తెలంగాణ అబ్కారీ, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు నమోదైంది. ఏఐసీసీ సభ్యులు బక్క జడ్సన్ తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై ఈ ఫిర్యాదు చేశారు. మంత్రిపై నమోదైన కేసుకు సంబంధించి కేసు నెంబర్ 1989/36/5/2022 నమోదైనట్లుగా ఆయన తెలిపారు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ గన్ ఫైర్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అది తీవ్రమైన విమర్శలకు దారి తీసింది. దీనిపై మంత్రి వివరణ ఇస్తూ అది రబ్బరు బుల్లెట్లు అంటూ సమర్థించుకున్నారు. అయితే, అవి రబ్బర్ బుల్లెట్ అయినా ఒరిజినల్ బుల్లెట్ అయినా చట్ట ప్రకారం పోలీసులు కేసు నమోదు చేయాలని బక్క జడ్సన్ డిమాండ్ చేశారు.


ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడం శోచనీయం అని బక్క జడ్సన్ అన్నారు. బాధ్యతాయుతం అయిటువంటి మంత్రి చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎంత క్రీడల శాఖ మంత్రి అయినా అలా కాల్పులు జరపవచ్చా అని ప్రశ్నించారు. మిస్ ఫైర్ అయి ఎవరికైనా హానీ జరిగితే పరిస్థితి ఏంటి? అని నిలదీశారు. 


‘‘కందుకూరులో టీఆర్ఎస్ నాయకులు ఓ బర్త్ డే పార్టీలో కూడా కాల్పులు జరిపారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేశాము. రాష్ట్రంలో డ్రగ్స్ కల్చర్, గంజాయి కల్చర్, రేపుల కల్చర్, ఇప్పుడు గన్ కల్చర్ కూడా మొదలైంది. బాధ్యత మరిచిన మంత్రిపై చర్యలు తీసుకోవాలి’’ అని బక్క జడ్సన్ డిమాండ్ చేశారు.


గాల్లోకి మంత్రి కాల్పులు
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గాల్లోకి కాల్పులు జరిపారు. మహబూబ్ నగర్ లో నిర్వహించిన ఫ్రీడం ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. పెద్ద ఎత్తున విద్యార్థులు.. యువకులు పాల్గొన్న ర్యాలీ కొనసాగుతున్న సమయంలో హఠాత్తుగా పోలీసుల వద్ద నుంచి ఎస్‌ఎల్ఆర్ తుపాకీని తీసుకున్నారు. గాల్లోకి గురి పెట్టి కాల్పులు జరిపారు. ఒక్క సారిగా తూటాల శబ్దం వచ్చే సరికి ఆ చుట్టుపక్కల ఉన్న చాలా మందికి ఏం జరిగిందో అర్థం కాలేదు. తర్వాత మంత్రిగారే గాల్లోకి కాల్పులు జరిపారని తేలింది. మంత్రి గాల్లోకి కాల్పులు జరుపుతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. శ్రీనివాస్ గౌడ్ కాల్పులు జరుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సంచలనంగా మారింది. ఎంత మంత్రి అయితే మాత్రం ఇలా గాల్లోకి కాల్పులు జరుపుతారా అని ప్రశ్నిస్తున్నారు. తక్షణం మంత్రిపై చర్యలు తీసుకోవాలని... గన్ ఇచ్చిన పోలీసుల అధికారిపైనా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. సాధారణంగా పెళ్లి బారాత్‌లలో కొంత మంది ఇలా గాల్లోకి లైసెన్స్‌డ్ తుపాకులతో కాల్పులు జరిపినా తీవ్రమైన కేసులు పెడతారు. ఇప్పుడు మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


మంత్రి వివరణ
మహబూబ్ నగర్ లో పోలీసుల ఆధ్వర్యంలో ఫ్రీడం వాక్ జరిగిందని, ఈ వాక్ లో తాను నిజమైన తుపాకీ పేల్చినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇష్టానుసారంగా కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ర్యాలీలు జరిగినపుడు బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ తో గాల్లోకి కాల్చడం పరిపాటి అన్న మంత్రి  మూడు రోజుల క్రితం కూడా వరంగల్ లో బ్లాంక్ గన్ తో గాల్లోకి కాల్చానన్నారు. 


బుల్లెట్లు లేవు 
బుల్లెట్లు ఉండని గన్ తో కాలిస్తే చప్పుడే వస్తుంది. బుల్లెట్లు ఉండవు కనీసం పిల్లెట్లు కూడా ఉండవు. జిల్లా ఎస్పీ స్వయంగా గన్ ఇచ్చారు. ఎస్పీకి గన్ ఇచ్చే అధికారం ఉంది. నేనంటే గిట్టని వారే మొదటి నుంచి బట్ట కాల్చి మీదెస్తున్నారు. 25 వేల మంది ర్యాలీలో పాల్గొనడం మహబూబ్ నగర్ లో ఇదే ప్రథమం. దీంతో కొందరి కళ్ళు మండుతున్నాయి. నేను కూడా జర్నలిజం చదివాను. వార్తలు రాసే ముందు కనీస వివరణ తీసుకోవాలన్న సోయి లోపించడం బాధాకరం.  క్రీడల మంత్రిగా నాకు కొన్ని అధికారాలు ఉన్నాయని తెలుసుకోవాలి. వరంగల్ లో రాని వివాదం మహబూబ్ నగర్ లో ఎందుకు వస్తోంది. బురద జల్లే పద్దతి రాజకీయాల్లో మంచిది కాదు. - మంత్రి శ్రీనివాస్ గౌడ్