Hyderabad BJP leader Madhavilatha :  హైదరాబాద్ బీజేపీ నాయకురాలు మాధవీలత కరుడుగట్టిన హిందూత్వ వాదిగా పేరు తెచ్చుకున్నారు.  వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యల ద్వారా ఎన్నికల సమయంలో ఆమె దేశం దృష్టిని ఆకర్షించారు. అలాంటి హిందూత్వ నేత  హఠాత్తుగా  బీబీ కా ఆలంను సందర్శించి, ముహర్రం 5వ రోజు సందర్భంగా అక్కడ ప్రార్థనలు నిర్వహించారు.  ఈ వీడియోలు సోషల్ మీడియా ద్వారా  వైరల్ అవుతున్నాయి.                     

మాధవీలత హైదరాబాద్‌లోని ప్రముఖ విరించి హాస్పిటల్‌కు చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆమె భర్త కొంపెల్ల విశ్వనాథ్ కూడా వ్యాపారవేత్త. ఆమె లతామా ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవలు కూడా చేస్తున్నారు.   బీజేపీ హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో అసదుద్దీన్ ఒవైసీ  ని ఓడించేందుకు మాధవీలతను అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈ నియోజకవర్గం 1984 నుంచి AIMIM కంచుకోటగా ఉంది,   ఒవైసీ కుటుంబం నాలుగు దశాబ్దాలుగా ఈ స్థానంలో విజయం సాధిస్తోంది. అయితే ఆ ఎన్నికల్లో ఆమె విజయం సాధించలేదు. కానీ హిందూత్వం పేరుతో ఆమె చాలా వివాదాస్పద వ్యాక్యలు చేసారు. మసీదుపై ఓ సారి రామణబాణం విసురుతున్నట్లుగా చేసిన సూచన ..  దేశవ్యాప్తంగా విమర్శల పాలయింది.  ఆమె అభ్యర్థిత్వం కొంతమంది స్థానిక బీజేపీ నేతల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ, ఆమె ప్రచారం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ఎన్నికల తర్వాత ఆమె అంతగా యాక్టివ్ గా లేరు. హఠాత్తుగా బీబీకా అలంలో పూజలు చేయడం  వైరల్ గా మారింది.    మత రాజకీయాల కోసమే ఇలాంటి పనులు చేస్తూంటారని కొంత మంది సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. 

ప్రస్తుతం జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగాల్సి ఉంది.  అక్కడి నుంచి బీజేపీ తరపున తాను పోటీ చేస్తానని ఆమె ఇప్పటికే ప్రకటించారు. ఆమె పోటీ చేస్తే..  ముస్లింల మద్దతు అవసరం. జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో గణనీయ సంఖ్యలో ముస్లిం ఓట్లు ఉంటాయి. అందుకే మాధవీలత వారికి పూర్తి వ్యతిరేకులరాలిగా అనిపించుకోకుండా.. ఇలా ముస్లింలపైనా తనకు గౌరవం ఉందని చెప్పాలని అనుకుంటున్నారు. అయితే ఆమె ప్రయత్నం మాత్రం సోషల్ మీడియాలో విమర్శల పాలవుతోంది. ప్రజల్ని రెచ్చగొట్టేందుకు మత రాజకీయాలు చేస్తున్నారని అంటున్నారు.