TSRTC Good News: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వల్ప దూరం ప్రయాణించే వారి కోసం టీఎస్ ఆర్టీసీ మరో రాయితీ పథకాన్ని ప్రకటించింది. పల్లె వెలుగు బస్సు ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా ‘టి9-30 టికెట్’ ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే టి9-60 వాడకంలో ఉండగా.. ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు తాజాగా టి9-30 టికెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని బస్ భవన్ లో బుధవారం ‘టి9-30 టికెట్’ పోస్టర్ ను టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఆవిష్కరించారు. ఈ టికెట్‌ కు రూ.50 చెల్లిస్తే 30 కిలో మీటర్ల పరిధిలో రానూపోను ప్రయాణించే వెసులుబాటును ప్రయాణికులకు కల్పించినట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ఈ టికెట్‌ చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. ఈ నెల 27(గురువారం) నుంచి ఈ టికెట్ అమల్లోకి వస్తుందని, పల్లె వెలుగు బస్సు కండక్టర్ల వద్ద టికెట్‌ అందుబాటులో ఉంటుందన్నారు. సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ టికెట్ ను వారు ఇస్తారని వెల్లడించారు. 






“పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే సాధారణ ప్రయాణికులందరికీ ఈ రాయితీ పథకం వర్తిస్తుంది. స్వల్ప దూరం ప్రయాణించే ఉద్యోగులు, వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులకు టి9-30 టికెట్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ టికెట్ తో 30 కిలో మీటర్ల పరిధిలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యలో రానూపోను ప్రయాణం చేయొచ్చు. 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇతర రాష్ట్రాలకు ఈ టికెట్ వర్తిస్తుంది. ఈ టికెట్ ద్వారా ఒక్కొక్కరికి రూ.10 నుంచి రూ.30  వరకు ఆదా అవుతుంది. ఈ టికెట్‌ తీసుకున్న ప్రయాణికులు తిరుగు ప్రయాణంలో రూ.20 కాంబి టికెట్ తీసుకుని ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లోనూ ప్రయాణించవచ్చు. ఒక నెల పాటు ఈ టికెట్ అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ప్రయాణికుల స్పందనను బట్టి పొడిగించడం జరుగుతుంది.” అని సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు. 


అందరికీ ‘టి9-60 టికెట్’ వర్తింపు


ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన టి9-60 టికెట్ ను పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణించే వారందరికీ వర్తింపజేస్తున్నట్లు చైర్మన్, ఎండీ ప్రకటించారు. మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం తీసుకువచ్చిన ఈ టికెట్ ను.. ఈ నెల 27 (గురువారం) నుంచి పురుషులకు కూడా వర్తింపజేస్తూ సంస్థ నిర్ణయం తీసుకుందని వారు వెల్లడించారు. రూ.100 చెల్లించి 60 కిలోమీటర్ల పరిధిలో రానూపోను ప్రయాణించే ఈ టికెట్ కు మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే టి9-30 టికెట్ కు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. పల్లె వెలుగు బస్సుల్లో ప్రతి రోజు సగటున 15  లక్షల మంది ప్రయాణిస్తున్నారని, వారందరికీ ఆర్ధిక భారం తగ్గంచాలనే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా ఈ టికెట్లను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రయాణికులు ఈ రాయితీ పథకాలను వినియోగించుకుని సంస్థను ఆదరించాలని కోరారు. టి9-30 టికెట్ కు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు. 


‘టి9-30టికెట్’ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)లు పీవీ ముని శేఖర్, పురుషోత్తం, కృష్ణ కాంత్, సీటీఎం జీవన్ ప్ర‌సాద్‌, చీఫ్ మేనేజర్ ప్రాజెక్ట్స్ విజయ్ కుమార్, సీఎంఈ రఘునాథరావు, సీఈఐటీ రాజశేఖర్ లతో పాటు వర్చువల్ గా ఈడీలు, ఆర్ఎంలు, డిప్యూటీ ఆర్ఎంలు, డీఎంలు పాల్గొన్నారు.