MP Uttam Kumar Reddy : ఎస్టీ రిజర్వేషన్ల కోటా పెంపు, గిరిజన బంధుపై సీఎం కేసీఆర్‌ హామీలు బూటకమని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఉద్యోగ, విద్యలో కోటా పెంపుపై ముఖ్యమంత్రి నకిలీ హామీలతో షెడ్యూల్డ్ వర్గాలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న 6% రిజర్వేషన్లను 10 శాతానికి పెంచడం, గిరిజన బంధు పథకం ద్వారా అర్హులైన ఎస్టీ కుటుంబాలకు రూ.10 లక్షల సాయం మరో ఎండమావి లాంటిదని ఆయన అన్నారు. ఎస్టీ కోటాను 10 శాతం పెంచాలని 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని, ఉద్యోగాలు, విద్యలో ఎస్టీ కోటాను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయాలని గత ఎనిమిదేళ్లుగా ముఖ్యమంత్రికి అనేక సార్లు ఫిర్యాదు చేశామన్నారు.  6 శాతం నుంచి 10 శాతం పెంచాలనే అంశాన్ని తాను గతంలో చాలా సార్లు పార్లమెంట్ లో లేవనెత్తానన్నారు. ఈ ఏడాది ఆగస్టు 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి కూడా ఒక వినతిపత్రం కూడా ఇచ్చానన్నారు. ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎస్టీ కోటా పెంపునకు జీవో జారీ చేస్తానని కేసీఆర్ ప్రకటించారని కానీ ఆయన ప్రకటనపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు సీఎం కేసీఆర్‌ పన్నుతున్న ట్రిక్‌ అని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆరోపించారు.  


జోవో వెంటనే జారీ చేయాలి 


ఎస్టీలపై సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే జీవో జారీ చేయాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సాధారణ జీవో జారీ చేయడానికి వారం రోజులు ఆగాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ సీరియస్‌గా ఉంటే గంటలోపే పూర్తి చేయొచ్చన్నారు. అయితే కేసీఆర్ మాత్రం ఆ సాకుతో మరింత జాప్యం చేసే విధంగా ప్రకటనను కాలయాపన చేస్తున్నారన్నారు.  జూన్-జూలై 2014లోనే జీవో జారీ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ కోటాను 10 శాతానికి పెంచితే ఎంతో మందికి లబ్ధి జరిగేదని అన్నారు.  పెంచడంలో జాప్యంతో గత ఎనిమిదేళ్లలో ఎస్టీ కమ్యూనిటీ వేలాది ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ కళాశాలల్లో లక్షలాది సీట్లను కోల్పోయారన్నారు. ఈ నష్టానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్‌తో 10% పెంచిన ఎస్టీ కోటాను అమలు చేయాలని సూచించారు.


రిజర్వేషన్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర


బీజేపీ ప్రభుత్వం గిరిజన వ్యతిరేకి అని, ఎస్టీ కోటాను 10 శాతానికి పెంచడాన్ని ఎప్పటికీ ఆమోదించదని ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. దేశమంతటా ఉన్న రిజర్వేషన్లను అంతం చేయడానికి మోదీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆరోపించరు. పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రయోజనం చేకూర్చే ప్రస్తుత రిజర్వేషన్ వ్యవస్థను అంతం చేయడానికి మాత్రమే అన్ని రంగాలు, పీ.ఎస్.యూ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తోందని అన్నారు. ఇది కేవలం ఎస్టీలు, ఎస్సీలు, ఇతర వర్గాల కోటాల పెంపు ప్రతిపాదనలకు బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశించడం సమయం వృధా అని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.


పోడు భూములు లాక్కున్న ఘనత టీఆర్ఎస్ దే 


"పోడు భూముల సమస్యను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సృష్టించింది. ఎన్నో దశాబ్దాలుగా ఆ భూములను సాగు చేసుకుంటున్న ఎస్టీలకు గత కాంగ్రెస్ ప్రభుత్వం హక్కులు కల్పించింది. హరితహారం తదితర కారణాలతో గిరిజనుల నుంచి పోడు భూములను లాక్కున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే. పోడు భూములపై ​​గిరిజనులకు యాజమాన్య హక్కులు కల్పించడం ఎస్టీలకు కేసీఆర్ చేస్తున్న ఉపకారం కాదు, హక్కుల కోసం పోరాడుతున్న వేలాది మంది ఎస్టీల ముందు ఆయన ప్రభుత్వం లొంగిపోయింది. తెలంగాణలో పోడు భూముల ఆందోళనలో గిరిజనులపై నమోదు చేసిన కేసులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి."- ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి 


మూడెకరాల భూమి ఎప్పుడిస్తారు


దళిత బంధు పథకం కింద దాదాపు 17 లక్షల పేద దళిత కుటుంబాలకు రూ.10 లక్షల సాయం అందజేస్తామన్న కేసీఆర్‌ ప్రభుత్వం 5 వేల కుటుంబాలకు కూడా సాయం చేయలేదని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలను  ‘గిరిజన బంధు’ పథకం కింద లబ్ధిదారులుగా ఎంపిక చేసి, అన్ని ఎస్టీ కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున అందజేస్తామంటూ ప్రచారం కల్పించారని విమర్శించారు. ఇది కేసీఆర్ చేస్తున్న మరో మోసం అన్నారు. దళిత బంధు పేరుతో ప్రజలను మోసం చేసిన కేసీఆర్, మునుగోడు ఉప ఎన్నికల్లో గిరిజన బంధు పేరుతో మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎస్టీ కుటుంబాలకు హామీ ఇచ్చిన మూడెకరాల భూమి ఎప్పుడు ఇస్తారో చెప్పాలని సీఎం కేసీఆర్‌ను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. కొత్త  గ్రామ పంచాయతీలుగా మారిన లంబాడా తాండాలకు మౌలిక వసతుల కల్పనకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.