Hyderabad Metro Rail : హైదరాబాదీలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో రైలు రెండో విడత పనులను త్వరలో ప్రారంభించబోతున్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు. నగరంలోని మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో రైలు సేవలను పొడిగించనున్నట్లు తెలిపారు. మెట్రో సెకండ్ ఫేజ్ పనులకు సీఎం కేసీఆర్ డిసెంబర్ 9న శంకుస్థాపన చేయనున్నారని వెల్లడించారు. మెట్రో సెకండ్ ఫేజ్ పనులను రూ. 6,250 కోట్లతో చేపట్టనున్నారు. మొత్తం 31 కిలోమీటర్ల మేర మెట్రో సేవలను విస్తరించనున్నారు. మెట్రో రెండో విడత పనులు పూర్తై అందుబాటులోకి వస్తే శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్‌ వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ సమయం మరింత తగ్గనుంది. మెట్రో సెకండ్ ఫేస్‌ విషయంలో నవంబర్ 14న మంత్రి కేటీఆర్‌ కేంద్రానికి లేఖ రాశారు. మెట్రో విస్తరణకు కేంద్రం నిధులు ఇవ్వాలని కోరారు. మొదటి విడతలోలాగే రెండో ఫేజ్ ను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో చేపడతారా అనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.  






కేంద్రానికి కేటీఆర్ లేఖ


హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఆర్థిక సాయం అందించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశారు. హైదరాబాద్ ఫేజ్ టూ, ఫేజ్ వన్ కారిడార్ నెంబర్ 3 ( నాగోల్ -ఎల్బీనగర్) విస్తరణకు కేంద్రం ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఇప్పటికే బీహెచ్ఈఎల్, లక్డీకాపూల్ మధ్య 26 కిలోమీటర్ల ( 23 స్టేషన్లతో ) ఎల్బీనగర్ – నాగోల్ మధ్య (4 స్టేషన్లతో 5 కిలోమీటర్ల మేర) మెట్రోను విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించిందని కేటీఆర్ లేఖలో తెలిపారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి అవసరమైన ఆర్థిక సాయాన్ని కోరేందుకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీని స్వయంగా కలిసి వివరించేందుకు సమయం అడిగినట్టు తెలిపారు కేటీఆర్. ఈ విషయంలో మరింత ఆలస్యం కాకుండా తెలంగాణ ప్రభుత్వం తరుపున మెట్రో విస్తరణకు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కేంద్రానికి పంపినట్టు తన లేఖలో తెలిపారు.


మెట్రో మరో 31 కిలోమీటర్లు


రోజు రోజుకు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో ప్రజారవాణా వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే అభివృద్ధి కొనసాగుతుందన్నారు కేటీఆర్. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ సర్కార్ భాగస్వామ్యంలో ప్రారంభమై విజయవంతంగా కొనసాగుతున్న హైదరాబాద్ మెట్రో ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టు అన్నారు. కోవిడ్ తరువాత హైదరాబాద్ లో ఊహించిన దానికంటే ఎక్కువగా ఉపాధి అవకాశాలు పెరగడం, పూర్తి స్థాయిలో కార్యాలయాలు పనిచేస్తుండడంతో మెట్రోను మరింత విస్తరించాలనుకుంటున్నట్టు కేటీఆర్ తెలిపారు. ఫేజ్ -1 లో 69 కిలోమీటర్ల మేర నడుస్తున్న మెట్రోకు అదనంగా మరో 31 కిలోమీటర్లకు విస్తరించాలనుకుంటున్న తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలకు ఆర్థికంగా చేయూత ఇవ్వాలని తన లేఖలో కోరారు. బీహెచ్ఈఎల్-లక్డీకాపుల్, నాగోల్ –ఎల్బీనగర్ కారిడార్ నిర్మాణానికి రూ.8453 కోట్ల వ్యయం అయిందన్నారు. దీని నిర్మాణాన్ని భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వ ఉమ్మడి భాగస్వామ్యంలో నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన రూ.8453 కోట్ల రూపాయల ప్రాజెక్టు ప్రతిపాదనలకు సూత్రప్రాయ అంగీకారం ఇచ్చి వచ్చే బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించాలని కోరారు.