Rapolu Ananda Bhaskar Rapolu resigns from BJP: మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ బీజేపీకి రాజీనామా చేశారు. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసిన రాపోలు టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బీజేపీకి రాజీనామా చేసిన రాపోలు  పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు. కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రోత్సాహంతో 2019 ఏప్రిల్‌ 4న బీజేపీ చేరాను. ఇంతకాలం పార్టీలో మీలాంటి మహానుభావులతో కలిసి ఉండే అవకాశం కల్పించిన మీకు కృతజ్ఞతలు. భారతీయ జనతాపార్టీ (బీజేపీ)నుంచి నేను ఈ క్షణం నుంచి దూరమవుతున్నాను అని తన రాజీనామా లేఖలో రాపోలు రాసుకొచ్చారు. 


రాపోలు రాజీనామా లేఖలో ఏముందంటే..
‘పార్టీలో చేరే సమయంలో నేను ఒక ప్రకటన చేశాను. ఆధునిక యాంత్రిక సమాజం కుట్రలు, కుతంత్రాలతో నిండిఉన్నది. ఇలాంటి సమయంలో భారతీయుల్లో దేశభక్తి, జాతీయవాదం అనేది ఎంతో ముఖ్యం. రాష్ట్రాల్లోని స్థానిక ప్రజల గౌరవాన్ని కాపాడితేనే దేశానికి గుర్తింపు. భారతీయ ఆత్మ, జాతీయత భావన అనేవి ఎల్లప్పుడూ చైతన్యవంతంగా ఉండాలి. అప్పుడే దేశ సమగ్రత, ప్రాదేశిక భద్రత పరిపుష్టమౌతుంది. పార్టీ నియమాలను శ్రద్ధగా చదివిన వాడిని. అందులో బీజేపీ కి సానుకూల లౌకికవాదం ఖశ్చితంగా శిరోధార్యం అని నిర్ధారించారు. అంటే వసుదైవ కుటుంబ భావనకు పార్టీ పెద్దపీట వేస్తుందనుకొన్నా. ఈ సూత్రానికి ఆ పార్టీ నిజంగా కట్టుబడి ఉన్నదా? గ్రేట్‌ బ్రిటన్‌ జనాభాలో భారత సంతతికి చెందిన వారు 3 శాతమే. అయినప్పటికీ, భారత సంతతికి చెందిన వ్యక్తి ఆ దేశ ప్రధానిగా నియమితులయ్యారు. మరో అగ్రరాజ్యం అమెరికాకు భారత సంతతికి చెందిన మహిళ ఉపాధ్యక్ష పదవిని చేపట్టారు. ప్రపంచ దేశాల్లో అలా ఉంటే.. మన దేశంలో ఇబ్బందికరమైన విచ్చిన్నకర రాజకీయాలు ప్రోత్సహించబడుతున్నాయి.


సమగ్ర మానవతావాదం, అంత్యోదయ భావనలను పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ్‌ సూచించారు. ఈ విశిష్ట లక్ష్యాలను చేరడానికి పార్టీలో నిబద్ధత కొంతైనా కనిపిస్తున్నదా? అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీల ప్రియతమ నాయకుడు స్వర్గీయ అటల్‌ బిహారీ వాజ్‌పేయీ రాజధర్మాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. సహకార సమాఖ్యవాదంలో ఆయన పిలుపును ఎప్పుడైనా అనుసరించారా? రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, సమాజంలో చీలికలు తీసుకురావడమే పార్టీకి నిత్యకృత్యంగా మారిందని’ తన రాజీనామా లేఖలో రాపోలు పేర్కొన్నారు. 






‘కరోనా సమయంలో దినసరి కూలీలు, అసంఘటిత రంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. కానీ ఆక్సిజన్‌ కొరతతో ఎవ్వరూ మరణించలేదని కేంద్రం ప్రకటించింది. కరోనా కట్టడిలో విజయం సాధించామని సంబరాలు చేసుకుంటుంటే, ప్రభుత్వ చర్యలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. పార్టీని వీడే సమయంలో ఇలా తప్పులు ఎత్తిచూపడం నా లక్షణం కాదు. హుందాతనం అనిపించుకోదని తెలుసు. నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకొంటారని ఈ విషయాలు వెల్లడిస్తున్నాను. ఎవరూ పరిపూర్ణులు కాలేరు. కానీ అందుకోసం కష్టపడాలి. 
తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ
సామాజిక భద్రత, సామాజిక న్యాయం అనే వాటిని పార్టీ పట్టించుకోవట్లేదు. జనాభాలో కులగణనకు పార్టీ, కేంద్ర ప్రభుత్వం పూర్తి వ్యతిరేకంగా ఉన్నది. అప్పటినుంచి నాలో భయం మొదలైంది. ప్రాంతీయత, భాషలు, స్థానిక ప్రజల భావోద్వేగాలను చిన్నచూపు చూడడం పార్టీకి అలవాటుగా మారింది. ఏకభాషా పెత్తనాన్ని ప్రోత్సహించడం ఎక్కువైంది. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నది. తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన అవకాశాలను అందకుండా చేస్తున్నది. మిషన్‌ భగీరథ అనేది పారే నదీజలం తాగునీరుగా అందించే ప్రపంచస్థాయి మిషన్‌. తెలంగాణ ఏర్పడిన తర్వాత చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల వల్ల భూగర్భజలాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా పైకి ఉబికి వచ్చాయి. తెలంగాణలో వ్యవసాయం లాభసాటిగా మారింది. అయితే, బీజేపి తెలంగాణ శాఖ అధికారానికి రావాలనే ఆసక్తితో ఉన్న వారిలా బాధ్యతతో వ్యవహరించడం లేదన్నది అధిష్టానం గమనిండం లేదా. తెలంగాణ ప్రజలు తెలివైనవారు. వారికి అన్ని విషయాలు గుర్తుంటాయి.


చేనేత వృత్తులవారిపై లేఖ రాశాను కానీ 
కరోనా సంక్షోభంలో నా సామాజిక చేనేత వృత్తుల వారు ఎదుర్కొంటున్న సమస్యలపైన అప్పటి మంత్రికి 2020 సెప్టెంబర్‌ 20న నేను రాత పూర్వకంగా విన్నవించా. కానీ దాన్ని పట్టించుకోలేదు. అంగన్వాడీ వర్కర్లకు ఒక్కొక్కరికి రెండు కాటన్‌ చీరల కోసం రూ. 400 చెల్లిస్తామన్నారు. పత్తి ముడి సరుకు, నేత నేయడానికి ఖర్చు అంతా కలిపి కనీసం రూ. 900 ఖర్చు అవుతుంది. వీటికి నిధులను విడుదల చేస్తే, చేనేత వర్గం వారు ఎంతో లబ్ధి పొందేవారు. పోషణ్‌ అభియాన్‌ కింద 53.43 లక్షల యూనిట్ల డ్రెస్ మెటీరియల్‌ సేకరణతో చేనేత వర్గంతో పాటు 13.36 లక్షల మంది అంగన్వాడీ వర్కర్లకు ప్రయోజనం చేకూరేది. చేనేత కార్మికుల సమస్యలను  ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నిస్తే కొన్నింటిని విన్నారు. మరికొన్ని పట్టించుకోలేదు. 


నా అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని 2015 నుంచి ఆగస్టు 7న ఏటా జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుతున్నారు. దీంతో పార్టీకి ఎంతో గుర్తింపు వచ్చింది. చేనేత కార్మికులను భూమి లేని కూలీలుగా పరిగణించాలని, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వారికి 100 రోజుల వేతనం ఇవ్వాలని, తద్వారా జీవనాధారం కల్పించాలని అభ్యర్థించా. దీనికి అప్పటి గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి నితిన్‌ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ పథకాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆయన ఆదేశాలు బుట్టదాఖలయ్యాయని’ మాజీ ఎంపీ రాపోలు తన లేఖలో రాసుకొచ్చారు.