Hyderabad News : హైదరాబాద్ గోశామహల్ లోని చాక్నవాడిలో నాలా కుంగిపోయింది. నాలాపై ఉన్న కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. శుక్రవారం బస్తీలో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేశారు. కూరగాయల దుకాణాలు నాలాలో పడిపోయాయి. మార్కెట్లో ఏర్పాటుచేసుకున్న కూరగాయల దుకాణాలతో సహా పలువురు నాలాలో పడిపోయి గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మార్కెట్ కావడంతో పెద్ద ఎత్తున జనాలు వచ్చారు. పోలీసులు జనాలను తరలిస్తున్నారు. నాలా కుంగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఒక్కసారిగా నాలా కుంగిపోవడంతో స్థానికులు ఆందోళనకు గురైరయ్యారు.  



"గోషామహల్ ప్రాంతం కమర్షియల్ అయిపోయింది. ప్రతి ఇంట్లో కమర్షియల్ యాక్టివేటీస్ పెరిగిపోయాయి. భారీ వాహనాలు ఈ ప్రాంతంలో పెరుగుతున్నాయి. నాలా కుంగిపోవడం దురదృష్టకరం. ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. స్థానికులు ఇళ్లలోంచి బయటకు వచ్చి కొన్ని గంటలు దూరంగా ఉండాలి. " -స్థానిక వ్యాపారి 


కావాలని బైక్ ను కారుతో ఢీకొట్టిన యువకుడు 


రాయదుర్గం పోలీస్ స్టేషన్ (Raidurgam Police Station) పరిధిలో దారుణం జరిగింది. ఓ కారుతో యువకుడు బైకర్ ను ఢీకొన్నాడు. అతను కోపంతో ఈ పని చేయడం విస్మయం కలిగిస్తోంది. ఈ నెల 18నే ఈ ఘటన జరగ్గా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళ చనిపోయింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాయదుర్గం పోలీసులు వెల్లడించారు. ఎర్రగడ్డ నుంచి గచ్చిబౌలికి ద్విచక్ర వాహనంపై సయ్యద్ సైఫుద్దీన్, అతని భార్య మరియా మీర్ వెళ్తున్నారు. మరో ద్విచక్రవాహనంపై వారి వెంటనే బంధువులైన మరో ఇద్దరు యువకులు కూడా వెళ్తున్నారు. అలా దుర్గం చెరువు తీగల వంతెన వద్దకు రాగానే ఆ యువకుల పక్క నుంచి ఓ బెంజ్ కారు దూసుకెళ్లింది. ఆ క్రమంలో రోడ్డుపై ఉన్న నీరు వాళ్లపై చిందింది. దీంతో కారు నడుపుతున్న వ్యక్తిని యువకులు దూషించారు. అది చూసిన కారులోని వ్యక్తి కోపంతో బైక్ పై వెళ్తున్న వారిని కారుతో ఢీకొన్నాడు. కారు నడిపే వ్యక్తి రాజా సింహ రెడ్డి అని గుర్తించారు పోలీసులు. 


 ప్రశ్నించినందుకు మరో బైక్ ను కారుతో ఢీకొట్టిన యువకుడు


వెనుక బైక్ పై వస్తున్న భార్యా భర్తలు ఇది చూసి ఎందుకు ఢీ కొట్టావ్ అని వాగ్వాదానికి దిగడంతో వారిని కూడా కారుతో ఢీకొన్నాడు. ర్యాష్ డ్రైవింగ్ చేసి సారీ చెప్పకుండా వెళ్తున్నందుకు బాధితులు కారును వెంబడించగా.. ఈ దంపతుల బైక్ ను గచ్చిబౌలోని అట్రియం మాల్‌ వద్ద నిందితుడు ఢీ కొట్టాడు. దీంతో బైక్ పై నుంచి దంపతులు ఎగిరి కింద పడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో వెంటనే యువకులు దంపతులను ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఈ రోజు (డిసెంబరు 22) మారియా మృతి చెందింది. మృతురాలికి 8 నెలల కూతురు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రాజసింహ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. కారులో ప్రయాణించిన వ్యక్తి జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త కొడుకు రాజసింహారెడ్డిగా గుర్తించి పోలీసులు అరెస్ట్‌ చేశారు.