Microsoft Data Centers : తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లోని డేటా సెంటర్ విస్తరణకు హామీ ఇచ్చింది. దావోస్‌లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్... మైక్రోసాఫ్ట్ ప్రతినిధులపై భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులపై చర్చించారు. రాబోయే ప్రాజెక్టులపై మంత్రి కేటీఆర్, పరిశ్రమలు వాణిజ్య శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మైక్రోసాఫ్ట్ ఆసియా అధ్యక్షుడు అహ్మద్ మజర్ తో చర్చించారు. 






 మొత్తం 6 డేటా సెంటర్లు 


మైక్రోసాఫ్ట్  మొదటి క్యాప్టివ్ డేటా సెంటర్ పెట్టుబడులను పెడుతున్నట్లు గత ఏడాది ప్రకటించింది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో మూడు డేటా సెంటర్‌లను ఏర్పాటు చేసింది. ఈ ప్రతి ఒక్క ఐటీ సెంటర్ 100 మెగావాట్లు సామర్థ్యాన్ని కలిగి ఉంది.  అయితే మైక్రోసాఫ్ట్ ఇప్పుడు తెలంగాణలోని మొత్తం 6 డేటా సెంటర్‌లను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఒక్కో డేటా సెంటర్ సగటున 100 మెగావాట్ల ఐటీ లోడ్‌ను అందిస్తోంది. ఈ డేటా సెంటర్‌లు భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న అజూర్ కస్టమర్‌లకు సేవలందించేందుకు తన క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేసేలా మైక్రోసాఫ్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 6 డేటా సెంటర్లు వచ్చే 10-15 సంవత్సరాలలో దశల వారీగా ఏర్పాటుచేయనుంది.  నైపుణ్యం, ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లు,  క్లౌడ్ అడాప్షన్ వంటి అనేక ప్రయోజనకరమైన కార్యకలాపాలను ప్రారంభించడానికి తెలంగాణ ఇంతకుముందు మైక్రోసాఫ్ట్‌తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. క్లౌడ్ అడాప్షన్‌ లో తెలంగాణ ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ అజూర్ తో కలిసి పనిచేస్తుంది.  
 
మైక్రోసాఫ్ట్ , హైదరాబాద్ మధ్య బంధం 


మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... మైక్రోసాఫ్ట్‌, హైదరాబాద్‌ మధ్య చాలా దీర్ఘకాలికంగా బంధం ఉందన్నారు. తెలంగాణలో మైక్రోసాఫ్ట్‌ తన డేటా సెంటర్ విస్తరించడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో  భారీ డిజిటల్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో మైక్రోసాఫ్ట్ మరింత అభివృద్ధి చెందాలన్నారు.  మైక్రోసాఫ్ట్ ఇన్‌కార్పొరేటెడ్ ఆసియా ప్రెసిడెంట్  అహ్మద్ మజార్ మాట్లాడుతూ... "హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా మాకు అత్యంత ముఖ్యమైన మార్కెట్‌లలో ఒకటి. మేము ఈ నగరంలో పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తాం. మేము తెలంగాణలో అమలు చేయబోయే డేటా సెంటర్ ప్రాజెక్ట్‌లలో కొన్ని మైక్రోసాఫ్ట్ ఇండియాలో సొంతంగా ఏర్పాటుచేసిన డేటా సెంటర్ ప్రాజెక్ట్‌లు. డేటా సెంటర్లు మాత్రమే కాకుండా ప్రత్యేక ప్రాజెక్ట్‌లను గుర్తించి, వాటిని అమలు చేయడంలో ప్రభుత్వంతో కలిసి చేస్తాం" అన్నారు.  


తెలంగాణలో ఎయిర్ టెల్ డేటా సెంటర్ 


తెలంగాణ రాష్ట్రంలో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఎయిర్ టెల్ సంస్థ ముందుకు వచ్చింది. డేటా స్టోరేజ్, విశ్లేషణలో అత్యాధునిక సాంకేతికతతోపాటు హైపల్ స్కేల్ డేటా సెంటర్ ను హైదరబాద్ లో ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ తెలిపింది. అనుబంధ సంస్థ అయిన నెక్స్ ట్రా ద్వారా భారతీ ఎయిర్ టెల్ ఈ సెంటర్ ను నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఇందుకు అవసరం అయిన మౌలిక సదుపాయల కల్పన కోసం రెండు వేల కోట్ల పెట్టుబడి పెడతామని ప్రకటించింది. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో భారతీ ఎయిర్ టెల్ వ్యవస్థాపక ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్, వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ భారతీ మిట్టల్ బుధవారం సమావేశం అయ్యారు. అనంతరం 60 మెగావాట్ల సామర్థ్యంలో హైపల్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. డేటా భద్రతలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే ఈ సెంటర్ రాబోయే 5 నుంచి 7 ఏళ్లలో పూర్తి స్థాయిలో పని చేస్తుందని వివరించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... భారతదేశంలో హైపల్ స్కేల్ డేటా సెంటర్లకు హైదరాబాద్ హబ్ గా మారిందని, ఎయిర్ టెల్ తాజా పెట్టబుడితో తాము ఆశిస్తున్న మరిన్ని ఫలితాలు వస్తాయన్నారు. రాష్ట్రంలో వేగంగా అభివృద్ధ చెందుతున్న ఐటీ, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎయిర్ టెల్-నెక్స్ ట్రాతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పని చేస్తుందని వివరించారు.