఎన్ని జరిమానాలు వేయాలి కాళేశ్వరం ప్రాజెక్ట్ పంపులు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపండి.  హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చండి. తాగునీటి ఇబ్బందులు రాకుండా వెంటనే చర్యలు చేపట్టాలని ఈ ప్రభుత్వాన్ని హైదరాబాద్ ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నా. అవసరమైతే జలమండలి ముందు ధర్నాలు చేస్తాం. గతంలో మేము 20,000 లీటర్ల ఉచిత నీటిని 12 లక్షల కుటుంబాలకు అందించాం. ఇప్పుడు గత ఏడాది డబ్బులు అన్ని కూడా ఒకేసారి ఇచ్చి ప్రజల నుంచి డబ్బులు గుంజే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది. హైదరాబాద్ తాగునీటి సరఫరాకు ఇబ్బందులు సృష్టించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నగర ప్రజలకు క్షమాపణ చెప్పాలి.  "


రేవంత్ రెడ్డికి ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలు ఈ రోజే ఇస్తామన్నారు కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 218 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మరోసారి వివరించారు. వారి వివరాలు ఈ రోజే అందిస్తామని పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతు కుటుంబానికి 25 లక్షలు ఇచ్చి అదుకోవాలని డిమాండ్ చేశారు. 


ఇవాళ డేటా పంపిస్తాం


"రైతుల ఆత్మహత్యల వివరాలను రేవంత్ రెడ్డికి నేరుగా పంపిస్తాము. అన్ని వివరాలు మేము ఇచ్చాక.. ముఖ్యమంత్రి ఎందుకు ఆయన కింద ఉన్న అధికార యంత్రాంగం ఎందుకు. గతంలో రేవంత్ రెడ్డి రైతులు చనిపోయినందుకు ఇచ్చే ఆర్థిక సాయం ఎందుకు అన్నారు. రైతులు చావకుండా చూడాలన్నారు కానీ రేవంత్ రెడ్డి ఈరోజు మాటే మార్చి మాట్లాడుతున్నారు. మా దగ్గర ఉన్న వివరాలు అన్ని అందిస్తాం. "


ట్యాపింగ్‌తో సంబంధం లేదు


"ఫోన్ ట్యాపింగ్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు. హీరోయిన్లతో కూడా సంబంధం లేదు. అడ్డగోలుగా మాట్లాడితే ముఖ్యమంత్రిని వదిలి పెట్టేది లేదు. గతంలో తెలంగాణ ఎంపీల ఫోన్ ట్యాపింగు చేశారని... ఈరోజు ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు కిరణ్ కుమార్ రెడ్డి పై విమర్శలు చేశారు. మీ వదిన ఆరోపణలు చేసిన వాటి పైన కూడా రేవంత్ రెడ్డి విచారణ చేయించాలి. అధికారులు మారలేదు ప్రభుత్వమే మారింది… ఆనాడు ఉన్నా శివధర్ రెడ్డి… టీఎస్పీఎస్సీ చైర్మన్ గా  ఉన్న మహేందర్ రెడ్డిలు, రవి గుప్తా లాంటి అధికారులే  ఈ రోజు ఉన్నారు. ఈ అధికారులు ఎవరూ కూడా బాధ్యులు కారా. ఒకవేళ ఫోన్ టాపింగ్ జరిగే ఉంటే... చిత్తశుద్ధి ఉంటే 2004 నుంచి ఫోన్ టాపింగ్ వ్యవహారాల పైన విచారణ చేపట్టాలి. ముఖ్యమంత్రి పక్కన ఉన్న పొన్నం ప్రభాకర్ గతంలో చేసిన విమర్శలపైన సమాధానం చెప్పాలి." 


"గతంలో నా ఫోన్ కూడా సర్వేలెన్స్ లో  ఉందని  నాకు యాపిల్‌ సంస్థ వాళ్లే  మెసేజ్ వస్తే నేను ప్రజలతో పంచుకున్నాను. ఎవరి ఫోన్లు టాప్ అయినయ్. ఎవరు చేశారనేది ప్రభుత్వం తేల్చాలి. ట్యాపింగ్ పైన అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టకుండా అడ్డగోలు ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుంది. "


పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కచ్చితంగా అనర్హత వేటు పడుతుందని. న్యాయస్థానంలో విజయం సాధిస్తామన్నారు కేటీఆర్. స్టేషన్ ఘన్ పూర్, ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక రావటం ఖాయమన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎవర్నీ బెదిరించలేదని... ఏ హీరోయిన్‌తో కూడా తనకు ఎలాంటి సంబంధాలు లేవని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసేవారిపై ఇక న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.