Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. గత రెండ్రోజులుగా ఈడీ అధికారులు అరుణ్ రామచంద్ర పిళ్లైను ప్రశ్నస్తుండగా.. సోమవారం రాత్రి ఆయనును అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే 11 మంది అరెస్ట్ కాగా.. తీహార్ జైల్లో ఉన్న గోరంట్ల బుచ్చిబాబుకు సీబీఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తు అధికారులకు పాస్‌పోర్టు అప్పగించాలని, రూ.2 లక్షల పూచీకత్తు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ వ్యవహారంలో ఫిబ్రవరి 8న సీబీఐ.. ఆడిటర్ బుచ్చిబాబును అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  


రామచంద్ర పిళ్లైని అరెస్ట్ చేసిన అధికారులు 


ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఈడీ, సీబీఐలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ కేసులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పులువురిని దర్యాప్తు సంస్థలు ఇప్పటికే అరెస్ట్ చేశాయి. శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు, మాగుంట రాఘవరెడ్డి వంటి వారిని ఇప్పటికే దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేయగా... తాజాగా రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ముందుగా సీబీ అధికారులు అరుణ్ రామచంద్ర పిళ్లైపై అభియోగాలు నమోదు చేయగా.. ఈ విషయమై హైదరాబాద్ కేంద్రంగా పలు దఫాలు సోదాలు నిర్వహించారు. అరుణ్ రామచంద్ర పిళ్లైకి చెందిన సంస్థలు, ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేసి కీలక సమాచారాన్ని సేకరించారు. ఆపై కేసులో దాఖలు చేసిన చార్జీషీట్ లో అరుణ్ రామచంద్ర పిళ్లై పేరును కూడా దర్యాప్తు సంస్థలు ప్రస్తావించాయి. అలాగే రామచంద్ర పిళ్లైకి చెందిన ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. రామచంద్ర పిళ్లై కొందరికీ బినామీగా వ్యవహరించినట్లుగా దర్యాప్తు సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ దిశగా దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి.


పిళ్లై చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబుకు బెయిల్ మంజూరు


దిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ ఫిబ్రవరి 8న గోరంట్ల బుచ్చిబాబును అరెస్టు చేసింది. ముందు మూడు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు. తర్వాత రెండు సార్లు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో గోరంట్ల బుచ్చిబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ గత బుధవారం కోర్టు విచారించింది. ఈ పిటిషన్ పై వాదనలు తర్వాత ప్రత్యేక జడ్జి తీర్పును వాయిదా వేశారు. తాజాగా తీర్పు ఇస్తూ బుచ్చిబాబుకు బెయిల్ మంజూరు చేశారు. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ నుంచి అభిషేక్‌ బోయినపల్లి తర్వాత సీబీఐ అరెస్టు చేసిన రెండో వ్యక్తి గోరంట్ల బుచ్చిబాబు. ఈ కేసులో సీబీఐ, ఈడీ బుచ్చిబాబును ప్రశ్నించాయి. అనంతరం అరెస్టు చేశాయి. ఈ కేసులోనే వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు మాగుంట రాఘవ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. రాఘవరెడ్డి ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. రామచంద్ర పిళ్లై వద్ద చార్టెడ్ అకౌంట్‌గా పని చేస్తున్న గోరంట్ల బుచ్చిబాబు గతంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీఏగా పని చేసినట్లు తెలుస్తోంది.