Pre Wedding Fraud: వారు పెళ్లికొడుకులు కాదు, కీచకులు.. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సజ్జనార్ సలహా
ప్రేమ పెళ్లి అయినా, పెద్దలు కుదిర్చిన వివాహం అయినా పెళ్లికి ముందు శారీరక సంబంధం విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఒత్తిడికి లొంగవద్దని హైదరాబాద్ సీపీ సజ్జనార్ యువతులకు సూచించారు.

హైదరాబాద్: పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు రోజురోజుకూ పెరిగి పోతున్నాయి. కేవలం ప్రేమ పేరుతో మాత్రమే కాదు, పెద్దలు కుదిర్చిన సంబంధాల విషయంలోనూ కొందరు నయవంచకులు యువతులను మోసం చేస్తున్నారని అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సూచించారు. ఇలాంటి ఘటనలపై గత కొంతకాలం నుంచి హైదరాబాద్ షీ టీమ్స్కు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు.
మోసం జరుగుతున్న తీరు ఇదీ..
ముందుగా సంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు జరుగుతాయి. ఆపై ఎంగేజ్మెంట్ జరిపిస్తారు. ఇక మాకు పెళ్లి ఖాయమైంది కదా అనే చనువుతో యువకులు ఆ యువతులకు దగ్గరవుతున్నారు. ఎలాగూ పెళ్ళి చేసుకుంటున్నాం కదా.. పని ఇప్పుడైతే ఏంటి? అని మాయమాటలు చెప్పి, కొందరు యువతులను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఒత్తిడి పెంచి యువతులను శారీరకంగా లోబచుకుంటున్నారు. తీరా తమ కోరిక తీరాక వారి అసలు రంగు బయట పడుతుంది. పెళ్లి పీటలు ఎక్కాలంటే తమకు భారీగా డబ్బు కావాలని, అదనపు కట్నం ఇస్తేనే పెళ్లి జరుగుతుందని లేకపోతే మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారు’ అని సజ్జనార్ యువతులను అప్రమత్తం చేశారు.
నిశ్చితార్థం జరిగిపోవడం, బంధుమిత్రులు అందరికీ మీ పెళ్లి గురించి తెలిసిపోతుంది. కనుక ఇప్పుడు పెళ్లి ఆగిపోతే తమ కుటుంబం పరువు ఎక్కడ పోతుందోనన్న భయంతో చాలామంది యువతులు, వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న కొందరు కేటుగాళ్ళు, అడిగినంత డబ్బు ఇవ్వాలంటూ అమ్మాయిల తల్లిదండ్రులను వేధిస్తున్నారు. పరువు పోతుంది అని భయపడి మౌనంగా ఉంటే మాత్రం మీరు జీవితాంతం నరకం అనుభవించాల్సి వస్తుంది. నిశ్చితార్థం అయినా సరే, పెళ్లి పీటలు ఎక్కేవరకు కూడా ప్రతి యువతి అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ సూచించారు.
అమ్మాయిలూ.. జాగ్రత్త!! పెళ్లి ముసుగులో పొంచి ఉన్న ప్రమాదం!!
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 23, 2026
హైదరాబాద్ లో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం ప్రేమ పేరుతోనే కాదు, పెద్దలు కుదిర్చిన సంబంధాల మాటున కూడా కొందరు నయవంచకులు యువతులను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై ఇటీవల హైదరాబాద్ షీ టీమ్స్… pic.twitter.com/Nhy2rmE65o
‘పెద్దలు కుదిర్చిన సంబంధమే కదా అని ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. అబ్బాయి ప్రవర్తన, స్నేహితులు, అలవాట్లపై తప్పక ఆరా తీయాలి. కానీ పెళ్లికి ముందే ఏకాంతంగా కలవడానికి, శారీరక సంబంధానికి ఒత్తిడి చేస్తే అలాంటి వ్యక్తులను కచ్చితంగా అనుమానించాలి. ఈ సమయంలో వారి ప్రతిపాదనను ధైర్యంగా తిరస్కరించడంతో పాటు.. డబ్బు డిమాండ్ చేసినా, బ్లాక్ మెయిల్ చేసినా భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని’ సజ్జనార్ సలహా ఇచ్చారు.
ఎవరైనా మోసపోయి ఉంటే, ఇంకా తమకు అన్యాయం జరుగుతోందని భావిస్తే ధైర్యంగా ముందుకు రావాలన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే హైదరాబాద్ షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490616555కు గానీ, డయల్ 100 కు గానీ కాల్ చేసి ఫిర్యాదు చేయాలని యువతులు, వారి కుటుంబాలకు సజ్జనార్ సూచించారు.
























