Harish Rao strongly criticized the notices to KCR: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, దశాబ్ద కాలం పాటు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిన కేసీఆర్  ని లక్ష్యంగా చేసుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుతంత్రాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు  మండిపడ్డారు.  కేసీఆర్ ని తాకడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు.  స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన మహానేతపై బురద చల్లడం అంటే సూర్యుడిపై ఉమ్మి వేయడమేనని, ఇలాంటి చౌకబారు రాజకీయాలను తెలంగాణ సమాజం హర్షించదని ఆయన మండిపడ్డారు.

Continues below advertisement

సింగరేణి బొగ్గు కుంభకోణం వంటి ఆరోపణల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్ ప్రభుత్వం  సిట్' నోటీసుల డ్రామా ఆడుతోందని హరీష్ రావు విమర్శించారు. పరిపాలనా వైఫల్యాలు, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే ఈ విధమైన రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలాంటి దివాళాకోరు చర్యలకు దిగుతోందని ఆయన ఎద్దేవా చేశారు.

చరిత్రను సృష్టించిన కేసీఆర్ గారిని మలినం చేయాలని చూస్తున్న రేవంత్ రెడ్డిని  చరిత్రహీనుడు గా హరీష్ రావు అభివర్ణించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అహంకారంతో వ్యవహరిస్తున్న వారికి కాలమే సమాధానం చెబుతుందని ఆయన హెచ్చరించారు. కేసీఆర్   వెనుక కోట్లాది మంది తెలంగాణ ప్రజలు ఉన్నారని, ఇలాంటి నోటీసులకు లేదా బెదిరింపులకు బీఆర్ఎస్ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.         

Continues below advertisement

 రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఈ రాజకీయ వేధింపులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కక్షసాధింపు చర్యలు మానుకుని, రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి సారించాలని డివైడ్ చేశారు. సిట్ నోటీసుల జారీ అనేది ముమ్మాటికీ రాజకీయ కుట్రలో భాగమేనని, దీనిని చట్టపరంగా, ప్రజాక్షేత్రంలోనూ ఎదుర్కొంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు నోటీసులు 

ఫోన్ ట్యాపింగ్  కేసులో సిట్ అధికారులు  CRPC 160 ప్రకారం ఆయనకు నోటీసులు జారీ చేశారు. కేసు దర్యాప్తు అధికారి, ఏసీపీ వెంకటగిరి ముందు జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్‌కు విచారణకు రావొచ్చని.. లేదా ఆయన వయసు రీత్యా ఆయనకు తగిన చోట విచారణకు హాజరు కావొచ్చని నోటీసులో పేర్కొన్నారు. ఇవాళ మధ్యాహ్నం నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసంలో నోటీసులు అందజేశారు. కేసీఆర్ ఎక్కడ విచారణ కోరుకుంటున్నారో దర్యాప్తు అధికారికి తెలపాలని నోటీసుల్లో సూచించారు.