Gandhi Bhavan Fight :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేగిన అసంతృప్తిని చల్లార్చేందుకు హైకమాండ్ చేస్తున్న ప్రయత్నాలు మరింత మంటలు రాజేస్తున్నాయి. ఈ సారి గాంధీభవన్ సాక్షిగానే ఆ పార్టీ తీరు మరోసారి చర్చనీయాంశమైంది. నేతలు ఒకరినొకరు కొట్టుకునేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. సీనియర్ల అసంతృప్తిని చక్కదిద్దేందుకు వచ్చిన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ గాంధీభవన్ లో పార్టీ నేతలతో చర్చిస్తుున్నారు. అయితే బయట మాత్రం తీవ్రంగా ఘర్షణ చోటు చేసుకుంది. దిగ్విజయ్ సింగ్ ను కలిసేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ పై పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ వర్గీయులు దాడికి ప్రయత్నించారు. 


ఇటీవల సీనియర్ నేతల తీరుపై ఈరవత్రి అనిల్ విమర్శలు గుప్పంచారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న  ఉత్తమ్ కుమార్ రెడ్డి ్నుచరులు గాంధీ భవన్ లో అడ్డుకున్నారు.  సేవ్ కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. అనిల్ క్షమాపణ చెప్పాలంటూ ఓయూ విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. దాంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. చొక్కాలు పట్టుకుని నెట్టుకున్నారు. ఒకరిపై ఒకరు దాడికి యత్నించారు. ఈ దశలో సీనియర్ నేత మల్లు రవి వచ్చి సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.ఏదైనా సమస్య ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, ఇలాంటి గొడవలు, కొట్టుకోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని  మల్లు రవి సర్ది చెప్పారు.  కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని శిరసు వంచి కోరుతున్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలపై పోరాటం కోసం మీ శక్తినంతా వినియోగించాలి అంటూ శ్రేణులకు పిలుపునిచ్చారు. నేతల మధ్య భేదాభిప్రాయాలను దిగ్విజయ్ సింగ్ పరిష్కరిస్తారని మల్లు రవి తెలిపారు.


మరో వైపు గాంధీ భవన్‌లో పలువురు సీనియర్ నేతలు.. దిగ్విజయ్ సింగ్ ను కలుస్తున్నారు.  సీనియర్ నేత వీహెచ్ .. దిగ్విజయ్‌ను కలిసి తాజా పరిస్థితులను వివరించారు.   దిగ్విజయ్‌సింగ్‌తో అన్ని విషయాలు వివరించి చెప్పినట్లు తెలిపారు. కోవర్టుల అంశం చర్చకు రాలేదని చెప్పారు. అందరితో కలిసి ముందుకు పోవాలని దిగ్విజయ్‌సింగ్ సూచించారని వెల్లడించారు. పీసీసీ అధ్యక్షుడు కూడా అందరినీ కలుపుకొని వెళ్లాలని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి కి వీహెచ్ సూచించారు. రేణుకా చౌదరి కూడా దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అయ్యారరు.  పార్టీ సమస్యలు పరిష్కరించేందుకు దిగ్విజయ్ వచ్చారని తెలిపారు. త్వరలోనే పార్టీలోని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. కేసీఆర్ అరాచకాలు పెరిగిపోయాయని విమర్శించారు. కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేణుకా చౌదరి చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా దిగ్విజయ్ సింగ్ ను కలిశారు. 


సీనియర్ల అసంతృప్తిని చల్లార్చే విధంగా దిగ్విజయ్ సింగ్ ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సీనియర్ నేతలు.. తమకు కాంగ్రెస్ పార్టీలో ఎదురవుతున్న అనుభవాలపై .. అవమానాలపై ఎక్కువగా ఫిర్యాదు చేసినట్లుగా భావిస్తున్నారు. రేవంత్ వర్గం కూడా.. తమను కావాలని టార్గెట్ చేస్తున్నారని.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని నివేదించినట్లుగా చెబుతున్నారు.  దిగ్విజయ్ శుక్రవారం మీడియాతో మాట్లాడనున్నారు. ఢిల్లీ వెళ్లిన తర్వాత హైకమాండ్‌కు నివేదిక సమర్పిస్తారు.