ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సాయంత్రం కొత్త సచివాలయ పర్యటనకు వెళ్లిన సందర్భంలో కాస్త టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ ఎన్టీఆర్ మార్గ్ మీదుగా సచివాలయం నిర్మాణం అవుతున్న ప్రాంతానికి వస్తుండగా ఓ ఘటన జరిగింది. ఇద్దరు మైనర్ బాలురు బైక్‌పై రయ్ రయ్‌మంటూ కేసీఆర్ వాహన శ్రేణికి ఎదురుగా వెళ్లారు. దీంతో పోలీసులకు టెన్షన్ ఏర్పడింది. సాధారణంగా ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి వాహన శ్రేణి రోడ్డుపై వెళ్తున్నప్పుడు రహదారి మొత్తం ఖాళీగా ఉండాలి. లింక్ రోడ్ల నుంచి సడెన్‌గా ఎవరూ రోడ్డుపైకి, కాన్వాయ్‌కి అడ్డు రాకుండా అక్కడక్కడా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటారు. శనివారం కూడా పోలీసులు, భద్రతా సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇద్దరు బాలురు రోడ్డుపైకి దూసుకొచ్చేశారు.


బైక్ పైన ఇద్దరు పిల్లలు ముఖ్యమంత్రి వాహన శ్రేణికి ఎదురుగా దూసుకెళ్లడం పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. శనివారం (ఆగస్టు 7) సాయంత్రం ఎన్టీఆర్‌ మార్గ్‌లో ఈ ఘటన జరిగింది. కొత్తగా నిర్మిస్తున్న సచివాలయ భవన నిర్మాణ పనుల్ని పరిశీలించేందుకు సీఎం కేసీఆర్‌ వస్తుండగా ఈ ఘటన జరిగింది. సీఎం కేసీఆర్ పర్యటన ఉండడంతో ప్రగతి భవన్ నుంచి సచివాలయ ప్రాంతం మధ్యలో పోలీసులు వాహనాలను నిలిపివేశారు. పోలీసులు ఎన్టీఆర్‌ మార్గ్‌లో వాహనాల రాకపోకలు నిలిపివేశారు.


కేసీఆర్ కాన్వాయ్ వస్తుండగా సాయంత్రం 4.30 గంటల సమయంలో 11 నుంచి 14 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఓ బైక్‌పై తెలుగు తల్లి ఫ్లైఓవర్ జంక్షన్ వైపు నుంచి సీఎం కేసీఆర్ కాన్వాయ్ వచ్చే దారిలో తప్పుడు మార్గంలో దూసుకొచ్చేశారు. పోలీసులు పట్టుకునేలోపే వేగంగా ముందుకు దూసుకెళ్లి పోయారు. ఇదే సమయంలో సీఎం కాన్వాయ్‌, వీరి వాహనం ఎదురెదురుగా వచ్చేశాయి. వెంటనే పలువురు పోలీసులు పిల్లలను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 


ఈ పిల్లల్లో ఒకరిది హైదరాబాద్‌లోని శాస్త్రిపురం కాగా.. మరొకరు నిలోఫర్‌ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. వారు నడిపిన వాహనం గుర్తు తెలియని ఓ వ్యక్తి రెండు వేలకు అమ్మగా దాన్ని వీరు తీసుకున్నారు. చార్మినార్‌ వెళ్లి అక్కడి నుంచి నెక్లెస్‌ రోడ్డు వైపు వెళ్తున్నట్లుగా బాలురు చెప్పారు. అయితే, ఈ వాహనం దొంగతనానికి గురైనట్లు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా నమోదైందని పోలీసులు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పిల్లలపై చట్టప్రకారం కేసు నమోదు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు చెప్పారు. వాహనం అమ్మిన వారి కోసం ఆరా తీస్తున్నట్లు పోలీసులు వివరించారు.