Revanth Davos Tour: తెలంగాణలో పెట్టుబడులపై దృష్టిపెట్టింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. పెట్టుబడులపై దృష్టి సారించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు  తీసుకుంటున్నారు. పారిశ్రామిక, ఐటీ విధానాలపై కసరత్తు చేస్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి... దావోస్‌ పర్యటనకు వెళ్తున్నారు. దావోస్‌లో  నిర్వహించనున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరుకానున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసింది సీఎంవో. ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు  స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఆయన పర్యటిస్తారు. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సదస్సుకు ఆయన హాజరుకానున్నారు. దావోస్‌లో నిర్వహించనున్న ప్రపంచ  ఆర్థిక సదస్సుకు ప్రముఖ గ్లోబల్‌ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో రేవంత్‌ సమావేశం కానున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే అవకాశాలు, ప్రయోజనాల  గురించి వారికి వివరించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.


దావోస్‌లో ప్రతి ఏడాది ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతుంది. వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు, మల్టీ నేషనల్ కంపెనీల అధినేతలు, పెట్టుబడిదారులు  హాజరవుతుంటారు. భారత్ నుంచి ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్ర, కుమార మంగళం బిర్లా, గౌతమ్ అదాని.. వంటి పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు క్రమం తప్పకుండా  హాజరవుతుంటారు. కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సదస్సులో పాల్గొంటుంటారు. తమ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకుని రావడానికి  ప్రయత్నాలు సాగిస్తుంటారు. ఈ ఏడాది తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో దావోస్‌లో జరగనున్న సదస్సుకు రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. 


దావోస్‌ పర్యటనకు సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వెళ్లనున్నారు. వాళ్లతోపాటు ముఖ్యమంత్రి కార్యదర్శి వి.శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి  బి.అజిత్‌రెడ్డి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పెట్టుబడుల వ్యవహారాల విభాగం ప్రత్యేక కార్యదర్వి విష్ణువర్ధన్‌రెడ్డి, మీడియా ప్రతినిధి కర్రి శ్రీరామ్, ముఖ్య  భద్రతాధికారి తస్ఫీర్ ఇక్బాల్, ఉదయ సింహా, గుమ్మి చక్రవర్తి వెళ్తున్నారు. 


తెలంగాణలో పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా.. సీఎం రేవంత్‌రెడ్డి దావోస్‌ పర్యటనకు వెళ్తున్నారు. తెలంగాణకు కొత్త పెట్టుబడులు తెచ్చేందుకు కృషిచేయనున్నారు.దావోస్‌లో నాలుగు రోజుల పాటు జరిగే చర్చల్లో తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంపై అంతర్జాతీయ వ్యాపార సంస్థల ప్రతినిధులతో మాట్లాడనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. గత ఏడాది జనవరి మూడో వారంలో చివరి డబ్ల్యూఈఎఫ్‌ పర్యటన జరగగా... అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలోని బృందం హాజరైంది. ఆ సమయంలో..కేటీఆర్ సుమారు రూ.21వేల కోట్ల పెట్టుబడులను పొందినట్లు సమాచారం. ఈ ఏడాది తెలంగాణలో విదేశీ కంపెనీలు పారిశ్రామిక యూనిట్లను ఏర్పాటు చేసేందుకు రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం చర్చలు జరపనుంది. విదేశీ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, సౌకర్యాలను ఈ బృందం వివిధ కంపెనీల ప్రతినిధులకు వివరించనుంది. ఐటీ, ఫార్మా, బయో, ఏరోస్పేస్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ రంగాల్లో అవలంబిస్తున్న విధానాలు, విదేశీ పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యత వంటి అంశాల గురించి వివరించనున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.