Danam Nagender submits affidavit to Speaker: తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశం ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తనపై దాఖలైన అనర్హత పిటిషన్‌పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు అఫిడవిట్ రూపంలో సమర్పించిన వివరణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.  

Continues below advertisement

తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల పరిష్కారానికి సుప్రీంకోర్టు విధించిన గడువు సమీపిస్తున్న తరుణంలో, ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పీకర్‌కు సమర్పించిన అఫిడవిట్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమని, తాను రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ సభ్యుడినేనని, ఆ పార్టీకి ఎన్నడూ రాజీనామా చేయలేదని ఆయన స్పష్టం చేశారు. 

ఒకవైపు కాంగ్రెస్ కండువా కప్పుకుని, ఆ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసినప్పటికీ, సాంకేతికంగా తాను పార్టీని వీడలేదని వాదించడం ద్వారా అనర్హత వేటు పడకుండా చట్టపరమైన లొసుగులను వెతుక్కున్నట్లుగా కనిపిస్తోంది.  దానం నాగేందర్ తన వివరణలో వినిపించిన అత్యంత కీలకమైన వాదన ఆయన  వ్యక్తిగత హోదా . 2024 మార్చిలో తాను కాంగ్రెస్ పార్టీ సమావేశానికి హాజరైన మాట వాస్తవమేనని అంగీకరిస్తూనే, అది కేవలం వ్యక్తిగత హోదాలో మాత్రమేనని, దానిని పార్టీ మార్పిడిగా పరిగణించలేమని ఆయన సమర్థించుకున్నారు. మీడియా కథనాల ఆధారంగా తాను పార్టీ మారినట్లు బీఆర్ఎస్ భావించడం సరికాదని, చట్టపరంగా తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నానని ఆయన వాదిస్తున్నారు. పార్టీ తనను సస్పెండ్ చేసినట్లు కూడా ఎలాంటి సమాచారం లేదని చెప్పడం ద్వారా, బంతిని మళ్ళీ బీఆర్ఎస్,  స్పీకర్ కోర్టులోకి నెట్టారు.                    

Continues below advertisement

అయితే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న దృశ్యాలు, కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుండి లోక్‌సభకు పోటీ చేసిన రికార్డులు కళ్లముందే ఉన్నాయని బీఆర్ఎస్ నేతలంటున్నారు.  రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం  స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవడం అనే నిబంధన దానంకు స్పష్టంగా వర్తిస్తుందని, ఎంపీగా కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయడమే దానికి అతిపెద్ద నిదర్శనమని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఈ పరిస్థితుల్లో దానం చేసిన వ్యక్తిగత హోదా వాదన కేవలం కాలయాపన చేసేందుకు ఆడుతున్న నాటకమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.                      

ప్రస్తుతం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ నెల 30న వ్యక్తిగత విచారణకు షెడ్యూల్ ఖరారు చేయడంతో  ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు ఇప్పటికే స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ చర్యల హెచ్చరికలు జారీ చేసినందున ఈ విచారణ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దానం నాగేందర్ ఇచ్చిన ఈ వింత వివరణను స్పీకర్ అంగీకరిస్తారా  లేక బహిరంగంగా పార్టీ మారినట్లున్న ఆధారాలను పరిగణనలోకి తీసుకుని అనర్హత వేటు వేస్తారా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.