Telangana News: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. హబ్సిగూడ వద్ద జరిగిన ప్రమాదం చూస్తే గుండ తరక్కుపోతుంది. ఈ దుర్ఘటనలో పదోతరగతి చదువుతున్న విద్యార్థిని మృతి చెందింది. 


స్కూల్‌ విద్యార్థులతో వెళ్తున్న ఆటో ఒకటి సిగ్నల్ పడిందని ఆగి ఉంది. ముందు బస్‌ ఉందని దాన్ని వెనుకాల ఆటో ఆగిఉంది. ఇంతలో మృత్యువులా వచ్చిందో టిప్పర్. ఆగి ఉన్న ఆటోను వెనకాల నుంచి ఢీ కొట్టింది. 


బలంగా ఢీ కొట్టిన టిప్పర్ దాటికి ఆటో ఒక్కసారిగా బస్‌ కిందికి వెళ్లిపోయింది. ఈ దుర్ఘటనలో పదోతరగతి విద్యార్థి సాత్విక మృతి చెందింది. ఆ పాప తార్నాకలోని కిమితి కాలనీకి చెందిన విద్యార్థిని. ఆమె హబ్సిగూడలోని గౌతమ్ మోడల్ స్కూల్‌లో చదువుతోంది. 


ఈ ప్రమాదాన్ని చూసిన వారికి ఒళ్లు జలధరించడం ఖాయం. టిప్పర్‌ ఢీ కొట్టడంతోనే ముందు ఉన్న బస్‌ కిందికి ఆటో వెళ్లిపోయిందంటే అర్థంచేసుకోవచ్చు. ఆ టిప్పర్ ఎంత వేగంతో వస్తుందో. 


ప్రమాదంలో ఆటోలో ఇరుకున్న డ్రైవర్‌, విద్యార్థి సాత్వికను అతికష్టమ్మీద స్థానికులు బయటకు తీశారు. ఇద్దర్నీ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలు పాలైన సాత్విక ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ చనిపోయింది. డ్రైవర్‌ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.