AP Minister Nara Lokesh pays tribute to NTR on his death anniversary | హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ 29వ వర్ధంతి సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేశ్‌ ఆయన తల్లి నారా భువనేశ్వరి హైదరాబాద్ లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళి అర్పించారు. పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సినిమా రంగానికి, సీఎంగా తెలుగు ప్రజలకు చేసిన సేవల్ని వారు గుర్తుచేసుకున్నారు. మహానేత, యుగపురుషుడు ఎన్టీఆర్‌కు భారతరత్న వస్తుందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.

మన గళం ఢిల్లీలో వినిపించిన ఎన్టీఆర్

అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అంటే కేవలం మూడు అక్షరాల పేరు కాదు. అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ ఆయన ఓ ప్రభంజనం. రాజకీయాల్లోకి వచ్చిన కేవలం 9 నెలల్లోనే టీడీపీని అధికారంలోకి తెచ్చారు. పటేల్ పట్వారీ వ్యవస్థను రూపుమాపారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. ఎన్టీఆర్ వల్లే తెలుగువాళ్లు తల ఎత్తుకుని నిలబడగలుగుతున్నారు. ఆనాడు మనల్ని మదరాసీలు అనేవాళ్లు. కానీ తెలుగుజాతి గర్వించేలా మన గళం ఢిల్లీలో వినిపించిన వ్యక్తి ఎన్టీఆర్. తనను బర్తరఫ్ ఢిల్లీ స్థాయిలో పోరాటం జరిపి అనుకున్నది సాధించారు. ఒక్క వ్యక్తితో మొదలైన టీడీపీ ప్రస్థానం నేడు కోటి సభ్యత్వాలకు చేరింది. ఎన్టీఆర్ ఆశయాల కోసం పాటుపడతామని’ లోకేష్ అన్నారు.

అంతకుముందు నారా లోకేష్ ట్వీట్

నందమూరి తారక రామారావు 29వ వర్థంతి సందర్భంగా ఆయన మనవడు, ఏపీ మంత్రి లోకేష్ నివాళి అర్పించారు. ఎన్టీఆర్ అనేది పేరు కాదని, ఓ ప్రభంజనం.. అదొక సంచలనం అన్నారు. వెండితెరపై రారాజుగా వెలుగొందిన ఎన్టీఆర్ రాజకీయాల్లోనూ రాణించారు. తెలుగుజాతి ఆత్మగౌరవం, తెలుగుదనానికి ప్రతిరూపంగా నిలిచారు.  సామాజిక న్యాయం, ప్రజాసంక్షేమం సిద్ధాంతాలపై టీడీపీని ఎన్టీఆర్ నిర్మించారని.. ఆయన వర్థంతి సందర్భంగా ఘన నివాళులు. కోట్లాది హృదయాల్లో కొలువైన మా తాత ఎన్టీఆర్ నాకు నిత్యస్ఫూర్తి అని లోకేష్ పేర్కొన్నారు. 

Also Read: NTR Death Anniversary: తండ్రి వర్ధంతికి బాలకృష్ణ ఘన నివాళి... భారతరత్న సాధించి తీరతామన్న ఆర్ఆర్ఆర్