Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసేందుకు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ దేశ రాజదాని ఢిల్లీలో సమావేశమైంది. కాంగ్రెస్ వార్ రూములో స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ నాయకత్వంలో ఈ సమావేశం జరిగింది. స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి జిగ్నేష్ మేవాని, బాబా సిద్దిక్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కీ, భట్టి విక్రమార్క హాజరు అయ్యారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసిన రాష్ట్ర నాయకత్వం.. ఆ నివేదికను ఢిల్లీ సమావేశానికి తీసుకువచ్చింది. 119 నియోజవర్గాలకు దాదాపు 300 పేర్లను స్క్రీనింగ్ కమిటీకి తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సిఫారసు చేసింది. 


కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ బుధవారం కూడా భేటీ అయిన విషయం తెలిసిందే. అభ్యర్థుల ఎంపికపై దాదాపు రెండున్నర గంటల పాటు కసరత్తు చేశారు. అయితే నిన్న లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఓటింగ్ కారణంగా అర్ధాంతరంగా సమావేశం నిలిచిపోయింది. ఈ రోజు సమావేశంతో అభ్యర్థుల ఎంపిక వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. నేడు దాదాపు 40 మంది పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం.


అసంతృప్త స్వరాలు తగ్గించే యత్నం


తెలంగాణ కాంగ్రెస్ లో గతంలోలా పరిస్థితులు లేకుండా సీనియర్ నేతలందర్నీ లైన్లో పెడుతున్నారు. ఎన్నికలకు సంబంధించి కమిటీల్లో ప్రాధాన్యం దక్కడం లేదని ఫీలవుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కీలకు తాజాగా… స్క్రీనింగ్ కమిటీలో చోటు కల్పించారు.. ఇటీవల వారిద్దరూ… అసంతృప్తిగా ఉంటున్నారు. వెంటనే.. పరిస్థితిని చక్కదిద్దేందుకు స్క్రీనింగ్ కమిటీలో చోటు కల్పించారు.   మరో వైపు బుస్సు యాత్రకు కాంగ్రెస్ హైకమాండ్ ప్లాన్ చేసింది. పార్టీ ముఖ్య నేతలతో ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి చేపట్టాలని ప్రాథమికంగా తీర్మానించిన నేతలు.. తేదీలను త్వరలో ఖరారు చేయనున్నారు. ఈ బస్సు యాత్రలో సీనియర్లు అందరూ పాల్గొనే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉందని.. స్థిరమైన పాలన అందిస్తామని ప్రజలకు నమ్మకం కలిగేలా ఈ యాత్ర ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ లో అసంతృప్త స్వరాలు తగ్గిపోయాయి. పెద్దగా పార్టీకి ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడటం లేదు.


రేవంత్ రెడ్డి పూర్తిగా డామినేట్ చేస్తున్నారన్న విమర్శలు, అలకలు ఉన్నప్పటికీ… .ఆయనకు పూర్తిగా చార్జ్ ఇవ్వలేదని… హైకమాండ్ ఆలోచనతోనే అన్నీ జరుగుతున్నాయన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నారు. ఇలాంటి సమయంలో పార్టీకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకునేది లేదన్న సంకేతాలు కూడా గట్టిగా పంపడంతో.. కాంగ్రెస్ లో పరిస్థితి లైన్ లోకి వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.                    


ఎల్బీనగర్ పై మధుయాష్కీ ఆశలు 


ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలో దిగేందుకు మధుయాష్కి గౌడ్ దరఖాస్తు చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. ఇక్కడి నుండి పోటీ చేసేందుకు పార్టీ సీనియర్ నాయకులు జక్కిడి ప్రభాకర్ రెడ్డి, మల్ రెడ్డి రాంరెడ్డిలు సంవత్సరాలుగా తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. టీపీసీసీ పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలు చేపడుగూ నిత్యం ప్రజల మద్య ఉంటూ వస్తున్నారు. ఇలాంటి తరుణంలో మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్ తాను స్థానికుడినే అంటూ ఎల్బీ నగర్ నుండి పోటీ చేసేందుకు ముందుకు రావడంతో సెగ్మెంట్ కాంగ్రెస్ నాయకులలో ఆందోళన మొదలైంది.    ఆయన రాకను వ్యతిరేకిస్తున్న వారు ఏకంగా గాంధీభవన్ లోనే ఆయనకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వేశారు. దీంతో ఎల్బీ నగర్ నుండి పోటీ ఆయన పోటీ చేసి విజయం సాధించడం అంత సులువు కాదనేది స్పష్టం కాగా గ్రూపు తగాదాలు బహిర్గతమయ్యాయి. అయితే ఇదంతా కుట్ర ప్రకారం చేస్తున్నారని ఎల్బీ నగర్‌లో తానే పోటీ చేస్తానని ఆయన అంటున్నారు.