CM KCR On AP BRS : మహోజ్వల భారత దేశం కోసమే బీఆర్ఎస్ పార్టీ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఒక ప్రాంతానికి పరిమితం అయ్యే పార్టీ కాదన్నారు. ఏపీ నేతలు తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ కు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. ఈ కార్యక్రమంలో మాట్లాడిన కేసీఆర్... లక్షల కిలోమీటర్ల ప్రయాణం ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుందన్నారు. ఎవరైనా ఏ విషయాన్ని గుర్తించడానికి మొదట ఒప్పుకోరన్నారు. కొంచం గట్టిగా అరిస్తే అప్పుడు గుర్తిస్తాన్నా్రన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రయాణం కూడా అలానే మొదలైందని కేసీఆర్ అన్నారు. ముందు అవహేళన చేసిన వాళ్లే ఆ తర్వాత దాడులకు పాల్పడతారని, ఆ తర్వాత మనకు విజయం సాధ్యమవుతుందన్నారు. ఎందుకు బీఆర్ఎస్ అనేది కార్యకర్తలకు చెప్పడానికి భవిష్యత్తులో క్లాసులు నిర్వహిస్తామని చెప్పారు. 






దేశం కోసం బీఆర్ఎస్ 


"బీఆర్ఎస్ దేశం పెట్టింది. బీఆర్ఎస్ అంటే తమాషా కాదు. గుణాత్మకమార్పు కోసమే బీఆర్ఎస్. మన దేశంలో లక్ష్యం ఎలా ఉందంటే ఏం చేసైనా ఎన్నికల్లో గెలవాలి. ఇదే లక్ష్యంగా మారిపోయింది. మతాల మధ్య చిచ్చుపెట్టొచ్చు, కులాల కుంపట్లు పెట్టొచ్చు, విద్వేషాలు రెచ్చగొట్టొ్చ్చు. ఏదైనా చేసి ఎన్నికలు గెలవడమే లక్ష్యం అయిపోయింది. రాజకీయాల్లో ఉండాల్సిన లక్షణం ఇదే. రైతాంగం అంతా దిల్లీ పోయి ధర్నాలు చేశారు. సుమారు 750 మంది చనిపోయారు. వారికి సంతాపం చెప్పిన దాఖలాలు లేవు. ఎమ్మెల్యే కాగానే కొమ్ములొస్తున్నాయి. వారి భాష, వేషం, తీరు మారిపోతున్నాయి. ఇవి నాయకత్వ లక్షణాలు కాదు. సహజత్వానికి దూరంగా నాయకత్వం మారిపోతుంది." - సీఎం కేసీఆర్  


ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా చంద్రశేఖర్ 


"ఏపీలో మేం కర్తలం, భర్తలం అనే ధోరణి మారాలి. దేశంలో మార్పుకోసం ఏపీ కూడా భాగస్వామ్యం కావాలి. అసలు సిసలైన ప్రజారాజకీయాలు మొదలుకావాలి. అంతా మేమే చేయగలం అనే భావన పోవాలి. ఏపీ, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, ఒడిషాలో కమిటీలు మొదలయ్యాయి. సంక్రాంతి తర్వాత నుంచి అన్ని కార్యక్రమాలు మొదలవుతాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని బీజేపీ ప్రైవేట్ పరం చేసినా బీఆర్ఎస్ పవర్ లోకి వస్తే మళ్లీ జాతీయకరణ చేస్తాం. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశంలో రెండేళ్లలో వెలుగుజిలుగులు వస్తాయి. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా చంద్రశేఖర్ ను నియమిస్తున్నాను. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది చంద్రశేఖర్ ఏపీలో విజయం సాధిస్తారు. ఏపీ నుంచి చాలా ఫోన్లు వస్తున్నాయి. సంక్రాంతి తర్వాత నుంచి ఏపీలో బీఆర్ఎస్ యాక్టివిటీస్ మొదలవుతాయి. " - కేసీఆర్ 


బీఆర్ఎస్ విస్తరణ 


ఏపీ నేతలు బీఆర్‌ఎస్‌ లో చేరారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిషోర్, పార్థసారథి, టీజే ప్రకాష్, రమేష్‌ నాయుడు, గిద్దల శ్రీనివాస్, జేటీ రామారావులకు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తోట చంద్రశేఖర్‌ను ఏపీ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కేసీఆర్‌ నియమించారు.  దిల్లీ కేంద్రంగా రావెల కిశోర్ బాధ్యతలు నిర్వహిస్తారని సీఎం కేసీఆర్ తెలిపారు. ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇవాళ వజ్రాల లాంటి నేతలు బీఆర్ఎస్ లో చేరారని కేసీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ వెంట వచ్చేందుకు చాలా వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.   జాతీయ పార్టీగా దేశ వ్యాప్తంగా విస్తరించే ప్రయత్నాల్లో ఉన్న బీఆర్‌ఎస్‌ ముందుగా ఏపీలో తమ శాఖను విస్తరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.