Telangana Latest News: హామ్ టెండర్లలో 8వేల కోట్ల కుంభకోణం- రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
Telangana Latest News: తెలంగాణలో ప్రతి పనిలో కుంభకోణం జరుగుతోందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. తాజాగా నిర్వహించి హామ్టెండర్లలో 8వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఆరోపించింది.

Telangana Latest News:ఇందిరమ్మ రాజ్యంలో రోజుకో అవినీతి ,పూటకో కుంభకోణం బయటపడుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఓ పని టెండర్కు సంబంధించి మంత్రుల మధ్య వివాదం తలెత్తితే సీఎం ఇద్దరినీ కూర్చో బెట్టి వాటాలు పంచారని ఎద్దేవా చేశారు. డెక్కన్ సిమెంట్స్ వాళ్ళని గన్ పెట్టి బెదిరించారని ఇందులో సీఎం పాత్ర ఉందని మంత్రి కూతురే ఆరోపించారని గుర్తు చేశారు. మద్యం సీసాల హోలోగ్రాం కుంభకోణంలో సీఎం మంత్రి వివాదంలో అధికారిని బలి చేశారని మండిపడ్డారు. తాజాగా హామ్ పేరుతో మరో స్కామ్కు పాల్పడనట్టు ఆరోపించారు.
హైబ్రిడ్ అన్యుటీ మోడ్ టెండర్లలో 8 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్నారు ప్రశాంత్ రెడ్డి. హమ్లో కిలోమీటర్కు 85 శాతం అంచనా వ్యయం పెంచారని తెలిపారు. తొమ్మిది వేల కోట్ల రూపాయలతో పూర్తి అయ్యే రోడ్లకు పదిహేడు వేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచారని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. 8 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈ ప్రభుత్వం లూటీ చేస్తోందన్నారు. సీ ఆర్ ఎఫ్ కింద కిలోమీటర్ కు కోటి 75 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, హామ్ కింద ఇచ్చిన టెండర్లలో కిలోమీటర్కు మూడు కోట్ల 30 లక్షల రూపాయలు ఖర్చవుతుందని గుర్తు చేశారు.
సీ ఆర్ ఎఫ్ కింద ఇచ్చిన రోడ్ల పనుల టెండర్ల జీవో,హమ్ జీవో కేవలం పది రోజుల తేడాలో వచ్చాయని జీవోలను వేముల చూపించారు. సీ ఆర్ ఎఫ్ కింద ఇచ్చిన జీవోలో కిలో మీటర్ కు ఓ రేటు ,హామ్ జీవోలో కిలోమీటర్ కు మరో రేటు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. హమ్ రోడ్ల టెండర్లు దక్కించుకున్న వారికి పది శాతం మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద ప్రభుత్వం చెల్లిస్తోందని అన్నారు. ఈ పదిహేడు వేల కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్సులు ఎవరి జేబుల్లోకి వెళ్తాయో అందరికీ తెలుసన్నారు. హమ్ కింద కిలోమీటర్ రోడ్డుకు మెయింటెనెన్స్ కు మరో 2.5 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారని, అంటే కిలో మీటర్ రోడ్డుకు హామ్ కింద 6 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని పేర్కొన్నారు.
హామ్లో 40 శాతం ప్రభుత్వం 60 శాతం ప్రైవేటు సంస్థలు భరిస్తాయని అంటున్నారని, ప్రైవేటు సంస్థలు బ్యాంకుల నుంచి తెచ్చే అప్పులకు ప్రభుత్వమే వడ్డీ కట్టాల్సి ఉంటుందని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మొత్తం మీద హామ్ మోడల్ ప్రజల మీద పెను భారం మోపే మోడల్ అని అభిప్రాయపడ్డారు. ఈ హామ్ టెండర్లు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హామ్ రోడ్లలో పాలుపంచుకుంటున్న ఇంజినీర్లు అధికారులు బడా కాంట్రాక్టర్లు ప్రభుత్వ దోపిడీలో భాగస్వామ్యం కావద్దని సూచించారు. ఇందులో పెద్ద అవినీతి జరుగుతున్నందున కేంద్ర దర్యాప్తు సంస్థలు తక్షణమే జోక్యం చేసుకోవాలని అన్నారు.
ఇద్దరు కేంద్రమంత్రులు రాష్ట్రం నుంచి ఉన్నారని, కిషన్ రెడ్డి ,బండి సంజయ్కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా హమ్ టెండర్లపై సిబిఐ దర్యాప్తు చేయించాలని ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దోచుకునే విషయం లోనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్ అయ్యిందని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి మాటి మాటికీ సీఎం వెళ్ళేది తన అవినీతి నుంచి కాపాడుకునేందుకేనన్నారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వరు కానీ హామ్ కింద మొబిలైజేషన్ అడ్వాన్స్ లు ఎలా చేస్తారని ప్రశ్నించారు. హామ్ రోడ్ల నిబంధనలు చిన్న కాంట్రాక్టర్లకు హాని చేసే విధంగా ఉన్నాయ్ అని ఆందోళన వ్యక్తం చేశారు. ఎనిమిది వేల కోట్ల ప్రజా ధనాన్ని లూటీ చేసే విధంగా ఉన్న హామ్ రోడ్ల టెండర్లపై ప్రతి వేదిక మీద గొంతు ఎత్తుతామని హెచ్చరించారు.





















