Smita Sabharwal Car Controversy: సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్‌ను అద్దెకారు వివాదం చుట్టుముట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్శిటికీ తన కారు అద్దె చెల్లింపు బిల్లులు పంపి డ్రా చేసుకున్నారని తాజాగా ఆడిట్ నివేదికలో తేలింది.  కారుకు అద్దె పేరుతో ఆమె ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్శిటీ నుంచి రూ.61 లక్షల రూపాయలు బిల్లులు పెట్టి వసూలు చేసుకోవడంపై ఆడిట్ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.  ఇటీవల జయశంకర్ వర్శిటీలో నిధుల దుర్విని యోగం, అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేయిస్తోంది. ఈ విచారణలో స్మితాసభర్వాల్ కు రూ.61 లక్షలు చెల్లించినట్లుగా తెలింది. 


కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సీఎంవోలో కీలక బాధ్యతలు              


స్మితాసభర్వాల్ కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో సీఎంవోలో కీలకంగా పని చేశారు.  కేసీఆర్ ఆమెకు నీటి పారుదల, ప్రాజెక్టులు వంటి శాఖల్ని అప్పగించారు. ఆమె చాలా సార్లు హెలికాఫ్టర్లలో కూడా వెళ్లి ప్రాజెక్టుల్ని చూసి .. సమీక్ష చేసి వచ్చారు. ఆమె జయశంకర్ వర్శిటీకి తన కారు బిల్లులు ఎందుకు పంపారన్నదానిపై స్పష్టత లేదు.  యూనివర్శిటీ నిధుల్ని కారు అద్దె పేరుతో తీసుకోవడం.. అదీ కూడా భారీగా 61 లక్షలు కావడంతో ఈ విషయం ప్రభుత్వ వర్గాలతో పాటు అధికారవర్గాల్లోని హాట్ టాపిక్ గా మారింది.  ఆమెకు నోటీసులు జారీ చేసి వివరణ అడిగి ఆ తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉంది.           


జయశంకర్ వర్శిటీ నుంచి కారు బిల్లులు ఎందుకు తీసుకున్నారు ? 


స్మితా సభర్వాల్  కార్యాలయం నుంచి బిల్లులు జయశంకర్ యూనివర్సిటికీ వెళ్లేవి. మంజూరు చేసేవారు. ఆడిట్లో ఈ బిల్లులు పై పరిశీలన చేస్తే అసలు అద్దెకు తీసుకున్న కారు  ట్రావెల్స్ ది కాదని తేలడం మరింత వివాదాస్పదంగా మారే అవకాశాలు ఉన్నాయి. .కనీసం టాక్స్ కట్టేది కాదని తేలింది. పవన్ కుమార్ అనే వ్యక్తి పేరు మీద పేరు ఉందని చెబుతున్నారు. ఇది వ్యక్తిగత వాహనం. వ్యక్తిగత వాహనం నిబంధనల ప్రకారం అద్దెకు ఇవ్వడం కుదరదు. ఆ కారును స్మితా సభర్వాల్ నిజంగానే అద్దెకు తీసుకున్నారా లేకపోతే అద్దె పేరుతో బిల్లులు మాత్రమే పెట్టుకున్నారా అనేది తేలాల్సి ఉంది. అదే సమయంలో అసలు జయశంకర్ వర్శిటీకి అ అవకాశం ఎందుకు ఇచ్చారన్నదానిపైనా నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున అవకాశాలు ఉన్నాయి. 


మిస్ వరల్డ్ పోటీలపై దృష్టి పెట్టిన స్మితా సబర్వాల్     


ప్రస్తుతం తెలంగాణ  టూరిజం శాఖ బాధ్యతలను చూస్తున్న స్మితా సబర్వాల్ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో జరిగే విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించేలా ఒప్పించారు. కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం తరపున మిస్ వరల్డ్ పోటీల నిర్వాహకులకు అవసరమైన సాయం అందిస్తున్నారు. ఇప్పుడు ఆమెపై ఈ అద్దెకారు వివాదం రావడంతో వివరణ ఇచ్చుకోవాల్సన పరిస్థితి ఏర్పడింది.