Rajiv Swagruha Towers : హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన రాజీవ్ స్వగృహ టవర్లను అమ్మకానికి పెట్టింది. విడిగా ఫ్లాట్లను కూడా విక్రయిస్తుంది. హైదరాబాద్ లోని పోచారం, గాజులరామారంలో  నిర్మాణం పూర్తికాని రాజీవ్ స్వగృహ టవర్ల విక్రయానికి హెచ్ఎండీఏ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. పోచారంలో 4 టవర్లు, గాజులరామారంలో 5 టవర్ల విక్రయించనున్నట్లు చెప్పింది. పోచారంలో ఒక్కో టవర్ లో 72 నుంచి 198 ఫ్లాట్లు ఉన్నాయని తెలిపారు. గాజులరామారంలోని టవర్లో 112 ఫ్లాట్లు ఉన్నట్లు వెల్లడించింది. ఆసక్తి కలిగినవారు టవర్ మొత్తం వ్యయంలో రెండు శాతం ఈఎండీ సమర్పించాలని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ స్పష్టం చేసింది. https://www.hmda.gov.in/ , https://www.swagruha.telangana.gov.in/ వెబ్ సైట్లలో టవర్ల వివరాలు అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. ఈఎండీ సమర్పించేందుకు జనవరి 30వ తేదీ వరకు గడువు ప్రకటించింది.  లాటరీ ద్వారా టవర్లను కేటాయించనున్నట్టు హెచ్ఎండీఏ తెలిపింది.


రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి నోటిఫికేషన్ 


 హైదరాబాద్‌ లో సొంతిళ్లు కావాలనుకునేవాళ్లకు హెచ్ఎండీఏ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నగరానికి సమీపంలోని బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి నోటిఫికేషన్ జారీచేసంది. ఈ రెండు ప్రాంతాల్లో మిగిలిన ఫ్లాట్లను లాటరీ ద్వారా కేటాయించనున్నారు. టోకెన్ అడ్వాన్స్ చెల్లించేందుకు సిద్ధంగా ఉన్న వారికి లాటరీ ద్వారా ఫ్లాట్ల కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఫ్లాట్ల విస్తీర్ణానికి అనుగుణంగా 1 బీహెచ్ కే ఫ్లాట్ కు రూ.లక్ష, 2 బీహెచ్ కే ఫ్లాట్ కు రూ.2 లక్షలు, 3 బీహెచ్ కేకి రూ.3 లక్షలు టోకెన్ అడ్వాన్స్ గా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. టోకెన్ అడ్వాన్స్ చెల్లించేందుకు జనవరి 18వ తేదీ వరకు గడువు ఇచ్చారు. బండ్లగూడలో వన్ బెడ్ రూమ్ ఫ్లాట్లు 364, సీనియర్ సిటిజెన్ ఫ్లాట్లు 43 ఉన్నట్లు ప్రకటించింది. పోచారంలో త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు 16, డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు 570, వన్ బెడ్ రూమ్ ఫ్లాట్లు 269  ఉన్నాయని వెల్లడించారు. మధ్య తరగతి ప్రజలకు సొంత స్థలం ఇవ్వాలని ఉద్దేశం విక్రయాలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.  


38 ఓపెన్ ప్లాట్ల వేలం 


హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ నగర శివార్లలో ఉన్న 38 ఓపెన్ ప్లాట్‌ల వేలానికి సిద్ధమైంది. జనవరి 18న రెండు సెషన్లలో ఈ వేలం నిర్వహించనున్నట్లు తెలిపింది. ప్రాంతాల వారీగా ఈ ఫ్లాట్లకు వేర్వేరు ధరలను నిర్ణయించారు. హైదరాబాద్ శివార్లలోని నల్లగండ్లలో ఓపెన్ ప్లాట్లకు చదరపు గజానికి రూ. 1.50 లక్షలుగా అధికారులు నిర్ణయించారు. దర్గా హుస్సేన్ షావాలి, చందానగర్‌లోని శేరిలింగంపల్లి, కోకాపేట్‌లలోని ఓపెన్ ప్లాట్‌ల ధరలను చదరపు గజానికి రూ.లక్ష, రూ.1.10 లక్షలుగా హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఈ ఫ్లాట్లలో ఎక్కువగా 1000 చ.గజాల కన్నా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గండిపేటలోని పుప్పాలగూడలో 9680 చదరపు గజాల విస్తీర్ణంలో అతిపెద్ద ప్లాట్ ఈ వేలానికి నిర్ణయించింది. బిడ్డింగ్ లో చదరపు గజానికి రూ.10,000 నుంచి రూ.1.5 లక్షల వరకు ధర నిర్ణయించారు. నల్లగండ్లలో ఉన్న ఓపెన్ ప్లాట్లకు చదరపు గజానికి రూ.1.5 లక్షలుగా అధికారులు నిర్ణయించారు. ఇస్నాపూర్‌లోని ల్యాండ్ కు అత్యల్పంగా ధర రూ.10,000గా అధికారులు నిర్ణయించారు. రంగారెడ్డికి సంబంధించి ప్రీ బిడ్‌ సమావేశం జనవరి 4న, సంగారెడ్డికి జనవరి 5న, మేడ్చల్‌-మల్కాజిగిరిలో ఆసక్తి ఉన్న వారికి జనవరి 6న సమావేశం నిర్వహించినున్నట్లు అధికారులు తెలిపారు.